హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'అవతార్ 2'. గతంలో వచ్చిన 'అవతార్' చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సందర్భంగా జేమ్స్ కామెరూన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. రెండో భాగం విడుదలపై క్లారిటీ ఇచ్చారు.
"మేం ఈ సినిమాను లాక్డౌన్ కంటే ముందుగానే న్యూజిలాండ్లో షూటింగ్ చేయడానికి సిద్ధమయ్యాం. కానీ ఈ వైరస్తో ఆలస్యమైంది. అయితే త్వరలోనే న్యూజిలాండ్లో షూటింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ అక్కడ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వైరస్ను పూర్తిగా నిర్మూలించడం కష్టం. కానీ వైరస్ను నియంత్రించడానికి అక్కడి ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య కాలంలో సినిమా వాయిదా పడటం వల్ల పనులు ఆలస్యమైనా, మరికొన్ని అంశాల్లో ఈ సమయం మంచి అవకాశంగాను ఉపయోగపడింది. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో కొన్ని పనులను ఇంటి దగ్గర నుంచే పూర్తి చేశాం. అందరూ బాగానే పనిచేశారు. కొన్ని పనులను మిగతావారిలా పనిచేయలేకపోయాను. ఎట్టి పరిస్థితుల్లోను మేము డిసెంబర్ 17, 2021న 'అవతార్ 2'ను విడుదల చేసేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం."
-జేమ్స్ కామెరూన్, హాలీవుడ్ దర్శకనిర్మాత
ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్దానా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, భారతీయ సంతతికి చెందిన దిలీప్ రావు తదితరులు నటిస్తున్నారు. సుమారు 12 ఏళ్ల కిత్రం కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన 'అవతార్' అంతర్జాతీయంగా వసూళ్ల వర్షం కురిపించింది. ఫలింతగా రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.