బాలీవుడ్ అందాల బొద్దుగుమ్మ భూమి పెడ్నేకర్ వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి ఉత్సాహం చూపుతుంది. కేవలం కథానాయిక పాత్రలే కాదు. బోల్డ్ పాత్రల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అందరిలాగే భూమి కూడా ఇంటిదగ్గరే ఉండిపోయింది. తాజాగా ఆమె కరోనా కాలంలో ఎలా తన సమయాన్ని గడుపుతుందో చెప్పింది.
"నేను మా అమ్మ సుమిత్రా పెడ్నేకర్ దగ్గర కథక్ నేర్చుకుంటున్నా. అమ్మకు కథక్లో పరిపూర్ణ ప్రవేశం ఉంది. నేను కూడా చాలా కాలంగా నేర్చుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఓ గంటపాటు అమ్మ దగ్గర శిక్షణ తీసుకుంటున్నా. ఆమె దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది. గతంలో మేము షూటింగ్ అని ఇంటి నుంచి బయలుదేరితే ఎప్పుడు వస్తామో తెలిసేది కాదు. ఇప్పటికే డేట్స్ అన్ని మారిపోయాయి. ప్రస్తుతం ఎటువంటి పనులు చేయలేం. నేను సినిమాల్లోకి రాకముందు పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని. కానీ చిత్రసీమకు వచ్చాక తీరికే లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం కావాల్సినంత సమయం ఉంది. అందుకే అన్ని రకాల పుస్తకాలు తిరగేస్తున్నా. మరోసారి నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లా."
-భూమి పెడ్నేకర్, హీరోయిన్
ప్రస్తుతం పెడ్నేకర్ 'డాలీ కిట్టి ఔర్ వొ చమక్తే సితారే'తో పాటు 'దుర్గావతి' చిత్రాల్లో నటిస్తోంది. 'దుర్గావతి'లో ఐఏయస్ అధికారి చంచల్ చౌహాన్ పాత్రలో కనిపించనుంది.