ETV Bharat / opinion

తెలుగు ప్రాచీన హోదాను కాపాడుకుందాం

author img

By

Published : Apr 4, 2021, 7:04 AM IST

తెలుగు భాషకు ఉన్న ప్రాచీన హోదాను కాపాడుకునేందుకు భాషాభిమానులు నడుం కట్టాల్సిన అవసరం ఉంది. గడచిన మూడేళ్లలో సంస్కృత, తమిళ భాషలకు కేంద్రం రూ.25 కోట్లు కేటాయించగా, తెలుగు కేంద్రానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీనికి కారణం తెలుగు భాషా కేంద్రానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడమే. భాషాకేంద్రం విశ్వవిద్యాలయంలో విలీనం కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా మనగలిగినప్పుడు- తెలుగు భాష ప్రాచీన హోదా లక్ష్యం సాధ్యమవుతుంది.

sub feature on protection of ancient language telugu
తెలుగు.. ప్రాచీన హోదాను కాపాడుకునేందుకుందాం

తెలుగు భాష మాధుర్యాన్ని గురించి, తెలుగులో వెలువడిన అద్భుత సాహిత్యాన్ని గురించి ఎంత ఘనంగా చెప్పుకుంటున్నా- భాష పరంగా తెలుగు వాడు ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కొంటున్నాడు. మాతృభాషను అధికార భాషగా అమలు చేయాలంటే పోరాటం సాగించాలి. అమ్మ నుడిలో తెలుగు పిల్లలు చదువుకునే అవకాశం కోసమూ పోరాడాల్సిందే. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాషకు ప్రాచీన హోదా కోసం ఏకంగా ఉద్యమమే చేపట్టాలి. ఇలా.. తన భాషను బతికించుకోవడం తెలుగువాడికి సమస్యగా మారింది. 2004లో సంస్కృత, తమిళ భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా ప్రకటించింది. తెలుగువారు సైతం తమ భాషకు ఆ స్థాయి కల్పించాలని పోరాడారు. శాసనాధారాలు చూపారు. 2008లో తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా లభించింది. అనంతర కాలంలో మళయాళం, ఒడియా భాషలకూ ఆ హోదా ఇచ్చారు.

స్వతంత్ర ప్రతిపత్తి కరవు

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రారంభించినా- అది మైసూరులోని 'సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌'లో భాగంగా కొనసాగింది. సంస్కృత, తమిళ భాషలను ఆ కేంద్రం నుంచి వేరుచేసి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. సంస్కృత భాషా కేంద్రం దిల్లీలోను, తమిళ భాషా కేంద్రం చెన్నైలోను ఏర్పాటయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలూ తమ తమ రాష్ట్రాలకు ఆ భాషా కేంద్రాలను తరలించాలని కోరినా- ఆ దిశగా బలమైన ప్రయత్నాలు జరగలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరు జిల్లాలో వెంకటాచలం వద్ద తెలుగు భాషా కేంద్రం ఏర్పాటయింది. 2020 జనవరిలో స్వర్ణభారతి ట్రస్టు ప్రాంగణంలో వెంకయ్యనాయుడు దీన్ని ప్రారంభించారు. శాశ్వత భవనాలు లేకపోవడం, చాలినంత సిబ్బంది లేకపోవడం, మౌలిక వసతుల కొరత వల్ల పరిశోధన తగిన స్థాయిలో జరగడం లేదు. గడచిన మూడేళ్లలో సంస్కృత, తమిళ భాషలకు కేంద్రం రూ.25 కోట్లు కేటాయించగా, తెలుగు కేంద్రానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికి కారణం తెలుగు భాషా కేంద్రానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడమే.

పులి మీద పుట్రలా ఇటీవలి పరిణామం తెలుగువారిని కలవరపాటుకు గురిచేస్తోంది. మైసూరులోని భారతీయ భాషల కేంద్రాన్ని భాషా విశ్వవిద్యాలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది ముదావహమే. దీని కోసం తగిన విధానాలను రూపొందించేందుకు 11 మంది సభ్యులతో గోపాలస్వామి కమిటీని నియమించారు. ఈ కమిటీలో తెలుగు వారికి ప్రాతినిధ్యం లేదు. ప్రాచీన భాషా కేంద్రాలను ఈ విశ్వ విద్యాలయంలో విలీనం చేయాలనీ కేంద్రం కమిటీకి సూచించింది. ఇది భాషాకేంద్రాలకు పిడుగుపాటు వంటిది.

విశ్వవిద్యాలయాల వ్యవస్థ, పనితీరు, లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. వాటికి విశ్వవిద్యాలయం నిధులు ఇస్తుంది. విశ్వవిద్యాలయాలు బోధన, పరిమిత స్థాయిలో పరిశోధనలను చేపడతాయి. సిబ్బందీ పరిమితంగానే ఉంటారు. ప్రాచీన భాషా కేంద్రాలు నిర్వహించవలసిన బృహత్తర పరిశోధన బాధ్యతను విశ్వవిద్యాలయ శాఖలు నిర్వహించలేవు. నెల్లూరు కేంద్రంలో వివిధ ప్రాంతాల సాహిత్య, సామాజిక, సాంస్కృతిక అధ్యయనం జరగవలసి ఉంది. ప్రాచీన కావ్యాల్లో అవసరమైన వాటికి వ్యాఖ్యానాలు వెలువరించవలసి ఉంది. లిఖిత వాంగ్మయమే కాకుండా తెలుగువారికి అపారమైన మౌఖిక వాంగ్మయం ఉంది. జానపద పురాణాలున్నాయి. జనశ్రుత గాథలున్నాయి. వాటి సేకరణ, విశ్లేషణ జరగాలి. వేలాది తాళపత్ర గ్రంథాల పరిష్కరణ, ముద్రణ జరగవలసి ఉంది. ఆదివాసి తెగల సామాజిక, సాంస్కృతిక జీవనంపై లోతైన పరిశోధన జరగాలి.

నిధులు సమకూర్చాలి

తెలుగు భాషకు సమగ్ర నిఘంటువు గాని, వ్యావహారిక భాషకు వ్యాకరణం గాని లేవన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అసలు ప్రాచీన కావ్య భాషకే సమగ్ర వ్యాకరణం రాలేదు. ఈ అంశాల్లోనూ, భాషా కేంద్రం దృష్టి సారించవలసి ఉంది. సామాజిక పరిణామాల్లో భాష ఒక కీలక సాధనం. దానితో అనుబంధం ఉన్న సంగీతం, నాట్యం, జానపదాల కళారూపాలపై పరిశోధన జరగాలి. శాసన పరిశోధన వల్ల చరిత్ర పునర్నిర్మాణం జరుగుతుంది. ఇతర భాషల వారికి తెలుగులో వివిధ ప్రక్రియల్లో వెలసిన శ్రేష్ఠమైన రచనలెన్నో పరిచయం కావలసి ఉంది. మన కవులు, రచయితల ప్రతిభకు జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు లభించడానికి అనువాద ప్రక్రియ వేగవంతంగా జరగాలి. తెలుగు భాష ఇదివరకు తనకు నిర్దిష్టమైన క్షేత్ర పరిధులను దాటి విస్తరించవలసి ఉంది. ఈ విస్తరణే ఆధునికత. భాష ఆధునికీకరణలో సులభీకరణ ప్రధానాంశం. కొత్త పదాల కల్పన, నూతన రచనా విధానం, లేఖక విధానం, పత్రికారంగానికి శైలీ పత్రాల రూపకల్పన మొదలైన అంశాలపైన భాషాకేంద్రం దృష్టి సారించవలసి ఉంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో వనరుల కొరత, పరిశోధకుల్లో ఉత్సాహం, సామర్థ్యం లోపించడం వల్ల వాసిగల పరిశోధనలకు ఆస్కారం ఉండకపోవచ్చుననే విమర్శలున్నాయి. లోతైన, విస్తృతమైన పరిశోధనలతో తెలుగువారి చరిత్ర, సాహిత్యం, కళలు, సామాజిక జీవనంపై కొత్త వెలుగు ప్రసరించగల శక్తిమంతమైన సంస్థలుగా భాషాకేంద్రాల్ని రూపొందించవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు సమకూర్చాలి.

భాషాకేంద్రం విశ్వవిద్యాలయంలో విలీనం కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా మనగలిగినప్పుడు- తెలుగు భాష ప్రాచీన హోదా లక్ష్యం సాధ్యమవుతుంది. తెలుగు భాషాభిమానులు, మేధావులు ఈ దిశగా యోచించాలి, ఉద్యమించాలి. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు దోహదం చేసే ఈ అవకాశాన్ని చేజారనివ్వకూడదు.

- డి.భారతీదేవి

తెలుగు భాష మాధుర్యాన్ని గురించి, తెలుగులో వెలువడిన అద్భుత సాహిత్యాన్ని గురించి ఎంత ఘనంగా చెప్పుకుంటున్నా- భాష పరంగా తెలుగు వాడు ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కొంటున్నాడు. మాతృభాషను అధికార భాషగా అమలు చేయాలంటే పోరాటం సాగించాలి. అమ్మ నుడిలో తెలుగు పిల్లలు చదువుకునే అవకాశం కోసమూ పోరాడాల్సిందే. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాషకు ప్రాచీన హోదా కోసం ఏకంగా ఉద్యమమే చేపట్టాలి. ఇలా.. తన భాషను బతికించుకోవడం తెలుగువాడికి సమస్యగా మారింది. 2004లో సంస్కృత, తమిళ భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా ప్రకటించింది. తెలుగువారు సైతం తమ భాషకు ఆ స్థాయి కల్పించాలని పోరాడారు. శాసనాధారాలు చూపారు. 2008లో తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా లభించింది. అనంతర కాలంలో మళయాళం, ఒడియా భాషలకూ ఆ హోదా ఇచ్చారు.

స్వతంత్ర ప్రతిపత్తి కరవు

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రారంభించినా- అది మైసూరులోని 'సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌'లో భాగంగా కొనసాగింది. సంస్కృత, తమిళ భాషలను ఆ కేంద్రం నుంచి వేరుచేసి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. సంస్కృత భాషా కేంద్రం దిల్లీలోను, తమిళ భాషా కేంద్రం చెన్నైలోను ఏర్పాటయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలూ తమ తమ రాష్ట్రాలకు ఆ భాషా కేంద్రాలను తరలించాలని కోరినా- ఆ దిశగా బలమైన ప్రయత్నాలు జరగలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో నెల్లూరు జిల్లాలో వెంకటాచలం వద్ద తెలుగు భాషా కేంద్రం ఏర్పాటయింది. 2020 జనవరిలో స్వర్ణభారతి ట్రస్టు ప్రాంగణంలో వెంకయ్యనాయుడు దీన్ని ప్రారంభించారు. శాశ్వత భవనాలు లేకపోవడం, చాలినంత సిబ్బంది లేకపోవడం, మౌలిక వసతుల కొరత వల్ల పరిశోధన తగిన స్థాయిలో జరగడం లేదు. గడచిన మూడేళ్లలో సంస్కృత, తమిళ భాషలకు కేంద్రం రూ.25 కోట్లు కేటాయించగా, తెలుగు కేంద్రానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికి కారణం తెలుగు భాషా కేంద్రానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడమే.

పులి మీద పుట్రలా ఇటీవలి పరిణామం తెలుగువారిని కలవరపాటుకు గురిచేస్తోంది. మైసూరులోని భారతీయ భాషల కేంద్రాన్ని భాషా విశ్వవిద్యాలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది ముదావహమే. దీని కోసం తగిన విధానాలను రూపొందించేందుకు 11 మంది సభ్యులతో గోపాలస్వామి కమిటీని నియమించారు. ఈ కమిటీలో తెలుగు వారికి ప్రాతినిధ్యం లేదు. ప్రాచీన భాషా కేంద్రాలను ఈ విశ్వ విద్యాలయంలో విలీనం చేయాలనీ కేంద్రం కమిటీకి సూచించింది. ఇది భాషాకేంద్రాలకు పిడుగుపాటు వంటిది.

విశ్వవిద్యాలయాల వ్యవస్థ, పనితీరు, లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. వాటికి విశ్వవిద్యాలయం నిధులు ఇస్తుంది. విశ్వవిద్యాలయాలు బోధన, పరిమిత స్థాయిలో పరిశోధనలను చేపడతాయి. సిబ్బందీ పరిమితంగానే ఉంటారు. ప్రాచీన భాషా కేంద్రాలు నిర్వహించవలసిన బృహత్తర పరిశోధన బాధ్యతను విశ్వవిద్యాలయ శాఖలు నిర్వహించలేవు. నెల్లూరు కేంద్రంలో వివిధ ప్రాంతాల సాహిత్య, సామాజిక, సాంస్కృతిక అధ్యయనం జరగవలసి ఉంది. ప్రాచీన కావ్యాల్లో అవసరమైన వాటికి వ్యాఖ్యానాలు వెలువరించవలసి ఉంది. లిఖిత వాంగ్మయమే కాకుండా తెలుగువారికి అపారమైన మౌఖిక వాంగ్మయం ఉంది. జానపద పురాణాలున్నాయి. జనశ్రుత గాథలున్నాయి. వాటి సేకరణ, విశ్లేషణ జరగాలి. వేలాది తాళపత్ర గ్రంథాల పరిష్కరణ, ముద్రణ జరగవలసి ఉంది. ఆదివాసి తెగల సామాజిక, సాంస్కృతిక జీవనంపై లోతైన పరిశోధన జరగాలి.

నిధులు సమకూర్చాలి

తెలుగు భాషకు సమగ్ర నిఘంటువు గాని, వ్యావహారిక భాషకు వ్యాకరణం గాని లేవన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అసలు ప్రాచీన కావ్య భాషకే సమగ్ర వ్యాకరణం రాలేదు. ఈ అంశాల్లోనూ, భాషా కేంద్రం దృష్టి సారించవలసి ఉంది. సామాజిక పరిణామాల్లో భాష ఒక కీలక సాధనం. దానితో అనుబంధం ఉన్న సంగీతం, నాట్యం, జానపదాల కళారూపాలపై పరిశోధన జరగాలి. శాసన పరిశోధన వల్ల చరిత్ర పునర్నిర్మాణం జరుగుతుంది. ఇతర భాషల వారికి తెలుగులో వివిధ ప్రక్రియల్లో వెలసిన శ్రేష్ఠమైన రచనలెన్నో పరిచయం కావలసి ఉంది. మన కవులు, రచయితల ప్రతిభకు జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు లభించడానికి అనువాద ప్రక్రియ వేగవంతంగా జరగాలి. తెలుగు భాష ఇదివరకు తనకు నిర్దిష్టమైన క్షేత్ర పరిధులను దాటి విస్తరించవలసి ఉంది. ఈ విస్తరణే ఆధునికత. భాష ఆధునికీకరణలో సులభీకరణ ప్రధానాంశం. కొత్త పదాల కల్పన, నూతన రచనా విధానం, లేఖక విధానం, పత్రికారంగానికి శైలీ పత్రాల రూపకల్పన మొదలైన అంశాలపైన భాషాకేంద్రం దృష్టి సారించవలసి ఉంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో వనరుల కొరత, పరిశోధకుల్లో ఉత్సాహం, సామర్థ్యం లోపించడం వల్ల వాసిగల పరిశోధనలకు ఆస్కారం ఉండకపోవచ్చుననే విమర్శలున్నాయి. లోతైన, విస్తృతమైన పరిశోధనలతో తెలుగువారి చరిత్ర, సాహిత్యం, కళలు, సామాజిక జీవనంపై కొత్త వెలుగు ప్రసరించగల శక్తిమంతమైన సంస్థలుగా భాషాకేంద్రాల్ని రూపొందించవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు సమకూర్చాలి.

భాషాకేంద్రం విశ్వవిద్యాలయంలో విలీనం కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా మనగలిగినప్పుడు- తెలుగు భాష ప్రాచీన హోదా లక్ష్యం సాధ్యమవుతుంది. తెలుగు భాషాభిమానులు, మేధావులు ఈ దిశగా యోచించాలి, ఉద్యమించాలి. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు దోహదం చేసే ఈ అవకాశాన్ని చేజారనివ్వకూడదు.

- డి.భారతీదేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.