కాఫీ వడకట్టగా మిగిలిన పిప్పిని పెరటి మొక్కలకు ఎరువుగా, కీటకనాశనిగా ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో టెర్రస్, బాల్కనీలతో పాటు ఇంట్లోనూ మొక్కలను పెంచుతున్నారు. ఇలాంటి మొక్కలకు రసాయనిక ఎరువులు ఉపయోగిస్తే వాటి ప్రభావం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటికి సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించడం మంచిది. దీనికోసం ఒకసారి వాడిన కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి..
ఎరువును తయారుచేయండిలా..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కూరగాయల్లో రసాయన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయనే ఉద్దేశంతో కిచెన్గార్డెన్ ఏర్పాటు చేసుకొనేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి వారు వాడేసిన కాఫీ పొడితో తయారుచేసిన ఎరువును మొక్కలకు ఉపయోగించవచ్చు. కోడిగుడ్డు పెంకులను మెత్తగా చేసి ఒకసారి ఉపయోగించిన కాఫీ పొడిలో కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. అంతే.. కిచెన్ గార్డెన్కి కావాల్సిన ఎరువు తయారైపోతుంది. ఈ మిశ్రమం ద్వారా మొక్కలకు నత్రజని, భాస్వరం, క్యాల్షియం, పొటాషియం.. వంటివి పుష్కలంగా లభిస్తాయి. అయితే కిచెన్ గార్డెన్లో ఉన్న మొక్కల పరిమాణాన్ని బట్టి ఎరువును తయారుచేసుకోవాల్సి ఉంటుంది. దీనికీ ఓ సులభమైన చిట్కా పాటించవచ్చు. వాడేసిన కాఫీ పొడిని ఓ నాలుగు రోజుల పాటు సేకరించి దాంతో ఎరువు తయారుచేసి కొన్ని మొక్కలకు వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మొక్కల కోసం ఇదే పద్ధతిని పాటిస్తే అన్ని మొక్కలకు సహజమైన ఎరువు అందించవచ్చు.
పురుగులు రాకుండా..
కిచెన్గార్డెన్లో పెంచే ఆకుకూరలకు పురుగుల వల్లే ఎక్కువ బెడద ఉంటుంది. ఇవి మొక్కల ఆకులను తినేస్తుంటాయి. పురుగులు తినేయడం వల్ల జల్లెడలా మారిన ఆకులను ఆహారంగా తీసుకోవడానికి అంత ఆసక్తి చూపించరు. అలాగని ఆ మొక్కలను తొలగించనూలేం. అయితే కాఫీ పిప్పిని ఉపయోగించడం ద్వారా మొక్కలపై కీటకాలు చేరకుండా కాపాడుకోవచ్చు. దీనికోసం చెంచా కాఫీ పిప్పిని లీటరు నీటిలో కలిపి కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని మొక్కల ఆకులపై జల్లితే సరిపోతుంది. కాఫీ పొడి వెదజల్లే వాసనకు కీటకాలు మొక్కల దరిదాపుల్లోకి కూడా రావు.
అలాగే మొక్కలు బాగా పెరగడానికి కుండీల్లో నీరు పోస్తుంటాం. దీనివల్ల కుండీల్లోని మట్టి చల్లగా మారుతుంది. ఫలితంగా మొక్కల మొదళ్లలో చీమలు, ఇతర కీటకాలు చేరే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండటానికి ఎండబెట్టిన కాఫీ పిప్పిని మొక్క మొదళ్ల చుట్టూ వేస్తే సరిపోతుంది.
నీరు నిలిచి ఉండేలా..
మొక్కల సంరక్షణ విషయంలో నీరుకే అధిక ప్రాధాన్యం. అలాగని కుండీల్లో పెంచే మొక్కలకు రోజూ నీరు పోస్తే వాటి వేర్లు కుళ్లిపోయి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ నీరు పోస్తే.. మొక్కలు వాడిపోయి జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. అందుకే తక్కువ నీరు పోసినప్పటికీ కుండీలోని మట్టిలో తేమ నిలిచి ఉండే ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ పనిని వాడేసిన కాఫీ పొడి సమర్థంగా నిర్వహిస్తుంది. దీనికోసం కుండీలో మొక్కను నాటేటప్పుడు నింపే మట్టిలో కాఫీ పిప్పిని కలిపితే సరిపోతుంది. ఇది నీటిని పీల్చుకొని ఆవిరవకుండా కాపాడుతుంది. అలాగే క్రమేపీ మట్టిలో కలిసిపోయి ఎరువుగానూ మారుతుంది.
పూలు విరబూయడానికి..
వివిధ రంగుల్లో విరబూసిన పువ్వులను చూస్తే మనసంతా ఆహ్లాదంగా మారిపోతుంది. అందులోనూ గులాబీలైతే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది కదండీ.. అయితే గులాబీ మొక్కలు ఏపుగా పెరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో పూలు చాలా తక్కువగా పూస్తాయి. అయితే కాఫీ పిప్పిని తరచూ గులాబీ మొక్కలకు ఎరువుగా వేయడం ద్వారా పూలు ఎక్కువగా పూయడంతో పాటు.. చాలారోజుల పాటు వాడిపోకుండా కూడా ఉంటాయి. గులాబీ మొక్కలకు మాత్రమే కాకుండా.. మల్లె, సన్నజాజి, బంతి.. వంటి ఇతర పూల మొక్కలకు సైతం కాఫీ పిప్పిని ఎరువుగా ఉపయోగించవచ్చు.
ఇదీ చదవండి:కరోనా ట్రెండ్: ఇక మైక్రో వెడ్డింగ్లదే హవా!