ETV Bharat / opinion

మానవ తప్పిదాలతోనే ప్రకృతి విలయం!

author img

By

Published : Nov 3, 2020, 7:21 AM IST

ప్రకృతి ప్రళయాలు, విపత్తులు మనకు కొత్తేమీ కాదు. కాకపోతే పర్యావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా- మండే ఎండలు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీలు సర్వసాధారణంగా మారాయి. అయినా ప్రస్తుత దుస్థితికి మానవ తప్పిదాలు ప్రధానంగా తోడవుతున్నాయనేది చేదు నిజం. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు చేపట్టినా పౌరుల్లో బాధ్యత పెరిగి, మార్పు వస్తేనే ప్రకృతి వనరుల పరిరక్షణ సాధ్యమవుతుంది. అప్పుడే మానవ ప్రేరిత విపత్తులను నివారించడం తేలికవుతుంది.

Natural disasters
ప్రకృతి విళయం

కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరిన్ని ఇక్కట్లలో ముంచెత్తాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది. హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు, నాలాలు పొంగిపొర్లి వందల కాలనీలను ముంచెత్తాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులతో పాటు కార్లు, బైకులు వరద ప్రవాహంలో కొట్టుకొనిపోవడంతో భారీ నష్టమే సంభవించింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ తేరుకోనేలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో అనేక చోట్ల ఇళ్లు, పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ముంపుబాధ తప్పలేదు. అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని చేనేత గ్రామాల్లో మగ్గాలు నీటమునిగి ఎందరికో కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో రెండు నెలలదాకా పనులు మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

మానవ తప్పిదాలే..

ఇలాంటి ప్రకృతి ప్రళయాలు, విపత్తులు మనకు కొత్తేమీ కాదు. కాకపోతే పర్యావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా- మండే ఎండలు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీలు సర్వసాధారణంగా మారాయి. ఇలాంటి విపత్తులన్నీ ప్రకృతి సహజ సిద్ధమైనవే అయినా ప్రస్తుత దుస్థితికి మానవ తప్పిదాలు ప్రధానంగా తోడవుతున్నాయనేది చేదు నిజం. 2004లో వచ్చిన సునామీ దక్షిణాసియాతోపాటు భారత్‌లోని అండమాన్‌ నికోబార్‌ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరిలను అతలాకుతలం చేసింది. పెద్ద సంఖ్యలో జనం మరణించగా, మరెంతో మంది ఆచూకీ లేకుండా పోయినట్లు తేలింది.

సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే మడ అడవులను నరికి రిసార్టులు, హోటళ్లు, జనావాసాలు ఏర్పరచుకోవడం, ఇతరత్రా అభివృద్ధి కార్యకలాపాలే దీనికి ప్రధాన కారణం. ఎల్‌ నినో ప్రభావంతో 2015లో చెన్నైలో సంభవించిన భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకోగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2017లో ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడమే కాకుండా, చాలా రోజులపాటు జనజీవనం అస్తవ్యస్తమైంది.

పట్టణ ప్రణాళిక..

ఇటీవలి కాలంలో వలసల వల్ల ప్రధాన నగరాల్లో జనసాంద్రత పెరగడంతోపాటు వాటికి అనుగుణంగా పట్టణ ప్రణాళికను సరైన రీతిలో పాటించకపోవడం, అక్రమ కట్టడాలు, పురాతన మౌలిక సదుపాయాలు, అంతంతమాత్రంగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థ ఈ దుస్థితికి ప్రధాన కారణాలవుతున్నాయి. భవన నిర్మాణ నియమాల ప్రకారం నగరాల్లో వాన నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం పరిస్థితిని దుర్భరం చేస్తోంది.

పర్యావరణ నిబంధనల ప్రకారం ప్రతి చెరువు, నదీ పరీవాహక ప్రాంతాల్లో కొంత భూభాగాన్ని బఫర్‌ జోన్‌గా నిర్ణయించి అక్కడ చెట్లు, పచ్చిక బయళ్ళు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ బఫర్‌ జోన్లలో తాత్కాలిక ఆవాసాలు ఏర్పరచుకోవడంతో మొదలుపెట్టి, బహుళ అంతస్తుల ఆకాశ హర్మ్యాలూ వెలుస్తున్నాయి. పెరుగుతున్న జనాభాతో భవన నిర్మాణాలు పెరగడం, బఫర్‌ జోన్లు ఆక్రమణలకు గురవడం, వాటికి అత్యంత సమీపంలోనే పుట్టగొడుగుల్లా వెంచర్లు అభివృద్ధి చెందడం సమస్యలకు కారణమవుతోంది.

చెరువులు, నాలాలు..

ఒకప్పుడు హైదరాబాదు పరిధిలో 350 పెద్ద చెరువులున్నట్లు రికార్డులు చెబుతాయి. కాలక్రమంలో అవి ఆక్రమణలకు గురవగా, ప్రస్తుతం 185 దాకా ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి 168 మాత్రమే మిగిలి ఉన్నాయన్నది యథార్థం. ఈ చెరువులన్నీ ఒకదానికొకటి గొలుసు కట్టు విధానంలో నాలాల ద్వారా అనుసంధానమై ఉన్నాయి. క్రమేపీ ఈ నాలాలు కూడా ఆక్రమణలకు గురై కుంచించుకు పోవడంతో వాన నీరు జనావాసాల్లోకి చేరుతోంది. దానికి తోడు చెరువులు, నాలాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేయడంతో చాలా వరకు డ్రైనేజీలు మూసుకుపోయి వాన నీరు నేరుగా జనావాసాల్లోకి మళ్ళింది. ఇటీవలి వరదల దృష్ట్యా హైదరాబాద్‌లో చేపట్టిన ప్రత్యేక వ్యర్థాల నిర్మూలన కార్యక్రమంలో ఒక్క రోజులో 3049 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరించారు. దీన్ని బట్టి చూస్తే- ఎంత నిర్లక్ష్యంగా చెత్తను పారేస్తున్నారనేది తెలుస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో బహిరంగంగా చెత్త వేస్తే నేరంగా పరిగణిస్తారు. మనదేశంలో కఠిన రీతిలో కాకుండా ప్రజల భాగస్వామ్యాన్ని ఆశిస్తూ స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ఇది కొంతమేర సత్ఫలితాలు ఇచ్చినా, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు, కార్యక్రమాలు చేపట్టినా పౌరుల్లో బాధ్యత పెరిగి, అవగాహన ఏర్పడి, మార్పు వస్తేనే ప్రకృతి వనరుల పరిరక్షణ సాధ్యమవుతుంది. అప్పుడే మానవ ప్రేరిత విపత్తులను నివారించడం తేలికవుతుంది.

(రచయిత- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌, మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు)

కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరిన్ని ఇక్కట్లలో ముంచెత్తాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది. హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు, నాలాలు పొంగిపొర్లి వందల కాలనీలను ముంచెత్తాయి. ఇళ్లలోని నిత్యావసర వస్తువులతో పాటు కార్లు, బైకులు వరద ప్రవాహంలో కొట్టుకొనిపోవడంతో భారీ నష్టమే సంభవించింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ తేరుకోనేలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో అనేక చోట్ల ఇళ్లు, పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ముంపుబాధ తప్పలేదు. అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని చేనేత గ్రామాల్లో మగ్గాలు నీటమునిగి ఎందరికో కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో రెండు నెలలదాకా పనులు మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

మానవ తప్పిదాలే..

ఇలాంటి ప్రకృతి ప్రళయాలు, విపత్తులు మనకు కొత్తేమీ కాదు. కాకపోతే పర్యావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా- మండే ఎండలు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీలు సర్వసాధారణంగా మారాయి. ఇలాంటి విపత్తులన్నీ ప్రకృతి సహజ సిద్ధమైనవే అయినా ప్రస్తుత దుస్థితికి మానవ తప్పిదాలు ప్రధానంగా తోడవుతున్నాయనేది చేదు నిజం. 2004లో వచ్చిన సునామీ దక్షిణాసియాతోపాటు భారత్‌లోని అండమాన్‌ నికోబార్‌ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరిలను అతలాకుతలం చేసింది. పెద్ద సంఖ్యలో జనం మరణించగా, మరెంతో మంది ఆచూకీ లేకుండా పోయినట్లు తేలింది.

సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే మడ అడవులను నరికి రిసార్టులు, హోటళ్లు, జనావాసాలు ఏర్పరచుకోవడం, ఇతరత్రా అభివృద్ధి కార్యకలాపాలే దీనికి ప్రధాన కారణం. ఎల్‌ నినో ప్రభావంతో 2015లో చెన్నైలో సంభవించిన భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకోగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2017లో ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడమే కాకుండా, చాలా రోజులపాటు జనజీవనం అస్తవ్యస్తమైంది.

పట్టణ ప్రణాళిక..

ఇటీవలి కాలంలో వలసల వల్ల ప్రధాన నగరాల్లో జనసాంద్రత పెరగడంతోపాటు వాటికి అనుగుణంగా పట్టణ ప్రణాళికను సరైన రీతిలో పాటించకపోవడం, అక్రమ కట్టడాలు, పురాతన మౌలిక సదుపాయాలు, అంతంతమాత్రంగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థ ఈ దుస్థితికి ప్రధాన కారణాలవుతున్నాయి. భవన నిర్మాణ నియమాల ప్రకారం నగరాల్లో వాన నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం పరిస్థితిని దుర్భరం చేస్తోంది.

పర్యావరణ నిబంధనల ప్రకారం ప్రతి చెరువు, నదీ పరీవాహక ప్రాంతాల్లో కొంత భూభాగాన్ని బఫర్‌ జోన్‌గా నిర్ణయించి అక్కడ చెట్లు, పచ్చిక బయళ్ళు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ బఫర్‌ జోన్లలో తాత్కాలిక ఆవాసాలు ఏర్పరచుకోవడంతో మొదలుపెట్టి, బహుళ అంతస్తుల ఆకాశ హర్మ్యాలూ వెలుస్తున్నాయి. పెరుగుతున్న జనాభాతో భవన నిర్మాణాలు పెరగడం, బఫర్‌ జోన్లు ఆక్రమణలకు గురవడం, వాటికి అత్యంత సమీపంలోనే పుట్టగొడుగుల్లా వెంచర్లు అభివృద్ధి చెందడం సమస్యలకు కారణమవుతోంది.

చెరువులు, నాలాలు..

ఒకప్పుడు హైదరాబాదు పరిధిలో 350 పెద్ద చెరువులున్నట్లు రికార్డులు చెబుతాయి. కాలక్రమంలో అవి ఆక్రమణలకు గురవగా, ప్రస్తుతం 185 దాకా ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి 168 మాత్రమే మిగిలి ఉన్నాయన్నది యథార్థం. ఈ చెరువులన్నీ ఒకదానికొకటి గొలుసు కట్టు విధానంలో నాలాల ద్వారా అనుసంధానమై ఉన్నాయి. క్రమేపీ ఈ నాలాలు కూడా ఆక్రమణలకు గురై కుంచించుకు పోవడంతో వాన నీరు జనావాసాల్లోకి చేరుతోంది. దానికి తోడు చెరువులు, నాలాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేయడంతో చాలా వరకు డ్రైనేజీలు మూసుకుపోయి వాన నీరు నేరుగా జనావాసాల్లోకి మళ్ళింది. ఇటీవలి వరదల దృష్ట్యా హైదరాబాద్‌లో చేపట్టిన ప్రత్యేక వ్యర్థాల నిర్మూలన కార్యక్రమంలో ఒక్క రోజులో 3049 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరించారు. దీన్ని బట్టి చూస్తే- ఎంత నిర్లక్ష్యంగా చెత్తను పారేస్తున్నారనేది తెలుస్తోంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో బహిరంగంగా చెత్త వేస్తే నేరంగా పరిగణిస్తారు. మనదేశంలో కఠిన రీతిలో కాకుండా ప్రజల భాగస్వామ్యాన్ని ఆశిస్తూ స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ఇది కొంతమేర సత్ఫలితాలు ఇచ్చినా, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు, కార్యక్రమాలు చేపట్టినా పౌరుల్లో బాధ్యత పెరిగి, అవగాహన ఏర్పడి, మార్పు వస్తేనే ప్రకృతి వనరుల పరిరక్షణ సాధ్యమవుతుంది. అప్పుడే మానవ ప్రేరిత విపత్తులను నివారించడం తేలికవుతుంది.

(రచయిత- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌, మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.