కణకణ మండే నిప్పుకణాల్లాంటి సినిమాలకు ఆయన రూపకర్త. వ్యధార్త జీవుల యదార్థ గాథలకు వెండితెరరూపమిచ్చే సృష్టికర్త. నేటి భారతంలోని సరికొత్త పర్వాల సిగ్గుమాలినతనాన్ని నిగ్గదీసి అడిగే సృజనశీలి. వందేమాతర గీతం వరుస మారకూడదని, జాతి జీవనం సుభిక్షంగా ఉండాలని తాపత్రయపడ్డ వ్యక్తి ఆయన. ఆయనే... తెలుగులో విప్లవాత్మక దర్శకుడిగా గుర్తింపు పొందిన తొట్టెంపూడి కృష్ణ. ఈ దర్శకుడు తెరకెక్కించిన 'ప్రతిఘటన', 'రేపటి పౌరులు', 'నేటి భారతం' వంటి సినిమాలు పురస్కారాలనూ అందుకున్నాయి. ఈతరం పిక్చర్స్ బ్యానర్పై పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు టి.కృష్ణ (అక్టోబర్ 21, 1986) వర్ధంతి నేడు.
నేపథ్యం
ఒంగోలు ప్రాంతంలోని టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో జనవరి 1, 1950న జన్మించారు. తల్లితండ్రులు తొట్టింపూడి వెంకటసుబ్బయ్య, రత్తమ్మ.
కెరీర్
డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమాల్లో దర్శకునిగా రాణించాలని నిర్ణయించుకుని 1972లో గుత్తా రామినీడు దగ్గర 'తల్లీ కూతుళ్లు' చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. కానీ అక్కడి సినిమా వాతావరణం నచ్చక సొంతూరికి వచ్చేసి తన మామ నిర్వహిస్తున్న పొగాకు వ్యాపారం చూసుకుంటూ ఉండేవారు. అభ్యుదయ భావాలు గల కృష్ణ తనే సొంతంగా కథలు తయారు చేసుకొని వాటిని ఎవరికి ఎలా చెప్పాల్లో, ఎలా తీయాలో ఆలోచిస్తూ ఉండేవారు. అప్పట్లో నిడదవోలుకి వ్యాపార నిమిత్తం వస్తూపోతూ ఉండేవారు. అక్కడ ఒంగోలుకి చెందిన పోకూరి బాబురావు ఆంధ్రాబ్యాంక్లో పనిచేస్తూ ఉండేవారు. అతనితో టి.కృష్ణ సినిమాల గురించి చర్చలు జరిపేవారు. ఇద్దరూ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నటుడు మాదాల రంగారావు తీసిన 'యువతరం కదిలింది' చిత్రానికి టి.కృష్ణ, బాబురావులు నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దర్శకత్వ బాధ్యతలు
తొలిసారి పోకూరి బాబురావు నిర్మాతగా ఈతరం పిక్చర్స్ పతాంకపై 'నేటిభారతం' చిత్రానికి దర్శకత్వం వహించారు కృష్ణ. ఈ సినిమా 1983లో పూర్తయ్యింది. ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు, ఉత్తమ దర్శకుడిగా టి.కృష్ణకి, ఉత్తమ గేయరచయితగా శ్రీశ్రీకి నంది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత 1984లో 'దేశంలో దొంగలు పడ్డారు' చిత్రానికి దర్శకత్వం వహించారు.
'ప్రతిఘటన' అలా మొదలైంది
అప్పట్లో మద్రాసులోని టి.కృష్ణ తనతోటి మిత్రులతో కలిసి పాండిబజారులో ఓ కథ గురించి చర్చిస్తూ ఉన్నారు. పక్కనే భోజనం చేస్తున్న ఉషాకిరణ్ మూవీస్కి సంబంధించిన అట్లూరి రామారావు వీళ్లు చర్చించుకుంటున్న వాదన అంతా వింటున్నారు. టి.కృష్ణ వాదనలోని నిబద్ధతను గమనించి వాళ్లతో మాటలు కలిపిన రామరావు.. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ అధిపతి, నిర్మాత రామోజీరావుకి టి.కృష్ణను పరిచయం చేశారు. అప్పుడే ఉషాకిరణ్ మూవీస్ రామోజీరావు.. రాజకీయ గుండాల అరాచక చర్యల మీద చిత్రం తీయాలని అనుకోవడం, దానికి టి.కృష్ణ దర్శకత్వం వహించాలని నిర్ణయించడం జరిగింది. ఆ చిత్రమే 'ప్రతిఘటన'.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రేక్షకాదరణా ఎక్కువే
విప్లవాత్మకమైన సినిమాలైనప్పటికీ ప్రేక్షకాదరణ పొందడంలో టి. కృష్ణ సినిమాలు ముందు ఉండేవంటే అతిశయోక్తి లేదు. ఈ దర్శకుడి సినిమాలలో పాటలు కూడా ఎంతో వినసొంపుగా ఉండేవి. అలాగే మేలుకొలుపుగా ఉండేవి.
మర్చిపోలేని సినిమాలు
ఈ దర్శకుడి నుంచి వచ్చిన 'ప్రతిఘటన’'సినిమా ఎన్నో ప్రశంసలను అందుకొంది. ఈ చిత్రం భారతదేశంలో అవినీతి, నేర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఓ స్త్రీ కథతో తెరకెక్కింది. విజయశాంతి, చంద్రమోహన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'రేపటి పౌరులు' సినిమా టి.కృష్ణకు చివరి సినిమా. ఆయన చనిపోయిన తర్వాత ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో రాజశేఖర్, విజయశాంతి, అనురాధ ముఖ్యపాత్రలు పోషించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నంది, ఫిలింఫేర్ పురస్కారాలను అందుకొందీ సినిమా.
వ్యక్తిగత జీవితం
టి.కృష్ణకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. మొదటి కుమారుడి పేరు ప్రేమ్ చంద్. తండ్రిలాగే సినిమా పరిశ్రమలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ఆకాంక్షించాడు. మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తూ కారు ప్రమాదంలో 1995లో చనిపోయాడు. టి.కృష్ణ రెండవ కుమారుడి పేరు గోపీచంద్. ప్రస్తుతం టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్న హీరో. కృష్ణ చనిపోయినప్ప్పుడు గోపీచంద్కు కేవలం ఎనిమిది సంవత్సరాలే. 'తొలి వలపు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. అయితే ఆ తరువాత 'జయం' సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. అనంతరం 'వర్షం' సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించాడు. 'యజ్ఞం' సినిమాతో మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. టి.కృష్ణకి ఒక కూతురు ఉంది. ఆమె దంత వైద్యురాలు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరణం
సినిమా పరిశ్రమలో విప్లవాత్మక దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే టి.కృష్ణ క్యాన్సర్ వ్యాధితో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి సినిమా ప్రముఖులను, అభిమానులను శోక సముద్రంలోకి నెట్టేశారు. 1986, అక్టోబర్ 21న కన్నుమూశారు.
ఇవీ చూడండి.. ఓటుకై కదిలిన బాలీవుడ్ తారాగణం