టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్కు సిరియా ఉగ్రసంస్థలతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఆధారాలను బహిర్గతం చేసింది స్వీడన్కు చెందిన నొర్డిక్ మానిటర్ వార్తా సంస్ధ. ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులను ఓడించి తన లక్ష్యాలు, ఎజెండాలను సాధించేందుకు ఐసిస్ సంస్థతో టర్కీ అధ్యక్షుడు సంబంధాలు ఏర్పరచుకున్నారని నోర్డిక్ నివేదిక పేర్కొంది.
"తన రాజకీయ ప్రత్యర్థి ఫెతుల్లా గులెన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఐసిస్ సంస్థకు చెందిన అబ్దుల్ ఖాదిర్ మషారిపోవ్ను ఎర్డోగాన్ ప్రభుత్వం నియమించింది. 2017లో టర్కీలో మారణహోమం సృష్టించి 39 మందిని హతమార్చింది ఆ ఉగ్రవాదే." అని వెబ్సైట్లోని నివేదికను ఆధారంగా చూపింది సనా న్యూస్.
ఎర్డోగాన్కు సిరియా ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్లు మరికొన్ని సంస్థలు కూడా ఆధారాలు చూపాయి. పలు వాణిజ్య ఒప్పందాలు సహా సిరియా ఇరాక్ నుంచి దొంగిలించిన చమురు కొనుగోళ్లలో ఐసిస్ జోక్యం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. ఎర్డోగాన్ చర్యల వల్ల ఉగ్రవాదులకు టర్కీ కీలక స్థావరంగా మారిందని నివేదికలు పేర్కొన్నాయి. నేరాలకు పాల్పడే వీరికి నిధులు, సహకారం, శిక్షణ ఇక్కడే అందుతున్నాయని తెలిపాయి.