చిత్రసీమలోకి వచ్చినప్పటి నుంచీ కెరీర్ను విభిన్న పాత్రలతో కొనసాగిస్తున్న హీరో రానా. వెండితెరపై 'లీడర్'గా వచ్చి ‘బాహుబలి’, ‘ఎన్టీఆర్ బయోపిక్’ వంటి చిత్రాలలో నటించాడు. కథ నచ్చితే నాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగానూ కనిపించేందుకు వెనుకాడడు. తాజాగా రానా 'హిరణ్యకశ్యప' అనే భక్తిరస చిత్రాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు దర్శకుడు గుణశేఖర్.
చరిత్రాత్మక చిత్రాలు తీయడంలో శేఖర్ది అందెవేసిన చేయి. ఈ కొత్త చిత్రం కథ కోసమే దాదాపు మూడేళ్లు శ్రమించినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
" మీ అందరితో ఓ విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. రానా దగ్గుబాటి ప్రధానపాత్రలో హిరణ్యకశ్యప అనే భక్తిరస చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నాను. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పైనే దృష్టి పెట్టాను. ఈ చిత్రానికి 3 సంవత్సరాలు కచ్చితంగా అవసరమే. ఇంత సమయం తీసుకున్నా అంటే అర్థం చేసుకోవచ్చు దీనిపై ఎంతగా పరిశోధన చేశానో. త్వరలోనే మరిన్ని వివరాలు, విశేషాలు పంచుకుంటాను".
-- గుణశేఖర్, సినీ దర్శకుడు
ప్రస్తుతం రానా చేతిలో ఉన్న ‘హాథీ మేరీ సాథీ’, హౌస్ఫుల్ 4’ వంటి చిత్రాలున్నాయి. 'నీదీ నాదీ ఒకే కథ’ వంటి వైవిధ్యమైన చిత్రంతో తెరంగేట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు వేణు ఉడుగులతో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి 'విరాటపర్వం 1992' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రానాకు జోడీగా సాయిపల్లవి కనిపించనుంది. రూ.35 కోట్ల బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఇందులో 'మావోయిస్టు' పాత్రలో సాయిపల్లవి నటిస్తుండగా, రానా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు.