పరిమిత మానవ వనరులతో సంస్థలు బహుళ ప్రయోజనాలు సాధించాల్సిన అగత్యాన్ని కొవిడ్ తెచ్చిపెట్టింది. సిబ్బంది అనేక నైపుణ్యాలను నేర్చుకుంటే కానీ, సకాలంలో ఆశించిన ఫలితాలను చూపలేరు. ఉదాహరణకు, ఉపాధ్యాయ వృత్తిని తీసుకోండి. కొవిడ్ ముందునాళ్లలో ఉపాధ్యాయులు ప్రధానంగా బోధనకే పరిమితమయ్యేవారు. కానీ, ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకులు ఏకకాలంలో పరిశోధకులుగా, శిక్షకులుగా, కన్సల్టెంట్లుగా, మార్కెటింగ్ నిపుణులుగా, నిధుల సమీకరణదారులుగా కూడా పనిచేయడానికి సమాయత్తం కావలసి వస్తోంది.
తమ సంస్థకు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు సాధించడానికే కాకుండా కరోనా వల్ల తరిగిపోయిన ఆదాయాన్ని పెంచుకోవడానికీ తోడ్పడవలసి వస్తోంది. దీనితోపాటు డిజిటల్ రూపంలోకి మారుతున్న విద్యాబోధనను సమర్థంగా చేపట్టడానికి వర్చువల్ అధ్యాపకుడిగా రూపాంతరం చెందక తప్పడం లేదు. ఇందుకోసం గత ఆరు నెలల్లో అధ్యాపకులు రకరకాల సాంకేతికతలను నేర్చుకొంటున్నారు. పాఠశాలల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు అధ్యాపకులు చేస్తున్న ఈ కృషి ఆశ్చర్యకరం, అభినందనీయం.
డిజిటలీకరణకు ప్రాధాన్యం
మేనేజ్మెంట్ రంగంలోనూ విస్తృత డిజిటలీకరణ జరుగుతోంది. మేనేజర్లు అనేకానేక పనులు చక్కబెట్టాలని యాజమాన్యాలు ఆశిస్తున్నాయి. కరోనా వల్ల వ్యాపారాలు సరిగ్గా నడవక ఆదాయాలు తగ్గిపోవడంతో కంపెనీలు, తక్కువ వ్యయంతో గరిష్ఠ ప్రయోజనాలు సాధించాలని చూస్తున్నాయి. బహుళ నైపుణ్యాలు ఉన్నవారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఇతర రంగాలకన్నా ఫైనాన్స్ రంగంలో డిజిటల్ రూపాంతరీకరణ చాలా ఉద్ధృతంగా సాగుతోంది. ఫైనాన్స్, ఎకౌంటింగ్ సిబ్బంది- శాప్, ఈఆర్పీ, పైఠాన్, డేటా ఎనలిటిక్స్, వర్చువల్ ఆడిట్ వంటి పరిజ్ఞానాలను నేర్చుకొంటున్నారు. అలాగే ఐటీ సిబ్బంది ఫైనాన్స్ సాంకేతికతలను అలవరచుకుంటున్నారు. ఓపెన్ బ్యాంకింగ్, బ్లాక్ చెయిన్, ఫైనాన్స్ పరిశోధన వంటి రంగాల్లో ఫిన్ టెక్ సొల్యూషన్స్ను అందించడానికి ఫైనాన్స్, బ్యాంకింగ్ మౌలిక సూత్రాలను నేర్చుకుంటున్నారు.
కంపెనీల్లో మానవ వనరుల శాఖ (హ్యూమన్ రిసోర్సెస్-హెచ్ఆర్) విధినిర్వహణ తీరుతెన్నులను కొవిడ్ మార్చేసింది. హెచ్ఆర్ సిబ్బంది ఇప్పుడు ఉద్యోగ డిజైన్, ఉద్యోగ విశ్లేషణ, ఉద్యోగ రొటేషన్ వంటి కొత్త పదజాలాలను వాడుతున్నారు. సిబ్బంది నడవడికను అధ్యయనం చేయడం, వారి మనస్తత్వాలను అవగాహన చేసుకోవడం హెచ్ఆర్ సిబ్బంది విధుల్లో భాగమైంది. తమ ఉద్యోగ నిర్వహణకు సాంకేతికతను పెద్దయెత్తున వినియోగించవలసి వస్తోంది. కొవిడ్వల్ల చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. వారిని వర్చువల్గా మేనేజ్ చేయడం క్లిష్టమైన కార్యమైంది. అభ్యర్థులకు ఆన్లైన్లో లిఖిత పరీక్షలు, వర్చువల్ బృంద చర్చలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల్లో వారి ప్రవర్తనను పరిశీలించడం... హెచ్ఆర్ సిబ్బంది కొత్త విధులుగా మారాయి. కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకునేటప్పుడు ఆన్లైన్లో వారి ధోరణులను, వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదు. దీనికి కావలసిన నైపుణ్యాలను హెచ్ఆర్ సిబ్బంది అలవరచుకోక తప్పడం లేదు. కొవిడ్ వల్ల ఉద్యోగాల్లో ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమించే విషయంలో సిబ్బందికి సలహాలు ఇచ్చే బాధ్యతనూ హెచ్ఆర్ సిబ్బంది నిర్వహించాల్సి వస్తోంది.
బహుళ ప్రయోజనాలే లక్ష్యం
కరోనా వల్ల మార్కెటింగ్ విధులూ సమూలంగా మారిపోతున్నాయి. వ్యక్తులను నేరుగా కలిసి విక్రయాలు సాగించే రోజులు పోయాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్కే గిరాకీ. క్లిక్కు ఇంత అని చెల్లింపులు జరిపే (పే ఫర్ క్లిక్) పద్ధతిలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం; అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలపై డిజిటల్ ప్రకటనలు ఇవ్వడం- నేడు అడ్వర్టయిజింగ్ మేనేజర్ వృత్తిలో నిత్యకృత్యాలయ్యాయి. ఇప్పుడు అంతా డిజిటల్ మార్కెటింగ్గా మారిపోతోంది. అందుకే మార్కెటింగ్ మేనేజర్లు వెబ్ డిజైన్, గూగుల్ ఎడ్ వర్డ్స్, ఎస్ఈఓ (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్), ప్రోగ్రామింగ్, కంటెంట్ రైటింగ్ వంటి డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అలవరచుకొంటున్నారు.
కొత్త సాంకేతికతలు యాజమాన్య విధినిర్వహణను వేగంగా మార్చేస్తున్నాయి. పోనుపోను వ్యాపార నిర్వహణకు ఇంజినీరింగ్, టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సంగమం అవసరపడుతుందని గమనించి, తదనుగుణంగా సమ్మిళిత కోర్సులను ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. వివిధ రకాల కోర్సుల్లోని అంశాలను మేళవించి, బహుముఖ అధ్యయనాన్ని ప్రోత్సహించడం నేటి అవసరం. టెక్నాలజీ కంపెనీలు బిజినెస్ స్కూళ్లతో కలిసి సాంకేతికంగా మెరికల్లాంటి మేనేజర్లను సృష్టించడం తప్పనిసరి. ఇవాల్టి కరోనా సంక్షోభాన్ని అధిగమించడానికే కాదు, రేపటి అవసరాలనూ తీర్చగలిగే బహుళ నైపుణ్యాలను సిబ్బంది అలవరచుకోవాలి. దానికి కావలసిన వాతావరణాన్ని ప్రభుత్వం, విద్యాసంస్థలు, కార్పొరేట్లు కలిసి సృష్టించాలి.
- ఎం.చంద్రశేఖర్
( హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్)