టీమ్ఇండియాకు విదేశాల్లో తొలి టెస్టు విజయం రుచి చూపించిన సారథి ఆయన. తనదైన బ్యాటింగ్తో దశాబ్దం పాటు భారత క్రికెట్కు వెన్నెముకలా నిలిచారు. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఏకంగా 15,425 పరుగులు చేసిన ఘనత ఆయనది. ఆయనే మన్సూర్ అలీఖాన్ పటౌడి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తండ్రి. అయితే, పటౌడి కెరీర్లో ఒక విషాదం ఉంది. 1961లో ఇంగ్లాండ్లో కారు ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయన కుడి కన్ను కనిపించదు. అయినా అలాగే క్రికెట్ ఆడి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తాజాగా సైఫ్ అలీఖాన్ 'స్పోర్ట్స్ క్రీడా'తో మాట్లాడుతూ.. తన తండ్రి వైకల్యంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జాఫ్రేబాయ్కాట్ చేసిన వ్యాఖ్యలను వివరించాడు. ఆ మాటలు తనకు, తన తండ్రికి కోపం తెప్పించాయని చెప్పాడు.
"నేను అభిమానించే బాయ్కాట్ ఒకసారి నాతో ఇలా అన్నాడు. 'మీ నాన్న గారి గురించి విన్నాను. కానీ, ఒకే కంటితో టెస్టు క్రికెట్ ఆడటమనేది అసాధ్యం' అని చెప్పాడు. దాంతో నేను మా నాన్న అబద్ధం చెబుతున్నారని మీరు అనుకుంటున్నారా?అని అడిగాను. దానికి అతడు స్పందిస్తూ.. 'అవును నేను అలాగే అనుకుంటున్నా' అని బదులిచ్చాడు. అలా అనేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అదే విషయం మా నాన్నకి చెబితే ఆయన కూడా ఆవేశపడ్డారు. రెండు కళ్లతో నాకు బాగా కనపడేది.. ఒక కంటితో కూడా బాగానే కనపడుతోందని మా నాన్న అన్నారు"
- సైఫ్, కథానాయకుడు
పటౌడి 1961 నుంచి 1975 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడారు. అందులో 40 మ్యాచ్లకు కెప్టెన్సీ చేశారు. ఆయన సారథ్యంలోనే భారత్ 1967లో తొలిసారి న్యూజిలాండ్లో ఆ జట్టును టెస్టు సిరీస్లో ఓడించింది. 34.91 సగటుతో ఆరు శతకాలు, 16 అర్ధ శతకాలు సాధించారు.
ఇది చూడండి : ఈ ప్రపంచ సుందరికి చెస్ అంటే మక్కువట!