అమెరికాకు నాలుగేళ్లపాటు పీడకలగా సాగిన డొనాల్డ్ ట్రంప్ పాలన ఎట్టకేలకు అంతమైంది. రోమన్ సామ్రాజ్యాధినేత జూలియస్ సీజర్ను వెయ్యి కత్తిపోట్లతో హతమార్చారని షేక్స్పియర్ రాశారు. ట్రంప్ తనను తానే పొడుచుకుని ఆత్మహననానికి పాల్పడ్డారు. ఆయన అందరిలో శత్రువులను చూసినా, వాస్తవంలో తనకుతానే శత్రువు. గిట్టనివారిని బెదిరించడం, కోర్టుకు ఈడుస్తానంటూ వేధించడం, చిరకాల మిత్రులైన ఐరోపా దేశాలను దూరం చేసుకోవడం, వారితో అమెరికాకు ఉన్న మైత్రీ ఒప్పందాలను తుంగలో తొక్కడం, కళ్లెదుట కనబడుతున్న వాస్తవాలను అంగీరించడానికి నిరాకరించడం వంటి చేష్టలతో పొద్దుపుచ్చారు. ప్రస్తుతం అమెరికాలో రోజూ పెద్ద సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ స్వయంగా కరోనా బారిన పడ్డారు. అయినా అంతా బాగానే ఉందని, కరోనాను లెక్కచేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం సైన్స్ను బలిపెట్టారు. వాతావరణ మార్పులు బూటకమంటున్నారు. ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించడానికి నిరాకరించడంతో ప్రస్తుతం కరోనా విలయానికి అమెరికా ప్రజలు బలవుతున్నారు. అగ్రరాజ్య అధినేత హోదాలో కనబరచాల్సిన హుందాతనానికి నీళ్లొదిలి- జాతివిచక్షణను, స్త్రీ ద్వేషాన్ని, పరదేశీయులపై కక్షాకార్పణ్యాలను ప్రేరేపించారనే ఆరోపణలున్నాయి. సామాన్యుల్లో అభద్రతా భావనలను ప్రజ్వలింపజేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన బండారాన్ని బయటపెట్టే పుస్తకాలు ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిలో ఒకదాన్ని ట్రంప్ కుటుంబ సభ్యులే రాశారు. ఆయన పతనం అనంతరం మరిన్ని రాబోతున్నాయి.
కిందపడినా పైచేయి..
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా తన పేచీకోరు వ్యవహారాలతో- ఎన్నికల ఫలితాలు పచ్చి మోసమని, తన గెలుపును ప్రతిపక్షం దొంగిలించిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. కిందపడినా తనదే పైచేయి అంటూ అధ్యక్ష పదవిని వదలకుండా చూరు పట్టుకుని వేలాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబరు 14న ఎన్నికల అధికారులు ఫలితాలను సాధికారికంగా ప్రకటించి, 2021 జనవరి 20న బైడెన్ అధ్యక్ష సింహాసనం అధిరోహించాక ట్రంప్ నానాపాట్లు పడాల్సిందే. అమెరికాలో అతి ప్రాచీన రిపబ్లికన్ పార్టీ ట్రంప్ తోక పట్టుకుని ఈదాలనుకోవడం విడ్డూరం. ఆయన అప్రజాస్వామిక పనులకు ఆ పార్టీ వంతపాడటం విచారకరం. బైడెన్ పగ్గాలు చేపట్టిన తరవాత కూడా ఆయన ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించడానికి ట్రంప్, ఆయన పార్టీ నేతలు ప్రయత్నిస్తూనే ఉంటారనడంలో అనుమానమేమీ లేదు.
మరోవైపు, కొత్త అధ్యక్షుడు బైడెన్ ప్రజలకు ఐక్యతా సందేశం ఇస్తున్నారు. ఆశావహ భవిష్యత్తులోకి జాతిని, మిత్రదేశాలను నడిపిస్తానంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పార్టీ అభ్యర్థిత్వం కోసం తనతో పోటీ పడి, తీవ్ర విమర్శలు గుప్పించిన కమలా హ్యారిస్నే ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేసుకోవడం ద్వారా బైడెన్ తనలోని ఉదాత్త సహన గుణాన్ని లోకానికి తెలిసేలా చేశారు. ట్రంప్ ఎన్నికల్లో ఓడినా తానే గెలిచానంటూ వీరంగం చేస్తుంటే, బైడెన్ అందర్నీ సంయమనం పాటించాలని కోరడం ఆయన ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టింది. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్ష అభ్యర్థికీ రానన్ని ఓట్లు సాధించినా, ఈ విజయం తనను మరింత వినమ్రుడిని చేసిందని ప్రకటించి అందరి మన్ననలూ పొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కమలా హ్యారిస్ అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలే కాదు- నల్లజాతికి, భారతీయ సంతతికి చెందిన ప్రప్రథమ ఉపాధ్యక్షురాలు కూడా. అమెరికాలో రెండో అత్యున్నత పదవిని ఆమె అధిష్ఠించడం స్త్రీ జాతికి గర్వకారణం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోయినప్పుడు అమెరికా ఒక స్త్రీని అధ్యక్ష పదవికి ఎన్నుకోవడానికి సిద్ధంగా లేదని చాలామంది వ్యాఖ్యానించారు. అది వట్టి అపోహ అని కమలా హ్యారిస్ నిరూపించారు.
ముందరి కాళ్లకు బందాలు
జనవరిలో అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే కరోనా మహమ్మారిని వేగంగా అదుపులోకి తీసుకువచ్చి ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించాల్సిన బాధ్యత బైడెన్పై ఉంది. కొవిడ్ ప్రమాదాన్ని ట్రంప్ తక్కువ చేసి మాట్లాడగా, ఆ మాటలు నమ్మినవారెందరో ఉన్నారు. బైడెన్ ఈ అవాంఛనీయ పరిస్థితిని తక్షణం సరిదిద్దాల్సి ఉంది. శాస్త్రజ్ఞులు, వైద్యసిబ్బందిలో మళ్లీ నైతిక స్థైర్యం నింపాలి. త్వరలో అందుబాటులోకి రానున్న కరోనా టీకాను సత్వరం విశాల ప్రజానీకానికి అందించాలి. నిరుద్యోగాన్ని రూపుమాపే విధానాలను చేపట్టాలి. ట్రంప్ గాలికి వదిలేసిన కీలక ఒప్పందాలను పునరుద్ధరించి, మిత్ర దేశాల నమ్మకాన్ని చూరగొనాలి. ట్రంప్ విధానాల వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుజ్జీవింపజేయాలి. ట్రంప్ శత్రువులుగా భావించిన సమాచార సాధనాల్ని ప్రజాస్వామ్య వికాసానికి పట్టుగొమ్మలుగా చాటాలి. ట్రంప్ సర్కారు అత్యంత సంపన్నులకు ఇచ్చిన పన్ను మినహాయింపుల వల్ల ఖజానాకు గండి పడింది. దాన్ని పూడ్చి అభివృద్ధికి దోహదం చేసే ఆర్థిక విధానాలను చేపట్టాలి. ట్రంప్ హయాములో ప్రభుత్వ సిబ్బంది నైతిక స్థెర్యాన్ని దెబ్బతీశారు. బైడెన్ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుని, తన విధానాలను సమర్థంగా అమలు చేసే సాధనంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మలచాలి. హేతుబద్ధమైన పద్ధతుల్లో వలసలను అనుమతించాలి. ట్రంప్ సర్కారు నిర్వాకాలతో తల్లిదండ్రులకు దూరమైన 535 మంది పిల్లలను తిరిగి వారి కుటుంబాల వద్దకు చేర్చాలి. బైడెన్ అజెండాకు రిపబ్లికన్ మెజారిటీ ఉన్న సెనేట్, సుప్రీంకోర్టు అడ్డుతగలకమానవు. 2021 జనవరిలో వెల్లడయ్యే సెనేట్ ఎన్నికల తుది ఫలితాలు డెమోక్రాట్లకు మెజారిటీ కట్టబెడితే, బైడెన్ పని సులువు అవుతుంది. లేకుంటే రిపబ్లికన్లు బైడెన్ ముందరి కాళ్లకు బందాలు వేస్తూనే ఉంటారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా తనకున్న సుదీర్ఘ అనుభవంతో బైడెన్ ప్రత్యర్థుల పన్నాగాలను సమర్థంగా ఎదుర్కోగలరనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఆయన నిజం చేయాల్సి ఉంది!
బైడెన్ ముందు ముళ్లకంప..
అమెరికాలో ఎన్నికల నిర్వహణ ఓ సుదీర్ఘ తతంగం. ఆ దేశంలోని 50 రాష్ట్రాలు, 38 వేల నగరాలు, పట్టణాలు, కౌంటీలు (మండలాలు) స్వతంత్ర ప్రతిపత్తితో ఎన్నికలు నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమం ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడటానికి చాలా సమయం పడుతుంది. ఈ ఫలితాలను కోర్టుల్లో సవాలు చేయడానికి రిపబ్లికన్ పార్టీ కాచుక్కూర్చుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టుతోపాటు అనేక దిగువ స్థాయి కోర్టుల్లో రిపబ్లికన్ పార్టీ సానుభూతిపరులైన న్యాయమూర్తులదే మెజారిటీ. వారు డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే అవకాశాలున్నాయి. మరోవైపు దేశ ప్రజలు నిట్టనిలువునా చీలిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో బైడెన్కు పాలన కత్తిమీద సాము లాంటిదే!
- కృష్ణ కె.తుమ్మల (అమెరికాలోని క్యాన్సస్ స్టేట్ యూనివర్సిటీలో ఆచార్యులు)