గుట్కా వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని.. గుట్కా ప్రియులు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల బారిన పడుతున్నారనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రభుత్వం గుట్కాను నిషేధించింది. గుట్కా తయారుచేయడం, రవాణా, విక్రయం నిషేధం. కానీ దానికున్న డిమాండ్ను బట్టి నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. పోలీసులు అడపాదడపా చేస్తున్న దాడుల్లో ఇవి వెలుగులోకి వస్తున్నాయి.
అనుమానం రాకుండా..
గుట్కా ముడి సరుకును మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకొని యంత్రాల ద్వారా గుట్కాలు తయారు చేస్తున్నారు. వాటిని ప్యాకెట్లలో నింపి పాన్ డబ్బాలు, కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా జనసంచారం లేని ప్రాంతాల్లో నిర్వాహకులు గుట్కా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అందులో పనిచేసే వాళ్లను కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లను నియమించుకుంటున్నారు. స్థానికులైతే ఇతరులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉందనే ముందు జాగ్రత్తతో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.
తరచూ మారుస్తూ
గుట్కా విక్రయదారులు పోలీసులకు దొరకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోదాంలను తరచూ మారుస్తుంటారు. కర్ణాటక, బీదర్ నుంచి తీసుకొచ్చే సరకును ఒకే చోట కాకుండా రెండు మూడు చోట్ల నిల్వ ఉంచుతున్నారు. ఒకవేళ పోలీసులు దాడులు చేసినా... సరకు మొత్తం దొరకవద్దనే.. ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. పాన్ మసాలాల పేరుతో గుట్కా విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయి.
బహదూర్పురా పీఎస్ పరిధిలో 2020 మార్చి 3న రూ. 2 లక్షలు విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గోవా గుట్కా యజమాని సచిన్ జోషిని పోలీసులు నిందితుడిగా చేర్చారు. అతను విదేశాల్లో ఉన్నందున లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు బహదూర్పురా పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లి సచిన్ జోషిని ఠాణాకు తీసుకొచ్చారు. పోలీసులు సచిన్ జోషికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వగా.. వారం రోజుల్లో తన న్యాయవాది ద్వారా వివరణ ఇస్తానని సచిన్ జోషి తిరిగి ముంబయి వెళ్లారు.
సచిన్ జోషితో పాటు వీరిపైనా కేసులు..
సచిన్ జోషి, జేఎం జోషిపై ఆర్జీఐఏ పీఎస్లోనూ మరో కేసు నమోదైంది. మానిక్ చంద్ పాన్ మసాలా సంస్థ యజమాని సురేశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ ప్రొడక్ట్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న పాన్ మసాలాలకు మానిక్ చంద్ పేరు పెడుతున్నారని.. ఎలాంటి అనుమతి లేకుండా, ట్రేడ్ మార్క్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గగన్ పహాడ్లోని గోల్డెన్ ఫింగర్స్ ఫుడ్ కంపెనీలో సోదాలు నిర్వహించి రూ. 1.25 కోట్ల విలువైన పాన్ మాసాలాలు, ముడిసరుకు, యంత్రాలను సీజ్ చేశారు.
ఇదీ చదవండిః