కరోనా విరామ సమయంలో తన అనుభవాలన్నీ కలిపి ఓ పుస్తకాన్ని రాసినట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చెప్పారు. దీనిని త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.
"కరోనా మహమ్మారి మన జీవితాలను పూర్తిగా మార్చేసింది. మనలోని సంకల్పశక్తి, సానుకూల దృక్పథంతో పాటు ఆలోచన శక్తిని పెంచింది. ఇలాంటి భావాలన్నింటిని కూర్చి లాక్డౌన్లో ఓ పుస్తకం రాశాను. త్వరలోనే దీనిని విడుదల చేయనున్నాం. లాక్డౌన్లో మనం నేర్చుకున్న విషయాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడవచ్చు"
- అనుపమ్ ఖేర్, బాలీవుడ్ నటుడు
కొన్నిరోజుల క్రితం తన తల్లితో పాటు సోదరుడి కుటుంబమంతా వైరస్ బారిన పడినట్లు అనుపమ్ ఖేర్ తెలిపారు. "లాక్డౌన్ మధ్యలో న్యూయార్క్ నుంచి ముంబయి వచ్చాను. దాదాపు 8 నెలలు అక్కడే ఉన్నాను. అదే సమయంలో ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చి వైరస్పై పోరాడంట చూశాను. నా కుటుంబం కూడా అనారోగ్యానికి గురైంది. ఈ మహమ్మారి కారణంగా మనమందరం చాలా కొత్త విషయాలను నేర్చుకున్నాం. మొదట్లో నేను భయపడ్డాను. అభద్రతాభావంతో ఉన్నాను. కానీ, అదే సమయంలో కుటుంబమంతా ఒకచోటకు వచ్చామనే విషయాన్ని గ్రహించినట్లు తెలుసుకున్నాను" అని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఈ పుస్తకం సానుకూల అంశాలను ప్రస్తావిస్తుందని తెలిపారు.