గమ్మత్తు కలిగించే మాదక ద్రవ్యాలు... ప్రముఖ సినీ నటులు, సంగీతకారుల మెడకు చుట్టుకున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం.. ప్రస్తుతం బాలీవుడ్కూ చెమటలు పట్టిస్తోంది. యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషయంలో దర్యాప్తు చేపట్టిన బృందాలకు.. డ్రగ్స్ కోణం కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ దిశగా తొలి అడుగు వేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నెమ్మదిగా తీగలాగుతోంది.
వ్యవహారం అలా వెలుగులోకి..
ఆగస్టు 21న బెంగళూరు కల్యాణ్నగర్లోని రాయల్ సూట్స్ హోటల్ అపార్ట్మెంట్లో పర'వశపరిచే' ఎక్స్టసీ బిళ్లలు, రూ.2.25 లక్షల నగదు పోలీసులకు చిక్కడం వల్ల దీని వెనుక అసలు కథ వెలుగు చూస్తోంది. తీగను లాగితే డొంక కదిలినట్లుగా... మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) దీనిపై దర్యాప్తు చేస్తున్నకొద్దీ ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు బయటపడుతున్నాయి.
"హోటల్లో మొదట 96 పిల్స్ దొరికాయి. తర్వాత వీటిని సరఫరా చేస్తున్న ఓ మహిళ ఇంటి నుంచి 270 ఎక్స్టసీ బిళ్లలను స్వాధీనం చేసుకున్నాం. తనిఖీల సందర్భంగా ఎం.అనూప్, ఆర్.రవీంద్రన్, అనిఖాలను అదుపులోకి తీసుకున్నాం. ప్రముఖ సంగీత కళాకారులకు, నటులకు, విద్యార్థులకు, చిన్నారులకు ఈ పిల్స్ను వారు విక్రయిస్తున్నట్టు ప్రాథమికంగా తెలిసింది" అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్ర వెల్లడించారు.
బిట్ కాయిన్స్ ద్వారా ఆన్లైన్లో ఈ మాత్రలను కొనుగోలు చేసినట్టు గుర్తించామనీ, కొద్దిరోజుల కిందట ఇదే తరహా మాత్రలను కొనుగోలు చేసిన జంటను.. ముంబయిలో పట్టుకున్నామని ఆయన చెప్పారు. పార్టీల్లో పాల్గొనే యువత అంతులేని ఉత్సాహం కోసం ఈ మాత్రలను ఉపయోగిస్తుంటారు. ఐరోపా దేశాల్లో ఇది ఎక్కువగా తయారవుతుంది.
సుశాంత్కు డ్రగ్స్ అలవాటు?
జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో బలన్మరణానికి పాల్పడిన సుశాంత్కు డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు ఆ ఇంటి హౌస్కీపర్ నీరజ్ సింగ్ ఇటీవలే వెల్లడించాడు. చనిపోయే గంటల ముందు హీరో గంజాయి సిగరెట్లు తాగినట్లు పేర్కొన్నాడు. సుశాంత్, రియా తన స్నేహితులతో కలిసి వారానికి ఒకటి లేదా రెండుసార్లు పార్టీ చేసుకునేవారని.. ఆ సమయంలో గంజాయి సేవించేరని చెప్పుకొచ్చాడు. అనంతరం ఆ కోణంలోనూ విచారణ ప్రారంభించారు అధికారులు.
రియాపైనా కేసు!
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి విషయమై ఎన్సీబీ రంగంలోకి దిగింది. నిషేధిత ఉత్ప్రేరకాల మార్కెట్తో ఆమెకు సంబంధం ఉందంటూ కేసు నమోదు చేసింది.
రియా చక్రవర్తి రూ.17 వేలు చెల్లించి రెండు బ్యాగ్ల గంజాయి కొన్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని ఇవ్వాలని సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరండా చెప్పగా.. సిబ్బందిలో ఒకడైన దీపేశ్ సావంత్కు రియా చెల్లించినట్లు కొన్ని వాట్సాప్ సందేశాలు సోషల్మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై దృష్టిసారించిన ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్థాన.. సాక్షాధారాలను పరిశీలించి, న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాక రియాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్సీబీ అధికారులు త్వరలోనే రియాతో పాటు మరికొందరిని ఈ వ్యవహారంపై ప్రశ్నించనున్నట్టు చెప్పాయి.
న్యాయవాది మాత్రం నిరాకరణ
సుశాంత్సింగ్ మృతి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు రంగంలోకి దిగాయి. రియా వాట్సప్ ద్వారా నిషేధిత డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన సందేశాలను డిలీట్ చేసిందని, దీనిపై ఈడీ ఇదివరకే ప్రశ్నించిందని అధికారులు తెలిపారు. అయితే, నిషేధిత మాదక ద్రవ్యాలతో రియాకు సంబంధం లేదని, ఎప్పుడూ వాటిని వినియోగించలేదని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ చెప్పారు. ఈ విషయంలో ఆమె ఎలాంటి వైద్య పరీక్షకు అయినా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.