తాళం వేసిన ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో చోటుచేసుకుంది. 10లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
బయటపడ్డ వృద్ధుడు..
గ్రామంలోని చొప్పరి.సాయిలుకు వెంకన్న, సురేష్ అనే ఇద్దరు కొడుకులున్నారు. వీళ్లు, తండ్రి వేరుగా నివసిస్తున్నారు. వృద్దుడు ఇంటి వద్ద ఉండగా కుమారులు ఈ రోజు ఉదయం.. పొలం వద్దకు వెళ్లారు. ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వృద్ధుడిని బయటకు తీసుకొచ్చారు.
భయంతో..
ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారమిచ్చి మంటలార్పే ప్రయత్నం చేశారు. మహబూబాబాద్ నుంచి ఘటనా స్థలికి అది చేరుకునే లోపు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్లు పేలుతాయన్న భయంతో ఇంట్లోకి ఎవరూ వెళ్లలేదు.
కూతురు పెళ్లి కోసం 4లక్షల 30వేలు దాచిపెట్టాను. 5తులాల బంగారం, 2లక్షల విలువ చేసే పత్తి మొత్తం బూడిదయింది. కట్టు బట్టలే మిగిలాయి. ఇంట్లోని వస్తువులు, సర్టిఫికెట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కాలిపోయాయి.
- బాధితుడు
షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంట్లో పత్తిని నిల్వచేయడంతో ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ ఊర్లో అంతుచిక్కని వ్యాధి... 20 రోజుల్లో ఆరుగురు మృతి