టెక్నాలజీ ప్రపంచానికి గుండెకాయ ఎక్కడుందంటే సెమీకండక్టర్ చిప్లో ఉందని చెబుతారు. అది కొంత నిజం కావచ్చు. కానీ, ఆ చిప్లు తయారు కావడానికి అవసరమైన యంత్రాన్ని తయారు చేసే ఓ కంపెనీ టీఎస్ఎంసీ, ఇంటెల్, శామ్సంగ్ వంటి సంస్థలను శాసించగలదు. అత్యంత పలుచటి సిలికాన్ పొరలపై అల్ట్రావైలెట్ కిరణాల సాయంతో నానోమీటర్లంత సర్క్యూట్లను ముద్రించాలి. దీనికి అవసరమైన యంత్రం చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆ యంత్రాల సరఫరా ఆగిపోతే సెమీకండక్టర్ పరిశ్రమ కుప్పకూలిపోతుంది. ప్రపంచంలో అటువంటి యంత్రాలను విక్రయించే కంపెనీల్లో మూడు కంపెనీలు మార్కెట్ వాటా 90శాతానికి పైగా ఉంది. అవే ఏఎస్ఎంఎల్, కెనాన్, నికాన్. వీటిల్లో కూడా డచ్కు చెందిన ఏఎస్ఎంల్ కంపెనీ ప్రపంచ మార్కెట్లో 62శాతం వాటాను దక్కించుకొంది.
![silicon valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11280712_tc2_1.jpg)
ఆర్థిక కష్టాలను తట్టుకొని..
అప్పుడప్పుడే కంప్యూటర్ వినియోగం మొదలైన సమయంలో ఏఎస్ఎంఎల్ను ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం ఫిలిప్స్, ఏఎస్ఎం ఇంటర్నేషనల్ అనే సెమీకండక్టర్స్ తయారీ సంస్థ భాగస్వాములు. తొలుత ఈ కంపెనీ కోసం ఫిలిప్స్ ఫ్యాక్టరీ ఆవరణలోనే కొంత స్థలం కేటాయించారు. ఈ కంపెనీ తొలుత తయారు చేసిన పరికరాలను కొనుగోలు చేసే వినియోగదారులు లేరు. దీంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఫిలిప్స్ కంపెనీ ఆర్థికంగా అండగా ఉండటం.. డచ్ ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడంతో మెల్లగా నిలదొక్కుకొంది. 1995లో ఈ కంపెనీ న్యూయార్క్, ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్టైంది. అప్పట్లో చిప్ పరిమాణం చాలా పెద్దదిగా ఉండేది. భవిష్యత్తులో వీటి పరిమాణం గణనీయంగా తగ్గిపోతుందని ఈ సంస్థ అంచనావేసింది. దీంతో చిప్లపై కంటికి కనిపించనంత చిన్న సర్క్యూట్లను ముద్రించేలా 'ఎక్స్ట్రీం అల్ట్రావైలెట్ లిథోగ్రఫీ' (ఈయూవీ) దృష్టిపెట్టింది. 2007 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంది. ఇటువంటి కాంతిపై ప్రయోగాలు చేయడం కష్టతరం కావడంతో అనుకున్న సమయం కంటే ఎక్కువ సేపు పట్టింది. 2006లో తొలి పరికరాన్ని బెల్జియంలోని ఐఎంఈసీ అనే ప్రయోగశాలకు అందజేసింది. ఆ తర్వాత ఈ టెక్నాలజీ వైపు కంపెనీలు మొగ్గు చూపలేదు. డీప్అల్ట్రా వైలెట్ లిథోగ్రఫీ(డీయూవీ) వైపు మొగ్గు చూపారు.
![silicon valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11280712_tc3_1.jpg)
కష్టం ఫలించి..
అవసరాలకు తగినట్లు అత్యంత చిన్న చిప్స్ వినియోగం ఇటీవల పెరిగిపోయింది. దీంతో డీయూవీ టెక్నాలజీతో చిన్న చిప్సెట్లపై సర్క్యూట్స్ ముద్రించడం సాధ్యంకాదు. డీయూవీ టెక్నాలజీతో 248 నానోమీటర్ల లేదా 193 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో చిప్స్ను తయారు చేస్తోంది. అదే ఈయూవీ టెక్నాలజీ 13.5 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో పనిచేస్తుంది. సరళంగా చెప్పాలంటే ఓ గోడపై పెయింట్ వేయడానికి వెడల్పైన బ్రష్ వాడతాము.. అదే పుస్తకంపై రాయడానికి పెన్ వాడతాము. అలానే చిప్ సైజ్ తగ్గిపోయేకొద్దీ సంక్లిష్టమైన అతిసూక్ష్మ సర్క్యూట్లను ముద్రించడానికి ఈయూవీ టెక్నాలజీని వాడతారు. 2018 నుంచి ఏఎస్ఎంల్ తయారు చేసిన ఈయూవీ యంత్రాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడం మొదలుపెట్టడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ యంత్రం బరువు సుమారు 180 టన్నులు ఉంటుంది. దీనిలో లక్షకుపైగా విడిభాగాలు ఉంటాయి. ఒక షిప్లో దీనిని తరలించాలంటే 40 కంటైనర్లు అవసరం.
