కరోనా దెబ్బకు స్పెయిన్ అతలాకుతలమవుతోంది. గురువారం 551 మంది బాధితుల మృతితో మరణాల సంఖ్య 19 వేలు దాటింది. అయితే అధికారిక లెక్కలకు వాస్తవ గణాంకాలకు పొంతన లేదని మాడ్రిడ్, కాటలోనియా రాష్ట్ర అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో బాధితులు అధికారిక లెక్కలతో పోలిస్తే వేల సంఖ్యలో అధికంగా బాధితులు ఉంటున్నట్లు చెబుతున్నారు.
"వాస్తవ మరణాల సంఖ్య తెలుసుకోవడం చాలా కష్టం. కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తుల మరణాల ఆధారంగా స్థానిక అధికారులు అందించే సమాచారంతో రోజూవారి గణాంకాలు రూపొందిస్తాం."
-ఫెర్నాండో సిమన్స్, వైద్య శాఖ సమన్వయకర్త
స్పెయిన్లోని మొత్తం మరణాల్లో 56 శాతం మాడ్రిడ్, కాటలోనియాలోనే సంభవించాయి. అధికారిక లెక్కల ప్రకారం మాడ్రిడ్లో 6,877 మంది మరణించగా.. వాస్తవ సంఖ్య 10 దాటి ఉండొచ్చన్నది అధికారుల అనుమానం. ప్రభుత్వ వివరాల ప్రకారం కాటలోనియాలో 3,855 మంది మరణించారు. కానీ ఈ సంఖ్య 7 వేలకు పైగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఆస్పత్రుల వెలుపల మరణించినవారి సంఖ్యను పరిగణనలోకి తీసుకోలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్యను లెక్కించే విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ఇక నుంచి అన్నీ
లెక్కలపై అనుమానాల నేపథ్యంలో కాటలోన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆస్పత్రుల వెలుపల సంభవించే మరణాలను నమోదు చేయనున్నట్లు ప్రకటించింది.
"ఇప్పటివరకు కాటలోన్ ఆస్పత్రుల్లో మరణించిన వారి వివరాలు మాత్రమే అందాయి. కానీ ఇకపై అంత్యక్రియలు నిర్వహించే సంస్థల నుంచి సమాచారం తీసుకుంటాం. వృద్ధాశ్రమాలు, ఇళ్లలో ఈ రోజు వరకు మరణించిన వారి వివరాలను సేకరిస్తాం."-కాటలోన్ ప్రభుత్వం
వైరస్ మరణాలతో పాటు కరోనా పరీక్షలను చేయించుకోకున్నా.. వైరస్ లక్షణాలతో మరణించిన వ్యక్తుల వివరాలను స్మశానాల వద్ద నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే చైనాలో...
కరోనా మృతుల సంఖ్య లెక్కింపులో పొరపాటు జరిగిందని ఈ ఉదయమే ప్రకటించింది చైనా. వుహాన్ నగరం మృతుల సంఖ్యను ఒక్కసారే 50 శాతం పెంచింది. అంటే కొత్తగా 1,290 మరణాలను లెక్కల్లో చేర్చింది.
ఇంతకుముందు వుహాన్లో మృతుల సంఖ్య 2,579గా ఉంది. ప్రస్తుతం కొత్త గణాంకాలను కలుపుకుంటే వుహాన్లో మొత్తం మృతుల సంఖ్య 3,869కి పెరిగింది.