తెలుగులో పాన్ ఇండియా సినిమాల హవా 'బాహుబలి' చిత్రాలతో మొదలైంది. అవి సాధించిన విజయం, వసూళ్లు మరింత ధైర్యంగా అడుగేయడానికి కారణమయ్యాయి. అందరికీ తెలియాల్సిన కథ ఉందనుకుంటే చాలు.. దాన్ని ఓ భాషకో, ప్రాంతానికో పరిమితం చేయడానికి దర్శకనిర్మాతలు ఇష్టపడటం లేదు. మరిన్ని హంగులు జోడించి దానికి పాన్ ఇండియా కలర్ ఇస్తున్నారు. దాంతో వాటి స్థాయి, మార్కెట్ మరింత విస్తృతం అవుతోంది. అలా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువవ్వడమే లక్ష్యంగా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటికి బాలీవుడ్ మద్దతూ లభిస్తోంది.
బాహుబలితో మొదలై..
'బాహుబలి' చిత్రాలతో భాషల మధ్య సరిహద్దులు చెరిగిపోయాక.. 'సైరా నరసింహారెడ్డి', 'సాహో' సినిమాలు ఆ పరంపరను కొనసాగించాయి. ఇప్పుడు ప్రభాస్తో పాటు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మంచు విష్ణు, మంచు మనోజ్, విజయ్ దేవరకొండ జాతీయ స్థాయిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాన్ ఇండియా బాట పట్టిన టాలీవుడ్ తారలెవరో చూద్దాం.
అందుకే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్
రెబల్స్టార్ ప్రభాస్ 'బాహుబలి' ఇచ్చిన జోష్తో వరుస పాన్ ఇండియా చిత్రాలు తీస్తున్నారు. ఈ హీరో నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనం అని అభిమానులు భావిస్తుండగా ఏకంగా నాలుగు పాన్ ఇండియా చిత్రాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా.. నాగ్అశ్విన్తో సైన్స్ ఫిక్షన్ మూవీ, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో 'ఆదిపురుష్', 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్తో 'సలార్' సినిమా చేస్తున్నారు డార్లింగ్. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.
![Tollywood Heroes interest on Pan India movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10091958_565_10091958_1609578078168.png)
పవన్ కల్యాణ్-క్రిష్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ ఇందులో కనిపించనున్నారని టాక్. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని చూస్తోంది చిత్రబృందం. దీంతో పవన్ జాతీయ స్థాయి సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనా కరోనా కారణంగా నిలిచిపోయింది. లాక్డౌన్ ఆంక్షలు తొలగిన నేపథ్యంలో త్వరలోనే ఈ షూటింగ్ మొదలు కానుంది. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది.
![Tollywood Heroes interest on Pan India movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10091958_pan-6.jpg)
ఆర్ఆర్ఆర్
'బాహుబలి' చిత్రాల తర్వాత దర్శకధీరుడు జక్కన్న చెక్కుతున్న మరో కళాఖండం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, తారక్ హీరోలు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచీ అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ పాన్ ఇండియా కథను కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
![Tollywood Heroes interest on Pan India movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10091958_pan-8.jpg)
పుష్ప
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు తెలుగుతో పాటు మలయాళం, కన్నడంలో భారీ అభిమానగణమే ఉంది. అందుకే ఈ హీరో చేసిన సినిమాలు ఆ భాషల్లోనూ విడుదలై మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం సుకుమార్తో చేస్తోన్న 'పుష్ప' చిత్రాన్ని నేరుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.
![Tollywood Heroes interest on Pan India movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10091958_pan-2.jpg)
ఫైటర్(టైటిల్ ఖరారు చేయలేదు)
'అర్జున్ రెడ్డి'తో ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు వచ్చిన స్పందనతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్తో 'ఫైటర్'(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు విజయ్. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవనుంది.
అహం బ్రహ్మాస్మి
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'అహం బ్రహ్మాస్మి'. వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా సినిమాలు చేయని మనోజ్.. ఒకేసారి పాన్ ఇండియా చిత్రం ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.
![Tollywood Heroes interest on Pan India movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10091958_pan-3.jpg)
మోసగాళ్లు
మంచు కుటుంబం నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం 'మోసగాళ్లు'. విష్ణు మంచు కథానాయకుడిగా, నిర్మాతగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోకు సోదరిగా కనిపించనుంది. సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. భారత్లో మొదలై, అమెరికాను వణికించిన అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో దీనిని తీస్తున్నారు.
![Tollywood Heroes interest on Pan India movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10091958_pan-1.jpg)
గుణశేఖర్ రెండు భారీ చిత్రాలు
తెలుగు చిత్రపరిశ్రమలో పౌరాణిక, సాంఘీక చిత్రాల దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు గుణశేఖర్. 'రుద్రమదేవి' చిత్రం తర్వాత రానా ప్రధానపాత్రలో 'హిరణ్య కశ్యప' అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎప్పుడో సెట్స్పైకి తీసుకెళ్లాల్సినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో ఈ గ్యాప్లో ఇతిహాస ప్రేమకథతో కూడిన 'శాకుంతలం' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్. నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">