![silicon valley](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11280712_tc1_2.jpg)
పదేళ్లలో పదింతలు..
చిప్(సెమీకండక్టర్) వినియోగం పెరిగే కొద్దీ ఈ కంపెనీ విలువ ఆకాశాన్నంటింది. 2010 నుంచి కంపెనీ మార్కెట్ విలువ 10 రెట్లు పెరిగింది. ఒక్క 2019లోనే ఇది రెట్టింపైందంటే దీని డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్1 నాటికి కంపెనీ మార్కెట్ విలువ 265 బిలియన్ డాలర్లు. ఐరోపాలో మూడో అతిపెద్ద కంపెనీ ఇదే. ఎయిర్బస్, ఫోక్స్వేగన్, సీమెన్స్, టోటల్ వంటి దిగ్గజ కంపెనీల కంటే ఎక్కువ. 2019 నాటికి ఈ కంపెనీ వద్ద దాదాపు 12,000 పేటెంట్లు ఉన్నాయి. కాలక్రమంలో ఈ కంపెనీ చేతులు మారుతూ వచ్చింది.
వాణిజ్య యుద్ధంలో అదృశ్య ఆయుధం..
చైనాపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంలో ఇదే అత్యంత కీలక ఆయుధం. ఏఎస్ఎంల్ సంస్థ చైనాలోని సెమీకండక్టర్ మ్యాన్ఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్ప్కు ఈయూవీ యంత్రం విక్రయించకుండా ఆపేశారు. వాస్తవానికి ఏఎస్ఎంల్కు ఈయూవీ యంత్రం తయారీకి 5,000 మంది సరఫరాదారులు ఉన్నారు. వీటిలో అమెరికా కంపెనీలు కూడా ఉన్నాయి. 2019లో ట్రంప్ కార్యవర్గం డచ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి అత్యాధునిక ఈయూవీ యంత్రాన్ని విక్రయించడానికి అనుమతులు మంజూరుకానివ్వలేదు. దీంతో చైనా పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే చైనా అత్యంత సూక్ష్మ సెమీకండక్టర్ల విషయం బాగా వెనుకపడిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ కంపెనీ 2018లో చైనాతో ఒప్పందం చేసుకొంది. అది 2020 డిసెంబర్తో ముగిసింది. తాజాగా ఆ డీల్ను పొడిగించినట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికా నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఆన్ ఇంటెలిజెన్స్(ఎన్ఎస్సీఏఐ) ఒక నివేదిక ఇచ్చింది. జపాన్, నెదర్లాండ్స్ సమన్వయం చేసుకొని చిప్ తయారీ యంత్రాలు చైనాకు వెళ్లకుండా చూడాలని సూచించింది. ఆ సూచనలు వచ్చాకే ఏఎస్ఎంల్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. పాత టెక్నాలజీ ఆధారంగా పనిచేసే డీప్ అల్ట్రావైలెట్ లిథోగ్రఫీ (డీయూవీ) యంత్రాల్ని మాత్రం సరఫరా చేస్తోంది. ఈ విషయాన్ని నేడు ఏఎస్ఎంల్ ప్రకటించింది. దీంతో అమెరికాలో ఎన్ఎస్సీఏఐ మాటను దాటినట్లైంది. భవిష్యత్తులో మిత్రపక్షాల మధ్య సంబంధాలు బీటలవారే ముప్పుంది. మరోపక్క చైనా ఈ సంస్థ వద్ద ఉన్న అత్యంత క్లిష్టమైన టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఏప్రిల్లో సంస్థ అమెరికా ఆఫీస్లో ఆరుగురు ఉద్యోగులు వ్యాపార రహస్యాలను దొంగిలిస్తున్నారని గుర్తించారు. వారిలో చైనా జాతీయులు కూడా ఉన్నారు.
ఇదీ చూడండి: సముద్రంలో గుడ్డు కోసం ఈతగాళ్ల వేట