స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈరోజు ఉదయం సినిమాకు సంబంధించిన ఓ టీజర్ అప్డేట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ మెగా ఫ్యామిలీకి చాలా ఏళ్లుగా అభిమాని, ఆప్తుడైన నూర్ భాయ్ అనారోగ్యం కారణంగా చనిపోవడం వల్ల ఆ ప్రకటనను విరమించుకున్నారు. త్వరలో సినిమా విశేషాలు పంచుకుంటామని ట్వీట్ ద్వారా వెల్లడించింది నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్.

నూర్కు మెగాఫ్యామిలీలోని అందరి హీరోలతో మంచి సంబంధాలున్నాయి. ఇతడు అందరితో కలిసి తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. మెగా అభిమానులు కూడా ఇతడి మృతికి నివాళులు అర్పిస్తున్నారు.

బన్నీ కెరీర్ 19వ చిత్రంగా 'అల వైకుంఠపురములో' తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రంలోని 'సామజవరగమన' పాట వందమిలియన్ వ్యూస్ సాధించిన తొలి పాటగా రికార్డు సృష్టించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.