కథానాయకుడిగా... సహ నటుడిగా పలు చిత్రాల్లో మెరిశాడు శివాజీ రాజా. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన అతడు దాదాపుగా 300 చిత్రాలు చేశాడు. నేడు అతని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. తండ్రి భీమవరంలోని డి.ఎన్.ఆర్ కళాశాలలో అటెండరుగా పని చేసేవాడు. శివాజీ రాజా హైదరాబాద్లో పాలిటెక్నిక్ పూర్తి చేసి నటనలో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం గొల్లపూడి రాసిన 'కళ్ళు' నాటిక ఆధారంగా, అదే పేరుతో ఎం.వి.రఘు తెరకెక్కించిన చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఈ సినిమాలో అతని నటనకి నంది అవార్డు కూడా వరించింది.
ఆ తరువాత అతడి ప్రయాణం మరింత ఊపందుకుంది. 'సముద్రం', 'పెళ్ళిసందడి', 'సిసింద్రీ', 'ఘటోత్కచుడు', 'మురారి', 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'విరోధి'... ఇలా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. అతడు కథానాయకుడిగా, నటుడు రంగనాథ్ దర్శకత్వం వహించిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
వెండితెరతో పాటు... బుల్లితెరతోనూ అతడు అనుబంధాన్ని పెంచుకున్నాడు. పలు ధారావాహికల్లో నటించి ఇంటింటికీ చేరువయ్యాడు. ముఖ్యంగా 'అమృతం' ధారావాహిక అతడికి మంచి పేరును తీసుకొచ్చింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కి అధ్యక్షుడిగా కొనసాగాడు. కళాకారుల సంక్షేమం కోసం పాటు పడుతున్నాడు.
ప్రస్తుతం తెలుగులో ఒక గుర్తింపు పొందిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. శివాజీరాజాకి భార్య అరుణ, కూతురు మేఘన, కుమారుడు విజయ్ ఉన్నారు.
ఇదీ చూడండి : చరణ్ కొత్త సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా..!