ఇజ్రాయెల్లో ఇక మాస్కులు ధరించకుండానే బహిరంగ ప్రదేశాల్లో మునుపటిలా స్వేచ్ఛగా తిరిగేయొచ్చు! మార్కెట్లు, మాల్స్, ప్రార్థనా స్థలాలు, దుకాణాలకు అవి లేకుండానే వెళ్లొచ్చు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న గత ఆదేశాలను ప్రభుత్వం ఆదివారమే రద్దు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. ఇదేం నిర్ణయం అనుకుంటున్నారా! దేశంలోని సగం మందికిపైగా వ్యాక్సినేషన్ పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పాఠశాలలనూ పునఃప్రారంభించింది. ఇజ్రాయెల్ ఎంతో ముందుచూపుతో ప్రజలకు టీకాలు అందించి.. మహమ్మారిని ఎదుర్కోవడంలో పైచేయి సాధించిందని న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించింది. దేశంలో ఒక్కడోసు టీకా తీసుకున్నవారు 60 శాతం మంది కాగా, రెండు డోసులు వేయించుకున్నవారు 56 శాతం మంది. ఇక్కడ ఫైజర్, బయోఎన్టెక్ టీకాలను అందిస్తున్నారు. 16 ఏళ్లలోపు వారిని మినహాయించారు. "మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచానికి మేం మార్గదర్శకులమయ్యాం" అని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భారత్ విమానాలపై మరో రెండు దేశాల ఆంక్షలు