ఐఐటీ మద్రాస్, అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ బయెరియాక్టర్ సాయంతో మనిషి మెదడు కణజాలాన్ని అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతతో ఆర్గనాయిడ్స్గా పిలిచే ఈ బ్రెయిన్ టిష్యూస్ల వృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. దీని ద్వారా క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి ప్రమాదకర వ్యాధుల నివారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఆ సమస్యను పరిష్కరించారు..
మానవ శరీరానికి సంబంధించి ఏ విషయాన్ని అయినా తెలుసుకునే క్రమంలో సెల్ కల్చర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏ వ్యాధికైనా చికిత్స లేదా ఔషధం కనుగొనడంలో కణాలపై పరిశోధన ఎంతో ముఖ్యం. కణజాలాన్ని అభివృద్ధి చేసేందుకు ఇన్క్యుబేషన్, ఇమేజింగ్ సహా కణాలను భౌతికంగా ఇమేజింగ్ ఛాంబర్లోకి బదిలీ చేసేందుకు వేర్వేరు ఛాంబర్లు అవసరం. అయితే ఈ క్రమంలో దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ సమస్యకు పరిష్కారంగా ఐఐటీ, ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ 3డీ ప్రింటెడ్ బయోరియాక్టర్ను రూపొందించారు. మైక్రో ఇన్క్యుబేటర్, ఇమేజింగ్ ఛాంబర్లను ఒకే పరికరంలోకి తీసుకువచ్చారు. దీని ద్వారా కణాల వృద్ధిని గమనిస్తూ దీర్ఘ కాలం పరిశోధన జరిపేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు.
ఆరుగురు సభ్యుల బృందం
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ఇటీవల బయోమైక్రోఫ్లూయిడిక్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఐఐటీ మద్రాస్ నుంచి ఇమ్రాన్ ఖాన్, ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్, ఎంఐటీ నుంచి క్లోయ్ డెలెపైన్, హేలే సాంగ్, విన్సెంట్ ఫామ్, ప్రొఫెసర్ మ్రిగంకా సుర్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
మైక్రో ఫ్లూయిడిక్ టెక్నాలజీకి చెందిన ఈ పరికరం ద్వారా దీర్ఘ కాలంపాటు అపరిమిత ఆర్గనాయిడ్లను వృద్ధి చేయవచ్చు. ఈ బయోరికార్టర్ను పూర్తిగా ఆటోమేటెడ్గా అభివృద్ధి చేయడం ద్వారా ఔషధాలు కనుగొనడం సులభం అవుతుంది. దీని ద్వారా ఖర్చు కూడా తగ్గుతుంది. దాదాపు అన్ని మైక్రోస్కోప్లకు మా పరికరం సరిపోవడమే కాక వివిధ ఎన్విరాన్మెంటల్ సెన్సార్లను ఈ మైక్రో ఇన్క్యుబేటర్కు జోడించవచ్చు
-ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్, ఐఐటీ మద్రాస్
హెల్త్కేర్, ఫార్మా రంగాల్లో మైక్రో ఇన్క్యుబేటర్ల అవసరాన్ని పరిగణలోకి తీసుకొని.. దీనిని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నాము. ఇందుకోసం నిధులను సేకరిస్తున్నాము. దీని ద్వారా ఆర్గనాయిడ్స్పై పరిశోధన జరపడం అందరికీ సులభతరం కానుంది.
-ఇక్రామ్ ఖాన్, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి
ప్రస్తుతం ఈ సాంకేతికతకు సంబంధించిన పేటెంట్ హక్కులు భారత్లోనే ఉన్నాయి. దీనిపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు పరిశోధన బృందం ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి : 'భారత్లో టీకా తర్వాత రక్తస్రావం కేసులు తక్కువే!'