కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన మూడొంతుల మంది ఆరు నెలల తరువాత కూడా ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నారని ఫ్రాన్స్కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రముఖ జర్నల్ లాన్సెట్లో పరిశోధకులు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. చైనాలోని వుహాన్లో వందల మంది కొవిడ్-19 బారిన పడిన వారిని పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వారు తెలిపారు. దీంతో కరోనా వైరస్ ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్నవారిలో కండరాలు బలహీనపడటం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలను గమనించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కరోనా బారిన పడిన వారి ఆరోగ్యంపై వైరస్ ఎలా దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందో అర్థం చేసుకుంటున్నామని నేషనల్ సెంటర్ ఫర్ రెస్పిరేటరీ మెడిసిన్ ప్రధాన శాస్త్రవేత్త బిన్ కావో చెప్పారు. కరోనా నుంచి డిశ్ఛార్జి అయిన 1655 మంది బాధితులను పరిశీలించగా 1265 మందికి ఏదో ఒక లక్షణం ఉందని పరిశోధకులు తెలిపారు. ఇందులో 63 శాతం మంది కండరాల బలహీనతతో, 26 శాతం నిద్రలేమితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ బారిన పడిన వ్యక్తుల్లోని యాంటీబాడీల స్థాయిలను పరిశీలించగా.. రోగనిరోధక స్థాయి 52.5 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు.
ఇదీ చూడండి: ఇండోనేసియాలో అదృశ్యమైన విమానం కూలినట్టేనా??