Customer ID For Mobile Users : ప్రస్తుత కాలంలో మొబైల్ సిమ్ కార్డుల ద్వారా సైబర్ మోసాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సిమ్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం నిబంధనలు కఠినతరం చేస్తోంది. సిమ్ కార్డు విక్రేతలకు KYC నిబంధనలను అమలు చేయాలని, బల్క్ సిమ్ విక్రయాలనూ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా మొబైల్ యూజర్లకు ఆధార్ తరహాలో కస్టమర్ ఐడీ పేరిట విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది.
ప్రధాన సిమ్కార్డుతో పాటు అనుబంధంగా ఉన్న ఫోన్ కనెక్షన్లను గుర్తించేందుకు ఈ కస్టమర్ ఐడీ ఉపయోగపడుతుంది. వినియోగదారులను సైబర్ మోసాలను రక్షించడం సహా, ప్రభుత్వ పథకాలు నేరుగా అందించేందుకు ఈ ఐడీ ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను టెలికాం విభాగం ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆధార్ కార్డుకు 14 అంకెలు కలిగిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ను కేంద్రం లింక్ చేస్తోంది. దీనివల్ల వైద్యులు, ఇన్సూరెన్స్ సంస్థలు వ్యక్తుల వైద్య సమాచారాన్ని సులువుగా తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఇదే తరహాలో మొబైల్ సబ్స్క్రైబర్లకు కేటాయించే కస్టమర్ ఐడీ ద్వారా సిమ్ కార్డును ట్రాక్ చేయడం సహా సిమ్ కొనుగోలు చేసిన ప్రదేశం, సిమ్ కార్డు వాస్తవ యజమాని వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
దేశంలో ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్కార్డులను మాత్రమే కలిగి ఉండేందుకు అర్హత ఉంది. కానీ ఇది సరిగ్గా అమలు కావడం లేదు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ఆడిట్ నిర్వహిస్తే తప్ప ఇలాంటివి గుర్తించడం సాధ్యపడడం లేదు. అలా ఈ మధ్యే 64 లక్షల మొబైల్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదే ఈ కస్టమర్ ఐడీ ద్వారా అయితే ఒక కస్టమర్కు నిర్దేశిత సంఖ్య కంటే మించి అధికంగా సిమ్ కార్డులను జారీ చేయడాన్ని అడ్డుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
కస్టమర్ ఐడీ ద్వారా సిమ్కార్డు వాస్తవంగా ఎవరు వాడుతున్నారనే వివరాలను ప్రభుత్వం తెలుసుకోగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సిమ్కార్డు జారీ సమయంలోనూ ఆ వివరాలను ఇకపై కోరే అవకాశం ఉంది. దీనివల్ల డేటా ప్రొటెక్షన్ బిల్లుకు అనుగుణంగా పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రుల అనుమతిని సైతం ధ్రువీకరించుకోవడానికి మొబైల్ కంపెనీలకు వీలు పడుతుంది. కస్టమర్ ఐడీ ద్వారా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు నివారించొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కస్టమర్ ఐడీల ద్వారా వయసు, లింగం, వైవాహిక స్థితి, ఆదాయం, విద్య, ఉద్యోగం వంటి డెమొగ్రఫీ వంటి వివరాల ఆధారంగా ఆ సమూహాన్ని గ్రూప్ చేయడానికి దోహదపడుతుందని, వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే ఆ కస్టమర్ ఐడీతో ఉన్న నంబర్లన్నింటినీ ఒకేసారి బ్లాక్ చేయడానికి వీలు పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆన్లైన్ డేటింగ్ చేస్తున్నారా? రొమాన్స్ స్కామ్లో చిక్కుకునే ప్రమాదం ఉంది - జాగ్రత్త!