ఆరుబయట పనిచేసే మహిళలకి రొమ్ముక్యాన్సర్ త్వరగా రాదని పేర్కొంటున్నారు డానిష్ క్యాన్సర్ విభాగానికి చెందిన నిపుణులు. ఎండలో పనిచేసేవాళ్లలో డి-విటమిన్ సమృద్ధిగా ఉండడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం తక్కువట. ఇప్పటికే ఎముకల ఆరోగ్యానికీ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకూ విటమిన్-డి తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా దీనివల్ల క్యాన్సర్లూ రావు అంటున్నారు.
నీడపట్టునే ఉంటే..
గత యాభై, అరవై ఏళ్ల నుంచీ రొమ్ముక్యాన్సర్ పెరగడానికి కారణం ఆరుబయట గడపడం తగ్గిపోయి, ఏసీ గదుల్లో ఉండటమేనట. అందువల్లే డి-విటమిన్ శాతం తగ్గిపోతూ వస్తోంది. ఇందుకోసం వీళ్లు 40 వేల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, వాళ్లు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో సేకరించారట. అందులో ఇరవయ్యేళ్లకు పైబడి నీడపట్టునే ఉంటూ ఉద్యోగాలు చేసి రిటైరయిన వాళ్లే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్లు గుర్తించారు.
అదే ఎండలో తిరుగుతూ చేసిన వాళ్లకి క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి డి-విటమిన్ లోపం క్యాన్సర్లకూ దారితీయవచ్చు అని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ అలవాట్లే పొట్ట చుట్టూ కొవ్వును కరిగిస్తాయట!