ఎంతో సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుక కన్నీటి పర్యంతమైంది. తీపి గుర్తుగా మిగలాల్సిన ఆ క్షణాలు.. అంతులేని కష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఏపీలోని విశాఖలో ఓ వివాహ వేదిక సాయి ప్రియ రిసార్ట్లో వారికి కేటాయించిన గదిలో నగలను హ్యండ్ బ్యాగ్లో పెట్టి మంచం దగ్గరే పెట్టుకున్నారు. అందరూ పెళ్లి పనుల్లో అలసి నిదానంగా నిద్రలోకి జారుకున్న సమయంలో.. గుట్టుచప్పుడు కాకుండా కొందరు దుండగులు ఉన్నదంతా ఊడ్చేశారు. అక్షరాలా 70తులాలకు పైగా బంగారం మాయం కావడం.. అదంతా పెళ్లి కూతురు బంగారమే. లక్షల రూపాయలు విలువ చేసే బంగారం దొంగతనానికి గురికావడంపై బాధిత బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందరూ నిద్రలోకి జారుకోగానే:
విశాఖ సాగర తీరంలో జరిగిన దొంగతనం.. ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. రుషికొండ సాయి ప్రియ రిసార్ట్లులోవివాహం జరుపుకునేందుకు ఎంతో సంతోషంగా వచ్చిన వధువు బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. నిన్నరాత్రి అనకాపల్లి సమీపంలోని తోటాడ సిరసపల్లి గ్రామానికి చెందిన వధువు అలేఖ్య ఆమె బంధువులు సాయి ప్రియ రిసార్టుకు చేరుకున్నారు. పీఎంపాలెంకు చెందిన సతీష్ తో ఈ ఉదయం ఆమెకు వివాహ నిశ్చయమైంది.రిసార్టుకు చేరుకున్న పెళ్లికూతురు బంధువులకు కొన్నిగదులు కేటాయించారు. అర్థరాత్రి 2 గంటల సమయం వరకు పెళ్లి హడావుడితో బంధువులు అంతా మెలకువగానే ఉన్నారు. కాస్త సయమం ఆదమరిచి అలా నిదురించిన వారికి ఊహించని కష్టం వచ్చి పడింది.
మెలకువ వచ్చి చూస్తే బ్యాగ్లు ఖాళీ :
బాధిత కుటుంబ సభ్యురాలు ఒకరకి మెలకువ రావడంతో నిద్రనుంచి లేచి చూసే సరికి బంగారు ఆభరణాలు పెట్టిన బ్యాగ్లు కనిపించలేదు. వెంటనే అందరినీ లేపి వెతకటం ప్రారంభించారు.గతి బయట ఉన్న పొదల్లో రెండు ఖాళీ బ్యాగ్లు పడి ఉండడాన్ని గమనించి వారి గుండె జారిపోయింది. ఆ సంచుల్లో ఉండాల్సిన సుమారు 70 నుంచి 80 తులాల మేర బంగారు ఆభరణాలు దొంగతానానికి గురయ్యాయని గుర్తించారు.
క్లూస్ టీంతో పోలీసులు:
జరిగిన దారుణంపై వెంటనే రిసార్టు యాజమాన్యానికి, పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. తెల్లవారు జామున 5 గంటలకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్తో క్షుణ్ణంగా పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు నగర వ్యాప్తంగా అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారిని త్వరిత గతిన పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ఇదీ చూడండి: క్రైస్తవులకు గవర్నర్, సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు