ETV Bharat / opinion

ఇంకా సవాళ్ల మధ్యే 'ఆన్‌లైన్‌' అభ్యసనం!

author img

By

Published : Oct 8, 2020, 8:45 AM IST

కరోనా తెచ్చిన కొత్త సమస్య ఏమిటంటే విద్యాభ్యాసం టెక్నాలజీకి పరిమితం కావడం. బడి అనే విశాలమైన ప్రదేశం ఇప్పుడు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ ఫోన్​లో ఇరుక్కుపోయింది. కానీ, ఆ సాంకేతికత అందరికీ అందకపోతే...? విద్యార్థులు తరగతి గదుల్లో ఎంత నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారనేది తెలుసుకునేందుకు సరైన సాధనాలు లేవు. మార్కులే నాణ్యతకు గీటురాయనే వాదనా సరైంది కాదు. అయితే, ఆన్‌లైన్‌ విద్య అభ్యసనం ఎంతమేర నాణ్యమైనదనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి.

Challenges to 'Online' EDUCATION
ఇంకా సవాళ్ల మధ్యే 'ఆన్‌లైన్‌' అభ్యసనం!

విద్యార్థులు తరగతి గదుల్లో ఎంత నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారనేది తెలుసుకునేందుకు సరైన సాధనాలు లేవు. మార్కులే నాణ్యతకు గీటురాయనే వాదనా సరైంది కాదు. నాణ్యమైన అభ్యసనకు పాఠశాల వాతావరణం, కోర్సు తీరు, పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం సహా విద్యార్థి మానసిక సంసిద్ధత ప్రధానంగా దోహదపడతాయి. తరగతి గది అభ్యసనలో 30 శాతం విద్యార్థులు శ్రద్ధ పెట్టలేకపోతున్నారని లాక్‌డౌన్‌కు ముందే పలు అధ్యయనాలు స్పష్టీకరించాయి. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ విద్యా ప్రణాళికనే తలకిందులు చేసింది. విద్యార్థులకు అభ్యసన విరామం సరికాదని, సాధ్యమైనంత మేర బోధన ప్రక్రియను కొనసాగించాలన్న విద్యావేత్తల సూచనల మేరకు ప్రభుత్వాలు, విద్యాసంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. తరగతి గదిలో ప్రత్యక్షంగా కూర్చుని విద్యనభ్యసించే వాతావరణం ఇంకా కనిపించకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు జోరందుకున్నాయి. అయితే, ఆన్‌లైన్‌ విద్య అభ్యసనం ఎంతమేర నాణ్యమైనదనే సందేహాలు మొదలయ్యాయి.

ఇదీ చూడండి: విద్యార్థుల దగ్గరకే పాఠాలు- బైకు మీద క్లాసులు

పాఠాలు బుర్రకెక్కుతున్నాయా?

ప్రాథమిక విద్య నుంచి పరిశోధక స్థాయి వరకు ఆన్‌లైన్‌ అభ్యసనే సాగుతోంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలతోపాటు రాష్ట్రాల స్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేటు బడులూ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. కొన్ని కళాశాలలు, పాఠశాలలు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించి రెండు నెలలు దాటింది. భాషలు, సాంఘిక శాస్త్రాల బోధనపై కొంత సంతృప్తి ఉన్నా- గణితం, విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల వంటి ఆచరణాత్మక అభ్యసన నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నాయి. తరగతి గదిలో చెప్పే పాఠాలు కొన్నింటిని ఆన్‌లైన్‌ ద్వారా ప్రభావపూరితంగా చెప్పడం కష్టం కాబట్టి మదింపు అవసరమని యూజీసీ, ఎన్‌సీఈఆర్‌టీలు స్పష్టీకరిస్తున్నాయి. పాఠాలు చెప్పడమే తప్ప, కిందిస్థాయిలో విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడనే విషయంలో సరైన మదింపు జరగడం లేదన్నది నిర్వివాదం.

కేంద్రీయ పాఠశాలల్లో సాగుతున్న ఆన్‌లైన్‌ బోధన నాణ్యతపై ఎన్‌సీఈఆర్‌టీ జరిపిన సర్వేలో 35 శాతం విద్యార్థులకు పాఠాలు అర్థం కావడంలేదన్న వాస్తవం బయటపడింది. 27 శాతం పిల్లలకు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్లు లేవు. విద్యుత్‌ అంతరాయం, అంతర్జాల అనుసంధాన లోపాలు, చిన్న తెరలపై కంటిచూపు సమస్యలు శాపాలవుతున్నాయి. ఆన్‌లైన్‌ బోధనా నైపుణ్యాల కొరత అదనం! తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి మునుపే సరైన అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించిన ప్రైవేటు పాఠశాలల తీరుపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ... ఈ తరహా బోధన వల్ల పేద విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ప్రశ్నించడం గమనార్హం. పాఠశాల స్థాయిలో లక్షలాది విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రక్రియకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దూరదర్శన్‌, రేడియోల ద్వారా శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి బోధన సాగించాలని తెలంగాణ గిరిజన శాఖ సూచించింది. ఇద్దరు విద్యార్థులున్న కుటుంబంలో ఒకే ఫోన్‌తో పాఠాలు వినాల్సి రావడం సమస్యగా మారింది. అసలు పాఠాలు ఎంత శ్రద్ధగా వింటున్నారన్నదీ అనుమానమే. పరిస్థితులన్నీ చక్కబడ్డాక ఇవే పాఠాలు తరగతి గదుల్లో ప్రత్యక్షంగా మళ్ళీ చెబుతారా అన్నదీ సందేహమే. మరోవైపు, చదువులంటే ఆసక్తి ఉండే విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు బోధపడక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

బోధన సమస్యలు

ఆన్‌లైన్‌ బోధనలో ఎన్ని పాఠాలు చెప్పాలి, తరగతులు ప్రారంభమైతే ఎన్ని బోధించాలి, థియరీ ఎంత, ప్రాక్టికల్స్‌ ఎలా వంటివి ఉపాధ్యాయులను గందరగోళపరుస్తున్న అంశాలు. ఉపాధ్యాయుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడంతో పరీక్షలు జరుగుతాయో, లేదోనన్న మీమాంస విద్యార్థుల్లో నిర్లక్ష్య ధోరణి ఏర్పడటానికి కొంత కారణమవుతోంది. దేశంలో కనీసం 27 శాతం విద్యార్థులకు ఎలక్ట్రానిక్‌ పరికరాలు అందుబాటులో లేవని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి పరిస్థితి పేద విద్యార్థుల్లో ఆత్మనూన్యతను పెంచుతుందని ఇటీవల దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పేద విద్యార్థులకు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఉచిత అంతర్జాల సదుపాయం కల్పించాలని సూచించింది. విద్యార్థుల ఉపకార వేతనాల బడ్జెట్‌ నుంచి ఆన్‌లైన్‌ బోధనకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. తరగతి గది విద్య పునరాగమనం వరకు విద్యాసంవత్సరం కోల్పోకుండా సాధ్యమైనంత నాణ్యమైన బోధన చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఆరు నెలలుగా గడపదాటని విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని ఆచరణాత్మక, గుణాత్మక బోధన అందించాలి. బోధన ప్రసంగశైలిలో కాకుండా బొమ్మలు, దృశ్యాలు, గణాంకాలు, పటాలు, రేఖాచిత్రాలతో వివరిస్తే మేలు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో సరైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తూ, ఉపకరణాలు సమకూర్చాలి. సహేతుక జాగ్రత్తలతో అడుగు ముందుకు కదిపితేనే ఆన్‌లైన్‌ విధానంలో నాణ్యమైన విద్యాబోధన సాకారమవుతుంది.

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి (అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)

ఇదీ చూడండి: చెట్టెక్కిన ఆన్​లైన్ చదువులు.. ప్రమాదంలో పసి ప్రాణాలు!

విద్యార్థులు తరగతి గదుల్లో ఎంత నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారనేది తెలుసుకునేందుకు సరైన సాధనాలు లేవు. మార్కులే నాణ్యతకు గీటురాయనే వాదనా సరైంది కాదు. నాణ్యమైన అభ్యసనకు పాఠశాల వాతావరణం, కోర్సు తీరు, పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం సహా విద్యార్థి మానసిక సంసిద్ధత ప్రధానంగా దోహదపడతాయి. తరగతి గది అభ్యసనలో 30 శాతం విద్యార్థులు శ్రద్ధ పెట్టలేకపోతున్నారని లాక్‌డౌన్‌కు ముందే పలు అధ్యయనాలు స్పష్టీకరించాయి. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ విద్యా ప్రణాళికనే తలకిందులు చేసింది. విద్యార్థులకు అభ్యసన విరామం సరికాదని, సాధ్యమైనంత మేర బోధన ప్రక్రియను కొనసాగించాలన్న విద్యావేత్తల సూచనల మేరకు ప్రభుత్వాలు, విద్యాసంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. తరగతి గదిలో ప్రత్యక్షంగా కూర్చుని విద్యనభ్యసించే వాతావరణం ఇంకా కనిపించకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు జోరందుకున్నాయి. అయితే, ఆన్‌లైన్‌ విద్య అభ్యసనం ఎంతమేర నాణ్యమైనదనే సందేహాలు మొదలయ్యాయి.

ఇదీ చూడండి: విద్యార్థుల దగ్గరకే పాఠాలు- బైకు మీద క్లాసులు

పాఠాలు బుర్రకెక్కుతున్నాయా?

ప్రాథమిక విద్య నుంచి పరిశోధక స్థాయి వరకు ఆన్‌లైన్‌ అభ్యసనే సాగుతోంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలతోపాటు రాష్ట్రాల స్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేటు బడులూ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. కొన్ని కళాశాలలు, పాఠశాలలు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించి రెండు నెలలు దాటింది. భాషలు, సాంఘిక శాస్త్రాల బోధనపై కొంత సంతృప్తి ఉన్నా- గణితం, విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల వంటి ఆచరణాత్మక అభ్యసన నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నాయి. తరగతి గదిలో చెప్పే పాఠాలు కొన్నింటిని ఆన్‌లైన్‌ ద్వారా ప్రభావపూరితంగా చెప్పడం కష్టం కాబట్టి మదింపు అవసరమని యూజీసీ, ఎన్‌సీఈఆర్‌టీలు స్పష్టీకరిస్తున్నాయి. పాఠాలు చెప్పడమే తప్ప, కిందిస్థాయిలో విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడనే విషయంలో సరైన మదింపు జరగడం లేదన్నది నిర్వివాదం.

కేంద్రీయ పాఠశాలల్లో సాగుతున్న ఆన్‌లైన్‌ బోధన నాణ్యతపై ఎన్‌సీఈఆర్‌టీ జరిపిన సర్వేలో 35 శాతం విద్యార్థులకు పాఠాలు అర్థం కావడంలేదన్న వాస్తవం బయటపడింది. 27 శాతం పిల్లలకు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్లు లేవు. విద్యుత్‌ అంతరాయం, అంతర్జాల అనుసంధాన లోపాలు, చిన్న తెరలపై కంటిచూపు సమస్యలు శాపాలవుతున్నాయి. ఆన్‌లైన్‌ బోధనా నైపుణ్యాల కొరత అదనం! తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి మునుపే సరైన అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించిన ప్రైవేటు పాఠశాలల తీరుపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ... ఈ తరహా బోధన వల్ల పేద విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ప్రశ్నించడం గమనార్హం. పాఠశాల స్థాయిలో లక్షలాది విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రక్రియకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దూరదర్శన్‌, రేడియోల ద్వారా శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి బోధన సాగించాలని తెలంగాణ గిరిజన శాఖ సూచించింది. ఇద్దరు విద్యార్థులున్న కుటుంబంలో ఒకే ఫోన్‌తో పాఠాలు వినాల్సి రావడం సమస్యగా మారింది. అసలు పాఠాలు ఎంత శ్రద్ధగా వింటున్నారన్నదీ అనుమానమే. పరిస్థితులన్నీ చక్కబడ్డాక ఇవే పాఠాలు తరగతి గదుల్లో ప్రత్యక్షంగా మళ్ళీ చెబుతారా అన్నదీ సందేహమే. మరోవైపు, చదువులంటే ఆసక్తి ఉండే విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు బోధపడక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

బోధన సమస్యలు

ఆన్‌లైన్‌ బోధనలో ఎన్ని పాఠాలు చెప్పాలి, తరగతులు ప్రారంభమైతే ఎన్ని బోధించాలి, థియరీ ఎంత, ప్రాక్టికల్స్‌ ఎలా వంటివి ఉపాధ్యాయులను గందరగోళపరుస్తున్న అంశాలు. ఉపాధ్యాయుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడంతో పరీక్షలు జరుగుతాయో, లేదోనన్న మీమాంస విద్యార్థుల్లో నిర్లక్ష్య ధోరణి ఏర్పడటానికి కొంత కారణమవుతోంది. దేశంలో కనీసం 27 శాతం విద్యార్థులకు ఎలక్ట్రానిక్‌ పరికరాలు అందుబాటులో లేవని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి పరిస్థితి పేద విద్యార్థుల్లో ఆత్మనూన్యతను పెంచుతుందని ఇటీవల దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పేద విద్యార్థులకు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఉచిత అంతర్జాల సదుపాయం కల్పించాలని సూచించింది. విద్యార్థుల ఉపకార వేతనాల బడ్జెట్‌ నుంచి ఆన్‌లైన్‌ బోధనకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. తరగతి గది విద్య పునరాగమనం వరకు విద్యాసంవత్సరం కోల్పోకుండా సాధ్యమైనంత నాణ్యమైన బోధన చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఆరు నెలలుగా గడపదాటని విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని ఆచరణాత్మక, గుణాత్మక బోధన అందించాలి. బోధన ప్రసంగశైలిలో కాకుండా బొమ్మలు, దృశ్యాలు, గణాంకాలు, పటాలు, రేఖాచిత్రాలతో వివరిస్తే మేలు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో సరైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తూ, ఉపకరణాలు సమకూర్చాలి. సహేతుక జాగ్రత్తలతో అడుగు ముందుకు కదిపితేనే ఆన్‌లైన్‌ విధానంలో నాణ్యమైన విద్యాబోధన సాకారమవుతుంది.

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి (అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)

ఇదీ చూడండి: చెట్టెక్కిన ఆన్​లైన్ చదువులు.. ప్రమాదంలో పసి ప్రాణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.