ETV Bharat / opinion

కొవిడ్‌ కొమ్ములు విరిచే వ్యూహం

author img

By

Published : Mar 18, 2021, 7:51 AM IST

Updated : Mar 18, 2021, 9:09 AM IST

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని సూచిస్తున్నారు. ఫలానా వయసువారికే.. ఆరోగ్య స్థితిగతుల్ని పరిగణించి టీకాల వేయాలన్న నిషేధాంక్షల్ని పక్కనపెట్టి- ఎవరు కోరితే వారికి వ్యాక్సిన్లు అందేలా విధివిధానాలను సత్వరం ప్రక్షాళించాలని పేర్కొంటున్నారు.

corona wave
కొవిడ్‌ కొమ్ములు విరిచే వ్యూహం

దేశంలో కొవిడ్‌ కేసులు మళ్ళీ జోరెత్తుతున్న తీరు తీవ్రంగా కలవరపరుస్తోంది. నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ విధింపు దరిమిలా నిన్నటి నుంచీ ఇండోర్‌, భోపాల్‌, సూరత్‌, రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌, వడోదరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలుపరచాల్సి రావడం వైరస్‌ మలిదశ ఉద్ధృతిని కళ్లకు కడుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తకేసులు 28వేలకు పైబడటం- ప్రధాని మోదీ మాటల్లో, పెనుప్రమాద హెచ్చరిక! మొన్న 24 గంటల వ్యవధిలో 30 లక్షల మోతాదులకు మించి వ్యాక్సిన్‌ ఇవ్వడాన్ని నూతన రికార్డుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిననాడే, పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికాంశాలు వెలుగుచూశాయి.

అక్షరాలా మహాయజ్ఞమనదగ్గ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశంలో మొదలై రెండు నెలలైంది. ఇప్పటికి కొవిడ్‌ టీకాలు వేయించుకున్నవారి సంఖ్య సుమారు మూడున్నర కోట్లు. తొలి దశ లక్ష్యంగా నిర్దేశించుకున్న 50కోట్ల మోతాదుల్లో నెరవేరింది ఏడుశాతమేనని, ఇదే వేగం ఇలాగే కొనసాగితే జనాభా అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఏడేళ్లకుపైగా పడుతుందని స్థాయీ సంఘం నివేదిక సూచిస్తోంది. టీకాలు వేయడంలో జాప్యం జరిగేకొద్దీ మరిన్ని రకాల వైరస్‌లు పుట్టుకొచ్చే ముప్పుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, హరియాణాలలో రోజువారీ కొత్త కేసుల నమోదు వేగం భీతిల్లజేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మలిదశ ప్రజ్వలనాన్ని క్షేత్రస్థాయి కథనాలు సూచిస్తున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తక్షణం అప్రమత్తం కావాలంటూ వైద్యారోగ్య సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణలోనూ కామారెడ్డి, మంచిర్యాల, బాలానగర్‌ ప్రాంతాల్లో బడిపిల్లలు, ఉపాధ్యాయులకు కొవిడ్‌ కేసుల తాకిడి ఏమాత్రం అలసత్వమైనా అనర్థదాయకమేనని చాటుతోంది. ప్రాణావసర టీకాలూ కొన్నిచోట్ల వృథా కావడంకన్నా విషాదం ఏముంటుంది? దాన్ని అరికట్టడం సహా కరోనా పరీక్షలు, టీకా కేంద్రాలను పెంచాలన్న ప్రధానమంత్రి తాజా సూచనల స్ఫూర్తిని రాష్ట్రాలన్నీ అందిపుచ్చుకొని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను శీఘ్రతరం చేసేందుకు కలిసికట్టుగా కూడిరావాల్సిన సంక్లిష్ట తరుణమిది.

మందకొడిగా టీకా పంపిణీ

కరోనాపై పోరులో ముందువరస యోధులతో ప్రారంభించి వయోవిభాగాల ప్రాతిపదికన అంచెలవారీగా చేపట్టదలచిన వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్నట్లు రుజువైన దృష్ట్యా- ప్రభుత్వాల వ్యూహాలు, కార్యాచరణ ఇకనైనా పదును తేలాలి. ఫలానా వయసువారికే, ఆరోగ్య స్థితిగతుల్ని పరిగణించి మాత్రమే టీకాల ప్రదానమన్న నిషేధాంక్షల్ని పక్కనపెట్టి- ఎవరు కోరితే వారికి వ్యాక్సిన్లు అందేలా విధివిధానాలను సత్వరం ప్రక్షాళించాలి. దిల్లీ, పుణె వంటి నగరాల్లో నిర్వహించిన సెరొలాజికల్‌ సర్వేలు 50శాతం మేర ప్రజానీకంలో యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు వెల్లడించాయి. అలా సహజసిద్ధ రోగనిరోధక లక్షణాలు కలిగిన వారిని తుది అంచెకు ప్రత్యేకించి, మిగతావారందరికీ చకచకా టీకాలందేలా వివిధ అంచెల ఆస్పత్రులు, ప్రైవేటు సంస్థలకు క్రియాశీల భాగస్వామ్యం కల్పించాలి!

కొవిడ్‌, ప్రధానంగా ముక్కుద్వారా వ్యాపించే మహమ్మారి. నాసికనుంచి గొంతులోకి విస్తరించే వైరస్‌కు ముక్కు ద్వారా టీకా ఇవ్వడమెంతో ప్రయోజనదాయకమని నిపుణులు ధ్రువీకరిస్తున్నారు. సూది గుచ్చనవసరం లేకుండా ముక్కులో ఒక్క చుక్క, అదీ- ఒకే మోతాదు వేయడం.. ముఖ్యంగా పిల్లలకు పెద్దవారికి ఎంతో సౌకర్యవంతమైన విధానమన్నది నిర్వివాదం. ఆ తరహా టీకాల మొదటిదశ క్లినికల్‌ పరీక్షలు దేశంలో ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని వేగవంతం చేయడంలో ప్రభుత్వపరంగా నిబద్ధ కృషి, మందగతిన సాగుతున్న వ్యాక్సినేషన్‌కు జవజీవాలు సంతరింపజేయడంలో నిర్ణాయక భూమిక పోషించగలుగుతుంది. తద్వారా పౌర సమాజానికి పటిష్ఠ రక్షణ ఛత్రం సమకూర్చినట్లవుతుంది. మాస్కుల ధారణ, సామాజిక దూరం తదితర కనీస జాగ్రత్తల్ని పాటించడంపై జనచేతనా ఇతోధికం కావాలి. అటు పరిశోధనల్ని ఉరకలెత్తిస్తూ, ఇటు కనిష్ఠ వ్యవధిలో గరిష్ఠ వ్యాక్సినేషన్‌ సాకారం అయ్యేలా అత్యవసర దిద్దుబాటు చర్యల్ని పట్టాలకు ఎక్కిస్తేనే... ఈ మహాసంక్షోభం నుంచి జాతి తెరిపిన పడగలిగేది!

ఇవీ చదవండి :

దేశంలో కొవిడ్‌ కేసులు మళ్ళీ జోరెత్తుతున్న తీరు తీవ్రంగా కలవరపరుస్తోంది. నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ విధింపు దరిమిలా నిన్నటి నుంచీ ఇండోర్‌, భోపాల్‌, సూరత్‌, రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌, వడోదరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలుపరచాల్సి రావడం వైరస్‌ మలిదశ ఉద్ధృతిని కళ్లకు కడుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తకేసులు 28వేలకు పైబడటం- ప్రధాని మోదీ మాటల్లో, పెనుప్రమాద హెచ్చరిక! మొన్న 24 గంటల వ్యవధిలో 30 లక్షల మోతాదులకు మించి వ్యాక్సిన్‌ ఇవ్వడాన్ని నూతన రికార్డుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిననాడే, పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికాంశాలు వెలుగుచూశాయి.

అక్షరాలా మహాయజ్ఞమనదగ్గ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశంలో మొదలై రెండు నెలలైంది. ఇప్పటికి కొవిడ్‌ టీకాలు వేయించుకున్నవారి సంఖ్య సుమారు మూడున్నర కోట్లు. తొలి దశ లక్ష్యంగా నిర్దేశించుకున్న 50కోట్ల మోతాదుల్లో నెరవేరింది ఏడుశాతమేనని, ఇదే వేగం ఇలాగే కొనసాగితే జనాభా అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఏడేళ్లకుపైగా పడుతుందని స్థాయీ సంఘం నివేదిక సూచిస్తోంది. టీకాలు వేయడంలో జాప్యం జరిగేకొద్దీ మరిన్ని రకాల వైరస్‌లు పుట్టుకొచ్చే ముప్పుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, హరియాణాలలో రోజువారీ కొత్త కేసుల నమోదు వేగం భీతిల్లజేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మలిదశ ప్రజ్వలనాన్ని క్షేత్రస్థాయి కథనాలు సూచిస్తున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తక్షణం అప్రమత్తం కావాలంటూ వైద్యారోగ్య సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణలోనూ కామారెడ్డి, మంచిర్యాల, బాలానగర్‌ ప్రాంతాల్లో బడిపిల్లలు, ఉపాధ్యాయులకు కొవిడ్‌ కేసుల తాకిడి ఏమాత్రం అలసత్వమైనా అనర్థదాయకమేనని చాటుతోంది. ప్రాణావసర టీకాలూ కొన్నిచోట్ల వృథా కావడంకన్నా విషాదం ఏముంటుంది? దాన్ని అరికట్టడం సహా కరోనా పరీక్షలు, టీకా కేంద్రాలను పెంచాలన్న ప్రధానమంత్రి తాజా సూచనల స్ఫూర్తిని రాష్ట్రాలన్నీ అందిపుచ్చుకొని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను శీఘ్రతరం చేసేందుకు కలిసికట్టుగా కూడిరావాల్సిన సంక్లిష్ట తరుణమిది.

మందకొడిగా టీకా పంపిణీ

కరోనాపై పోరులో ముందువరస యోధులతో ప్రారంభించి వయోవిభాగాల ప్రాతిపదికన అంచెలవారీగా చేపట్టదలచిన వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్నట్లు రుజువైన దృష్ట్యా- ప్రభుత్వాల వ్యూహాలు, కార్యాచరణ ఇకనైనా పదును తేలాలి. ఫలానా వయసువారికే, ఆరోగ్య స్థితిగతుల్ని పరిగణించి మాత్రమే టీకాల ప్రదానమన్న నిషేధాంక్షల్ని పక్కనపెట్టి- ఎవరు కోరితే వారికి వ్యాక్సిన్లు అందేలా విధివిధానాలను సత్వరం ప్రక్షాళించాలి. దిల్లీ, పుణె వంటి నగరాల్లో నిర్వహించిన సెరొలాజికల్‌ సర్వేలు 50శాతం మేర ప్రజానీకంలో యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు వెల్లడించాయి. అలా సహజసిద్ధ రోగనిరోధక లక్షణాలు కలిగిన వారిని తుది అంచెకు ప్రత్యేకించి, మిగతావారందరికీ చకచకా టీకాలందేలా వివిధ అంచెల ఆస్పత్రులు, ప్రైవేటు సంస్థలకు క్రియాశీల భాగస్వామ్యం కల్పించాలి!

కొవిడ్‌, ప్రధానంగా ముక్కుద్వారా వ్యాపించే మహమ్మారి. నాసికనుంచి గొంతులోకి విస్తరించే వైరస్‌కు ముక్కు ద్వారా టీకా ఇవ్వడమెంతో ప్రయోజనదాయకమని నిపుణులు ధ్రువీకరిస్తున్నారు. సూది గుచ్చనవసరం లేకుండా ముక్కులో ఒక్క చుక్క, అదీ- ఒకే మోతాదు వేయడం.. ముఖ్యంగా పిల్లలకు పెద్దవారికి ఎంతో సౌకర్యవంతమైన విధానమన్నది నిర్వివాదం. ఆ తరహా టీకాల మొదటిదశ క్లినికల్‌ పరీక్షలు దేశంలో ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని వేగవంతం చేయడంలో ప్రభుత్వపరంగా నిబద్ధ కృషి, మందగతిన సాగుతున్న వ్యాక్సినేషన్‌కు జవజీవాలు సంతరింపజేయడంలో నిర్ణాయక భూమిక పోషించగలుగుతుంది. తద్వారా పౌర సమాజానికి పటిష్ఠ రక్షణ ఛత్రం సమకూర్చినట్లవుతుంది. మాస్కుల ధారణ, సామాజిక దూరం తదితర కనీస జాగ్రత్తల్ని పాటించడంపై జనచేతనా ఇతోధికం కావాలి. అటు పరిశోధనల్ని ఉరకలెత్తిస్తూ, ఇటు కనిష్ఠ వ్యవధిలో గరిష్ఠ వ్యాక్సినేషన్‌ సాకారం అయ్యేలా అత్యవసర దిద్దుబాటు చర్యల్ని పట్టాలకు ఎక్కిస్తేనే... ఈ మహాసంక్షోభం నుంచి జాతి తెరిపిన పడగలిగేది!

ఇవీ చదవండి :

Last Updated : Mar 18, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.