మాతృత్వం కోసం ఎందరో మహిళలు పరితపించిపోతారు. సెలబ్రిటీలూ అందుకు మినహాయింపు కాదు. ఎందుకంటే పిల్లలను చాలామంది.. ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. పిల్లలతోనే వివాహ బంధం మరింత దృఢంగా మారుతుంది. అలా 2021లో 'అమ్మ' అని పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలపై ఓ లుక్కేయండి.
- కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్
పిల్లల పెంపకానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్. 2021 ఫిబ్రవరి 21న తమ రెండో కుమారుడు జెహ్కు జన్మనిచ్చింది కరీనా. 2016లో తన 36వ ఏట తైమూర్కు జన్మనిచ్చి తొలిసారి తల్లి అయ్యింది. మళ్లీ ఐదేళ్లకు అమ్మగా మారింది.
అయితే లేటు వయసులో గర్భం దాల్చడంపై వస్తున్న విమర్శలకు ఆమె గట్టిగానే సమాధానం చెప్పింది. "36 ఏళ్ల వయసు వచ్చిందనో.. పిల్లల్ని తప్పక కనాలి కాబట్టో నేను కనలేదు. అసలు అలా ఆలోచించను. ప్రేమ కోసమే సైఫ్ను పెళ్లి చేసుకున్నా. పిల్లల్ని కావాలనుకున్నాను కాబట్టే కన్నాను. ఆలస్యంగా పిల్లల్ని కనే తల్లులను అనవసర ఒత్తిడికి గురిచేయడం తగదు." అని కరీనా పేర్కొంది.
- అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ
దేశంలోనే చూడముచ్చటైన జంటగా, పవర్కపుల్గా ఉన్నారు అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ. వారు తల్లిదండ్రులు అవ్వాలనే ఎందరో అభిమానుల కోరిక 2021 జనవరి 11న తీరింది. ఆ రోజున వారికి 'వామిక' జన్మించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కోహ్లీ చేసిన పోస్ట్.. ట్విట్టర్లో 2021లో అత్యధికంగా లైక్ చేసిన ట్వీట్గా నిలిచింది.
- నేహా ధూపియా-అంగద్ బేడి
2021 అక్టోబర్ 3న రెండో బిడ్డకు జన్మనిచ్చారు నేహా ధూపియా-అంగద్ బేడి. 2018లో వారికి తొలుత ఆడపిల్ల పుట్టగా.. ఈసారి మగ బిడ్డ జన్మించాడు.
- గీతా బస్రా-హర్భజన్ సింగ్
ఈ ఏడాది జులైలో తమ కుమారుడు జోవాన్కు జన్మనిచ్చారు గీతా-భజ్జీ దంపతులు. ఇదివరకే ఓ పాపకు తల్లిదండ్రులైన వారు మరో బిడ్డకు జన్మనిచ్చి తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఎందుకంటే గీతాకు ముందు నుంచి ఇద్దరు పిల్లలంటే ఇష్టం. చిన్నారికి ఓ తోబుట్టువు ఉండటం ఎంతైనా ముఖ్యమని, ఒకరికొకరు తోడుతుంటారని ఆమె నమ్మకం.
అయితే రెండోసారి తల్లి కావడం గీతాకు చాలా కష్టమైంది. 2016లో హినయ జన్మించిన తర్వాత రెండుసార్లు ఆమెకు గర్భస్రావం జరిగింది.
- దియా మిర్జా- వైభవ్ రేఖి
బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జాకు వైభవ్ రేఖితో ఈ ఏడాది ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. నాలుగు నెలల అనంతరం వారికి అవ్యాన్ అనే బాబు జన్మించాడు. అంతకుముందు సాహిల్ సంఘా అనే వ్యక్తిని వివాహం చేసుకున్న దియా.. తమ 11 ఏళ్ల బంధానికి 2019లో ముగింపు పలికింది.
వీరితో పాటు ప్రముఖ బాలీవుడు నటుడు ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అపరశక్తి ఖురానా, నటుడు రన్విజయ్ సింఘా, సీరియల్ యాక్టర్ నకుల్ మెహతా దంపతులు ఈ ఏడాది తల్లిదండ్రులుగా మారారు.
ఇదీ చూడండి: మహిళల కష్టాలే కథలయ్యాయి.. సమాజం కళ్లు తెరిపించాయి!