ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో వాట్సాప్ యూజర్లలో గందరగోళం నెలకొంది. కొత్త పాలసీకి అంగీకారం తెలపడం ఇష్టంలేని చాలా మంది టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్లవైపు మొగ్గు చూపుతున్నారు.
యూజర్లలో మార్పు ఇలా..
ఓ సర్వే ప్రకారం భారత్లో 18 శాతం మంది మాత్రమే వాట్సాప్ను యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. 36శాతం మంది వాట్సాప్ వినియోగాన్ని భారీగా తగ్గించాలనుకుంటున్నట్లు వెల్లడైంది. 15 శాతం మంది వాట్సాప్ పూర్తిగా వాడకూడదని నిర్ణయించుకున్నట్లు సర్వే వివరించింది.
పేమెంట్ సదుపాయం వాడేది లేదు..
మాషబుల్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 24 శాతం మంది యూజర్లు (గ్రూప్లతో కలిపి) వాట్సాప్ను వీడి ఇతర యాప్లను వాడాలనుకుంటున్నారు. 91 శాతం మంది వాట్సాప్ పేమెంట్ సదుపాయాన్ని వినియోగించబోమని తేల్చి చెప్పారు. దేశంలోని 244 జిలాల్లో 24 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
పేమెంట్ సదుపాయాన్ని వినియోగిస్తే.. ఆ లావాదేవీల సమాచారాన్ని వాట్సాప్ తమ మాతృసంస్థ ఫేస్బుక్ సహా ఇతర అనుబంధ కంపెనీలతో పంచుకుంటుందన్న అనుమానాలు ఇందుకు కారణంగా సర్వే పేర్కొంది.
గడువు పెంపు..
కొత్త నిబంధనలపై యూజర్లలో తలెత్తిన సందేహాలతో.. వాటికి ఆంగీకారం తెలిపేందుకు ఫిబ్రవరి 8తో ముగియాల్సిఉన్న తుది గడువును.. మార్చి 15కు పొడిగిచింది వాట్సాప్.
కొత్త నిబంధనల్లో యూజర్లు తమ లొకేషన్, ఫోన్ నంబర్, ఇతర సమాచారాన్ని.. ఫేస్బుక్ సహా, తమ అనుబంధ సంస్థలతో పంచుకునేందుకు అనుమతివ్వాలనేది వాట్సాప్ నిబంధనల ముఖ్య ఉద్దేశం. అయితే బిజినెస్ ఖాతాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని వాట్సాప్ పేర్కొంది.
వాటి డౌన్లోడ్లో వృద్ధి..
వాట్సాప్ నిబంధనలతో.. జనవరి 1-5 మధ్య సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్లు వరుసగా 24 వేలు, 1.3 మిలియన్లు పెరిగాయి. సిగ్నల్ డౌన్లోడ్ల వృద్ధి 9,483 శాతంగా ఉండగా.. టెలిగ్రామ్ వృద్ధి 15 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో వాట్సాప్కు జనవరి 6-10 మధ్య డౌన్లోడ్లు 35 శాతం పడిపోయాయి.
ఇవీ చూడండి: