ఇప్పటికీ చాలామంది ఆడపిల్లలకు నచ్చిన రంగంలోకి అడుగుపెట్టే అవకాశం దొరకడం లేదు. కానీ నాకు మాత్రం ఆ ప్రోత్సాహం లభించింది అంటారు డాక్టర్ స్నేహలత. ‘మా సొంతూరు రాజస్థాన్లోని జైపుర్. మా రాష్ట్రంలో ఆడపిల్లలకి ఎప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని ఆలోచించేవారే ఎక్కువ. కానీ అమ్మ మాత్రం అలా చేయలేదు. చిత్రకళలో నా ఆసక్తిని గమనించి ప్రోత్సహించింది’ అంటారామె. జైపుర్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్లో పీహెచ్డీ, గ్రాఫిక్ పెయింటింగ్స్లో నైపుణ్యం సాధించారు స్నేహ. డాక్టర్ ప్రసాద్తో పెళ్లి, హైదరాబాదులో స్థిరపడ్డం, పిల్లలు... బాధ్యతలతో దాదాపు పదేళ్లు గడిచిపోయాయి. కానీ చిత్రకళపై ఉన్న ఆసక్తి మనసుని నిలవనిచ్చేది కాదు. తిరిగి తన నైపుణ్యాన్ని పరీక్షించుకోవాలనుకున్నారామె. అది అంత సులభమా? భర్త, పిల్లల అవసరాలు చూడాలి. దీని కోసమే వారం, నెలకంటూ పనుల పట్టికను, ప్రణాళికను చేసుకున్నారు స్నేహ.అత్తమామలూ, భర్త ప్రోత్సాహంతో...తన కుంచెతో అపురూప చిత్రాలెన్నో కాన్వాస్పై ఆవిష్కరించారు. వీటిని దేశవ్యాప్తంగా ప్రముఖ గ్యాలరీలలో ప్రదర్శించారు. తను గీసిన అతి పెద్ద చిత్రానికి లిమ్కా రికార్డు వచ్చింది.
సొంతంగా నేర్చుకుని...
ఓ సారి స్నేహ కశ్మీరు వెళ్లారు. అక్కడ జరిగిన ఆర్ట్ వర్క్షాప్ ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. కొందరు కళాకారులు పెద్ద పెద్ద రాళ్లను అందమైన బొమ్మలుగా చెక్కుతున్న తీరు స్నేహను ఆకట్టుకుంది. అది మొదలు శిల్ప కళ గురించి అధ్యయనం మొదలుపెట్టారామె. పుస్తకాలు చదివారు. యూట్యూబ్లో శోధించారు. తర్వాత శిల్పాలు చెక్కడం మొదలుపెట్టారు. ‘ఏడాది పాటు అధ్యయనం చేశాక... తొలిసారి ఉలిని చేతబట్టుకుని మూడడుగుల ఎత్తున్న తెలంగాణ మహిళ ముఖాన్ని శిల్పంగా తీర్చిదిద్దా. దీనికి ఏడు రోజులు పట్టింది. ఆ శిల్పానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి’ అంటూ కొత్త కెరీర్లో తొలి అడుగులను గుర్తు చేసుకుంటారు స్నేహ.
ప్రభుత్వ ప్రాజెక్టులెన్నో...
తొలి విజయం స్నేహలో ఉత్సాహాన్ని నింపింది. శిల్పాలతో పాటు క్లే మౌల్డింగ్ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్, రాజస్థాన్లలో ప్రత్యేకంగా స్టూడియోలనే ఏర్పాటు చేశారు. క్రమంగా ఆమె ప్రతిభకు గుర్తింపు లభించింది. ఏడాది తర్వాత అనూహ్యంగా రాజస్థాన్ ప్రభుత్వ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఓ ప్రభుత్వ ప్రాజెక్ట్కి శిల్పాన్ని తయారు చేయాలనేది దాని సారాంశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు స్నేహ. ప్రస్తుతం రాజస్థాన్, జోధ్పుర్లలో ఆమె రూపుదిద్దిన కళాఖండాలెన్నో కనిపిస్తాయి. నాలుగు రాష్ట్రాల్లోని హైవేలు, పర్యాటక ప్రాంతాల్లో ఆమె శిల్పాలు స్థానాన్ని సంపాదించుకున్నాయి. పదుల సంఖ్యలో లైవ్ షోస్నూ ఇచ్చారామె. హైదరాబాద్లో కొన్ని ప్రైవేటు ప్రాజెక్టులనూ చేశారు. అన్నింటిల్లోనూ తాను చెక్కిన నలభై అడుగుల శిల్పం ఎంతో సంతృప్తినిచ్చింది అంటారు స్నేహ.
కష్టమైనా... ఇష్టంగా...
బొమ్మలు వేయాలంటే క్రియేటివిటీ ఉండాలి. అదే శిల్పం చెక్కాలంటే అదొక్కటే సరిపోదు. ఏకాగ్రత, ఓపికతోపాటు శారీరకంగానూ సామర్థ్యం అవసరమే అంటారు స్నేహ. ‘రాయిని శిల్పంగా మార్చాలంటే శారీరకంగానూ కష్టపడాలి. పెద్దపెద్ద రాళ్లను డ్రిల్ చేయడం ఓ పెద్ద సవాలు. దాన్ని మనం అనుకున్న రూపంలోకి తెచ్చేప్పుడు వాటిని డ్రిల్ చేస్తుంటే వచ్చే శబ్దం, దుమ్ము, ధూళి కాలుష్యం వంటివి ఇబ్బందిపెడతాయి. ఆ రాయినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక్కోసారి ఒకేచోట గంటల తరబడి నిలబడి పనిచేయాలి. తక్కువ సమయంలో ప్రాజెక్టుని పూర్తిచేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఏకబిగిన పనిచేయాలి. బహుశా ఈ కారణాలతోనే మహిళలెక్కువగా ఈ కళను కెరీర్గా ఎంచుకోవడం లేదేమో’ అంటారు స్నేహ. ‘స్నేహ ఆర్ట్స్’ పేరుతో గ్యాలరీను ఏర్పాటు చేసి ఈ రంగంలోని ప్రముఖులపై డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి శిక్షణా ఇస్తున్నారు. స్నేహ బృందంలో 70 మంది పనిచేస్తున్నారు. ‘రాయి శిల్పంగా మారడం ఓ అద్భుతం. అయితే... అది అంత సులువు కాదన్నది నిజం. అలాగని కష్టం అనుకుంటే ఏదీ సాధ్యం కాదు. మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తే ఏదీ అసాధ్యమూ కాదు’ అంటారు స్నేహ.
ఇదీ చదవండి: దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం