నేటి బాలలే భావి భారత పౌరులు. దేశాభివృద్ధికి వారే వెన్నెముక. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ ఎందరో చిన్నారులు సరైన పోషకాహారం లేక గిడసబారిపోతున్నారు. నాలుగో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం దేశంలో అయిదేళ్లలోపు పిల్లల్లో 38శాతానికి పైగా ఎదుగుదల లోపాలతో బాధపడుతున్నారు. 35శాతం పిల్లలు వయసుకు తగిన బరువు లేరు. ఉన్నత వర్గాలతో పోలిస్తే అట్టడుగు వర్గాల్లో ఈ సమస్య మరింత అధికం. 'కులదుర్విచక్షణ, ఎదుగుదల లోపాలు' పేరుతో అశోకా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థిక గణాంకాలు, విశ్లేషణ కేంద్రం వెలువరించిన నివేదిక దీన్ని మరోసారి రుజువుచేసింది. అస్పృశ్యత ఎక్కువగా ఉన్న బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని దళిత పిల్లల్లో ఎదుగుదల లోపాలు హెచ్చుగా ఉన్నట్లు అశోకా వర్సిటీ అధ్యయనం తేల్చి చెప్పింది. ఎస్సీఎస్టీల్లో 40శాతం పిల్లల్ని ఎదుగుదల లోపాలు బాధిస్తుండగా, ఓబీసీల్లో ఆ రేటు 36శాతంగా ఉంది.
ఎదుగుదల లోపం అంటే..
పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడాన్ని ఎదుగుదల లోపంగా పేర్కొంటారు. పోషకాహారలోపం, పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్య సౌకర్యాల లేమి, పేదరికం, ఆడ, మగ పిల్లల మధ్య దుర్విచక్షణ వంటివి దీనికి కారణాలు. ఉన్నత వర్గాల్లో 65శాతానికి నాణ్యమైన, వ్యక్తిగత పారిశుద్ధ్య సదుపాయాలుంటే, ఎస్టీల్లో 25.9శాతానికే అవి అందుబాటులో ఉన్నట్లు ఇటీవల ఆక్స్ఫామ్ అసమానతా నివేదిక వెల్లడించింది. ఎగువన ఉన్న 20శాతంతో పోలిస్తే అడుగున ఉన్న 20శాతం జనాభా పిల్లల్లో అయిదేళ్లలోపే మరణించే వారి సంఖ్య మూడు రెట్లు అధికంగా నెలకొనే అవకాశం ఉంది. ఏపీలో ఎదుగుదల లోపాలున్న అయిదేళ్లలోపు బాలలు పట్టణాల్లో 23శాతం, గ్రామీణంలో 34శాతం, మొత్తంగా 31.2శాతం ఉన్నట్లు అయిదో ఎన్ఎఫ్హెచ్ఎస్ పేర్కొంది. నాలుగో విడత సర్వేలో ఇది 31.4శాతం.
మరణముప్పు
తెలంగాణలో అయిదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలున్నవారు పట్టణాల్లో 28.1శాతం ఉండగా, పల్లెల్లో 35.7శాతం, మొత్తంగా 33.1శాతం. నాలుగోవిడత సర్వేలో ఇది 28శాతం. గతేడాది నవంబరు నాటికి భారత్లో ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లల్లో 9.3 లక్షల మంది తీవ్ర పోషకాహార సమస్యను ఎదుర్కొన్నట్లు ఇటీవల కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతీ ఇరానీ పార్లమెంటులో ప్రకటించారు. వీరిలో దాదాపు 40శాతం ఒక్క ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు. తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డకు ఎదుగుదల సమస్య ఎదురవుతుంది. ఇటువంటి పిల్లలను మరణముప్పు వెంటాడుతుంది. వీరిలో ఐక్యూ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా చదువులో సరిగ్గా రాణించలేరు. అభివృద్ధిలో వెనకబడతారు.
మిషన్ పోషన్ 2.0
గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్రం 1975లో సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక కార్యక్రమంగా గుర్తింపు పొందింది. సరైన విద్య లేని మహిళలు, నిరుపేద కుటుంబాలకు ఐసీడీఎస్ ప్రయోజనాలు అందడంలేదని గతంలో అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) ధ్రువీకరించింది. ఐసీడీఎస్ లక్ష్యాలతోనే 2018లో పోషణ్ అభియాన్ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆరేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలను 2022 నాటికి 38శాతం నుంచి 25శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పోషకాహారానికి సంబంధించి మిషన్ పోషన్ 2.0ను కేంద్రం 2021-22 బడ్జెట్లో ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు అయిదేళ్లపాటు ఇది అమలు కావాల్సిఉంది. భారత్లో 2032 నాటికి 31శాతం పిల్లలు ఎదుగుదల లోపాలతో బాధపడతారని రెండేళ్ల కిందట ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం పేర్కొంది. దేశంలో 77శాతం ఎస్టీ, 69శాతం ఎస్సీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో చాలా మందికి ఆ బడుల్లో అందించే మధ్యాహ్న భోజనమే పోషకాహార కొరతను తీరుస్తోంది. కరోనా మహమ్మారి వల్ల పాఠశాలలు మూతపడి వీరంతా దానికి దూరమయ్యారు. కొవిడ్ రెండో దశ మొదలయ్యాక భారత్లో 23కోట్ల మంది రోజువారీ సంపాదన కనీస వేతనం రూ.375 కంటే తక్కువకు కోసుకుపోయి ఎన్నో కుటుంబాలకు అర్ధాకలి పరిస్థితి దాపురించింది. ఇటువంటి తరుణంలో చిన్నారులు, మాతృమూర్తులకు పౌష్టికాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.
రచయిత - దివ్యాన్షశ్రీ
ఇదీ చూడండి: 'విభజన విషాద సంస్మరణ దినంగా ఆగస్టు 14'