'ఏందిరా... అబ్బి' అంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకమైన శైలితో కూడిన యాసతో గుర్తింపుపొందారు నటుడు జయప్రకాశ్ రెడ్డి. ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రల్లో కొన్ని వందల చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు హీరో అవ్వాలని కోరిక ఉండేదట. అలా ఓ ప్రయోగాత్మక చిత్రంలో ప్రధానపాత్రలో నటించారు. ఇందులో కేవలం జయప్రకాశ్ రెడ్డి ఒక్కరే పాత్రధారి కావటం విశేషం.
![jayaprakash reddy as hero](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8721096_1.jpg)
'అలెగ్జాండర్'’ పేరుతో తెరకెక్కిందీ సినిమా. 'ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం' అనేది ట్యాగ్ లైన్. 'చైతన్యరథం', 'ఎర్రమల్లెలు', 'యువతరం కదలింది', 'ఎర్రమట్టి' వంటి విప్లవాత్మక సినిమాలు చేసిన ధవళ సత్యం ఈ సినిమా దర్శకుడు. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. రిటైర్డ్ మేజర్ ఒక హెల్ప్లైన్ ద్వారా కొందరి సమస్యలను తీర్చడం కథాంశం.
ఆసక్తి చూపించలేదట..!
మార్చిలోనే ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించాలనుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత కరోనా రావడం, థియేటర్లు మూతపడటం వల్ల కనీసం ఓటీటీ వేదికగా అయినా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనుకున్నారు. సెప్టెంబర్ 8న జయప్రకాశ్ రెడ్డి అనూహ్యంగా గుండెపోటుతో మృతి చెందారు.