యశ్ చోప్రా.. 1932 సెప్టెంబరు 27న అవిభాజ్య భారతదేశంలోని లాహోర్లో ఓ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు యశ్ రాజ్ చోప్రా. సహాయ దర్శకునిగా సినీ కెరీర్ను ప్రారంభించిన యశ్.. 27ఏళ్ల వయసులో తొలిసారిగా 'ధూల్ కా పూల్' (1959) చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు.
'బిగ్ బీ'తో అనుబంధం
'దీవార్' (1975) సినిమా విడుదల తర్వాత యశ్ పేరు బాలీవుడ్లో ఓ బ్రాండ్గా మారిపోయింది. అమితాబ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్నే సృష్టించింది. యశ్ తీసిన చిత్రాలతోనే బిగ్బీ బాలీవుడ్లో స్టార్ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత యశ్ - అమితాబ్ల కలయికలో వచ్చిన 'కభీ కభీ', 'త్రిశూల్', 'కాలా పత్తర్', 'సిల్సిలా' వంటి సినిమాలు బ్లాక్బాస్టర్గా నిలిచాయి.
స్త్రీ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత
ఆయన తీసిన 'చాందినీ', 'లమ్హే', 'కభీ కభీ' వంటి ప్రేమకథా చిత్రాలను చూస్తుంటే.. ఆయనలోని స్త్రీ పక్షపాత ధోరణి చాలా చక్కగా కనిపిస్తుందంటారు సినీ ప్రియులు.
ట్రెండ్ సెట్టర్
ఇక యశ్ తన తనయుడు ఆదిత్యా చోప్రాను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' (1995) చిత్రంతో భారతీయ చిత్రసీమకు గొప్ప గుర్తింపును అందించారు. 'ధూమ్' సిరీస్ చిత్రాలతో సినీ ప్రియులకు ఓ సరికొత్త యాక్షన్ ట్రెండ్ను పరిచయం చేశారు యశ్ చోప్రా. 'ఫనా', 'చక్ దే ఇండియా', 'రబ్ నే బనాది జోడీ', 'సలామ్ నమస్తే’', 'ఇష్క్ జాదే', ‘'బ్యాండ్ బాజా బారాత్' వంటి మెచ్చుకోదగ్గ చిత్రాలన్నీ యశ్ ప్రత్యేకతను బాలీవుడ్ ప్రేక్షకులకు రుచిచూపించాయి.
అవార్డులు-రికార్డులు
మొత్తం ఐదు దశాబ్దాల పాటు సాగిన యశ్ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, గౌరవాలను దక్కించుకున్నారు. 2001లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2005లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను తీసుకున్నారు.
చివరికి 2012 అక్టోబరు 21న డెంగీ జ్వరంతో మరణించారు.
ఇదీ చూడండి : అమెరికన్ పాప్ సింగర్ సంస్కృత ట్వీట్