భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఉపయోగించిన ఎస్జీ బాల్స్ నాణ్యతను సమీక్షించాలని బీసీసీఐ తాజాగా ఆ తయారీ సంస్థ యాజమాన్యాన్ని కోరింది. తొలి టెస్టు తర్వాత టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ బంతులు సరిగ్గా లేవని బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో బీసీసీఐ తమను సంప్రదించిందని ఎస్జీ మార్కెటింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్ మీడియాకు తెలిపారు.
తమకొచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని, పలువురు ఆటగాళ్లు కూడా పిచ్ గురించి ఫిర్యాదులు చేశారని ఆనంద్ పేర్కొన్నారు. చెన్నై లాంటి పిచ్లపై బంతి ఎలా స్పందిస్తుందనే విషయాలను తాము తెలుసుకుంటామని ఆయన అన్నారు. తమ 'రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్' బృందం వాటిని పూర్తిగా పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తామని చెప్పారు.
కాగా, కోహ్లీ గతంలోనూ ఒకసారి ఎస్జీ బాల్స్పై ఫిర్యాదు చేశాడు. 2018 అక్టోబర్లో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ సందర్భంగా బంతి నాణ్యత బాగోలేదని చెప్పాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో తొలి టెస్టులో 60 ఓవర్లకే బంతి చెడిపోయిందని అన్నాడు. అశ్విన్ సైతం ఈ బంతులపై స్పందించాడు. తానెప్పుడూ ఎస్జీ బాల్స్ను ఇలా చూడలేదన్నాడు.
ఇదీ చూడండి: 'అదే జరిగితే.. కోహ్లీ తప్పుకుంటాడేమో'