అట్టహాసంగా కలసి అర్ధంతరంగా విడాకులు తీసుకున్న ఐరోపా సమాఖ్య (ఈయూ), బ్రిటన్ల కటీఫ్ (బ్రెగ్జిట్) మరికొద్ది గంటల్లో అధికారికం కాబోతోంది. ఐరోపాలోని దేశాలన్నింటినీ ఒకింత ఆశ్చర్యానికి, నిరాశకు గురిచేసి.. బ్రిటన్లోనూ భిన్నాభిప్రాయాలకు వేదికైన బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ) డిసెంబర్ 31 రాత్రి 11 గంటల తర్వాత నుంచి అమల్లోకి రాబోతోంది. సంబంధిత బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. దీనితో బ్రిటన్, ఐరోపా సమాఖ్య తెగదెంపులు లాంఛనంగా పూర్తయినట్టే! అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి ఈయూ ఏకీకృత మార్కెట్ నుంచి బ్రిటన్ నిష్క్రమిస్తుందన్నమాట!
ఇక నుంచి ఈయూతో బ్రిటన్కు ఇతర దేశాలతో ఉన్నట్లే ద్వైపాక్షిక సంబంధం! యూరోపియన్ యూనియన్లోని ఇతర దేశాల మాదిరిగా వెసులుబాట్లు ఉండవు.
ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు కారణాలు..
- ఈయూలో ఉండటం వల్ల తమకు ఎలాంటి లాభం లేకపోగా, తమపై ఆర్థిక భారం పడుతోందనే భావన బ్రిటన్లో పెరిగింది. ఫలితంగా ఈయూ నుంచి నిష్క్రమించాలనే డిమాండ్ మొదలైంది.
- 2013 ఎన్నికల్లో నెగ్గితే ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించాలా వద్దా అనే అంశంపై రెఫరెండం పెడతామంటూ హామీ ఇచ్చిన డేవిడ్ కామెరూన్.. 2016లో ప్రధాని కాగానే ఆ పని చేశారు.
- నిజానికి కామెరూన్ బ్రెగ్జిట్ను వ్యతిరేకించారు. కానీ 2016లో రెఫరెండంలో 52 శాతం మంది నిష్క్రమణకే ఓటేశారు.
- తన అభీష్టానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో కామెరూన్ రాజీనామా చేశారు. థెరెసా మే ప్రధాని పదవి చేపట్టి బ్రెగ్జిట్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. 2019, మార్చి 29 నాటికే ఇది పూర్తవ్వాల్సి ఉండగా.. నిష్క్రమణ సూత్రాలకు బ్రిటన్ పార్లమెంట్ నుంచి ఆమోదం లభించలేదు. దీనితో థరెసా మే కూడా రాజీనామా చేశారు.
- ఆ తర్వాత బోరిస్ జాన్సన్ కొత్త ప్రధానిగా రావడం ఆ అడ్డంకులన్నీ తొలగించుకుని.. ఈయూతో కొత్త ఒప్పందం చేసుకుని నిష్క్రమణను ముందుకు సాగిస్తుండటం తాజా పరిణామం.
- ఈ తెగదెంపులకు కొద్ది రోజుల కిందటే ఈయూ, బ్రిటన్ సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని ఈయూ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. అప్పటిదాకా ఇది ప్రాథమికంగా అమల్లోకి వచ్చినట్లే.
బ్రెగ్జిట్ పూర్తి స్థాయిలో అమలైతే మార్పులివే..
- ఈయూలో సభ్యదేశంగా ఉన్నన్ని రోజులు బ్రిటన్ వివిధ దేశాలతో విడిగా వాజిజ్య ప్పందాలు చేసుకో లేకపోయేది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలాంటి దేశాలతో. ఇప్పుడు అది చేయగలుగుతుంది. తమ నుంచి విడిపోతున్నప్పటికీ.. బ్రిటన్ పై ఈయూ ఉదారత చూపించింది నిష్క్రమణ తర్వాత కూడా బ్రిటన్ నుంచి జరిగే వాణిజ్యానికి టారిఫ్లు విధించ కూడదని నిర్ణయించటం విశేషం. అంటే బ్రిటన్, వివిధ యూరోపియన్ దేశాల మధ్య జరిగే వాణిజ్య వ్యవహారాలపై ఎలాంటి రుసుములు ఉండవు. గతంలో మాదిరిగానే స్వేచ్ఛావాణిజ్యం కొనసాగుతుంది సరిహద్దులో ఎలాంటి సుంకాలు విధించరు.
- తమ భాగస్వామి కాని దేశాలకు ఈయూ ఇలాంటి మీనహాయింపునివ్వటం ఇదే తొలిసారి. ఈ వెసులుబాటు ఉన్నా.. వాణిజ్యపరంగా బ్రిటన్ పై కొన్ని ఆంక్షలుంటాయని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.
- బ్రెగ్జిట్ తర్వాత కూడా ఈయూ, బ్రిటన్ల మధ్య వీసా లేకుండా ప్రయాణాలు కొనసాగుతాయి. కానీ గతంలో వినియోగించిన బయోమెట్రిక్ పాస్పోర్ట్లను బ్రిటన్ ప్రయాణికులు వినియోగించుకోలేరు. వారిని ప్రత్యేకంగా తనిఖీ చేస్తారు. విమానాశ్రయాలో సుంకం లేని అమ్మకాలిక కుదరవు.
- మత్స్యజలాల (చేపలవేటకు) విషయంలో ఈయూ, బ్రిటన్ మధ్య గతంలోని ఒప్పందం ఐదేళ్లపాటు అమలులో ఉంటుంది. బ్రిగ్జిట్ తర్వాత కూడా బ్రిటన్ మత్స్యజలాల్లోకి ఈయూ పడవలు రావటానికి ఆస్కారం ఉంటుంది.
- బ్రిటన్, ఈయూ మధ్య ఫోన్ కాల్స్ ఇక రోమింగ్గా మారిపోతాయి. మొబైల్ ఆపరేటర్లు కావాలంటే అంతర్జాతీయ రోమింగ్ ఛార్టీలు వసూలు చేసుకోవచ్చు.
- ఈయూ, బ్రిటన్ల మధ్య కుదిరిన ఒప్పందం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు లోబడి జరిగింది కాబట్టి.. ఈయూ కోర్టు పరిధిలోకి బ్రిటన్ ఇక మీదట రాదు. ఈయూ చట్టాలను బ్రిటన్ ఇక మీదట పాటించాల్సిన అవసరం ఉండదు.
ఇవీ చూడండి: