పెట్రోల్ బంకుల్లో మోసపూరిత చిప్లు అమర్చి యధేచ్ఛగా మోసాలకు పాల్పడిన ముఠా సూత్రధారి శిబు థామస్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులకు కొత్తేమీ కాదు. సంవత్సరాలుగా ఇతను పెట్రోల్ బంకులకు చిప్లను సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ముంబయి నుంచి చిప్లు విక్రయించింది ఇతనే అని పోలీసులు దర్యాప్తులో బయటపడినా... నిందితుడిని ఇంకా పట్టుకోలేకపోయారు. ఇదే తరహాలో మోసాలకు పాల్పడిన శిబు థామస్ 2014 లో ఎస్వోటీ బృందానికి దొరికిపోయాడు. ఆ తర్వాత ఈ వ్యవహారం మరుగున పడడం వల్ల... తిరిగి తన మోసాలు కొనసాగించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోల్ బంక్ల యజమానులకు చిప్లను విక్రియించడం చూస్తుంటే... ఈ మోసాల్లో మునిగి తేలుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
నకిలీ సాఫ్ట్వేర్తో..
చూసేందుకు నిర్ణీత పరిమాణంగా కనిపిస్తూనే తక్కువ మోతాదులో ఇంధనం విడుదల చేసేలా మోసపూరిత చిప్లను తయారు చేయడంలో శిబు థామస్ సిద్ధహస్తుడు. కేరళలోని అలెప్పీకి చెందిన ఈ మోసగాడు... ఎనిమిదో తరగతి వరకు చదివాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం ముంబయి వలస వెళ్లాడు. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన వివిధ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ... 2013 లో హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ సర్వీసులో మెకానిక్గా చేరాడు. అదే సమయంలో పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపే యంత్రాల గురించి క్షుణంగా తెలుసుకున్నాడు. నకాలీ సాఫ్ట్వేర్ అమర్చి అడ్డదారిలో సంపాదించే కుట్రకు తెర తీశాడు. ముంబాయి కి చెందిన వికాస్శెట్టిని సంప్రదించి ఆ సాఫ్ట్వేర్ను రూపొందించాడు.
విలాసవంతమైన జీవితం..
ఎల్అండ్టీ, మిడ్కో, గిల్బర్గో, ఆప్ల్యాబ్, డ్రెస్సర్ వెయిన్, టీఈఎం అనే ఆరు సంస్థలకు చెందిన పెట్రోల్ బంక్ల్లో యంత్రాలు అమర్చేలా చిప్లను తయారు చేశాడు. ఆ తర్వాత మహారాష్ట్రలోని వందలాది బంకుల్లో చిప్లను అమర్చాడు. అప్పట్లోనే ఒక్కో చిప్కు స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశాడు. ఈ క్రమంలోనే విజయవాడలోని టోకియెమ్ కల్యాణ్ పరిచయం కాగా... అతడి సహకారంతో తెలుగు రాష్ట్రల్లోకి తన దందా విస్తరించాడు. అప్పటికే అక్రమార్జనతో నవీముంబయిలో రెండు ఫ్లాట్లు, ఓ కారు కొనుగోలు చేసి సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసుల విఫలమే..!
కర్నాటక, తమిళనాడులో వందల బంకుల్లో శిబు థామస్... చిప్లు అమర్చినట్టు గుర్తించారు. జాతీయ రహదారి వెంట ఉండే నగరాలనే ఎంచుకొని ఈ మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. చిప్లను రూపొందించడంలో కీలకమైన వికాస్ శెట్టి ఆచూకీని కనిపెట్టడంలో సైబరాబాద్ పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ వ్యవహారం బయటపడినప్పుడే తూనికలు, కొలతల శాఖ అధికారులు కూడా ఈ కేసుపై అంతగా దృష్టి పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. 70 బంకుల్లో చిప్లు అమర్చారని గుర్తించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంపై పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు సాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇవీ చూడండి: ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలి: మంత్రి ఈటల