కరోనా వ్యాప్తి మొదలై ఏడాది దాటినా... మహమ్మారి వల్ల కలిగే అనోస్మియా(వాసనను పసిగట్టలేకపోవడం) సమస్యకు పరిష్కారం దొరకడం లేదని వైద్యులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మందిలో ఈ సమస్య ఆరు నెలల వరకు ఉంటుందని, మరికొందరిలో ఇది ఏడాది పాటు కొనసాగుతోందని పేర్కొన్నారు. యువతలోనే ఈ సమస్య అధికంగా ఉందన్న నిపుణులు... బాధితుల్లో కుంగుబాటు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. కొందరు ఈ సమస్య నుంచి బయటపడటం అసాధ్యమని అంటున్నారు.
గాబ్రియెల్లా సమస్య ఇలా...
గతేడాది నవంబర్లో కొవిడ్ బారినపడిన ఓ యువతి... వైరస్ను జయించిన తర్వాత కూడా ఎలాంటి వాసనను పసిగట్టలేకపోతున్నట్లు తెలిపారు.
"వాసన పసిగట్టలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పుడప్పుడు నా నుంచి దుర్వాసన వస్తుందేమో అనుమానం కూడా వస్తుంది. ఎలాంటి వాసనను పసిగట్టలేకపోవడం వల్ల సరిగా తినక, బరువు తగ్గతున్నాను. అత్మవిశ్వాసం కోల్పోతున్నాను."
-గాబ్రియెల్లా ఫార్జియోనె, బాధితురాలు.
గాబ్రియెల్లా సమస్యను పరిష్కరించేందుకు ఫ్రాన్స్ నీస్లోని 'యూనివర్సిటీ ఆఫ్ హెడ్ అండ్ నెక్' వైద్యనిపుణులు వైద్య నిపుణులు ప్రయత్నించారు. ఆమె ముక్కు కుడిభాగంలో చిన్న కెమెరాను ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని వాసనలు చూపించారు. అయినా... ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ, చివరిసారిగా చేసిన ప్రయత్నంలో ఆమె 'చేప' వాసనను పసిగట్టినట్లు డాక్టర్ క్లైర్ వాండెర్స్టీన్ స్పష్టం చేశారు. ఆమె పూర్తిగా వాసన పసిగట్టే గుణాన్ని కోల్పోలేదని పేర్కొన్నారు. కానీ, ఊహించిన స్థాయిలోనూ ఆమె వాసనను పసిగట్టలేకపోవడం బాధాకరమని అన్నారు.
ఇలాంటి సమస్యతోనే బాధపడుతోన్న సెసా అనే యువకుడిపైనా వైద్యులు పరీక్షలు జరిపారు. ఆయన వాసన పసిగడతారా?లేదా అని తెలుసుకునేందుకు సుగంధ ద్రవ్యాలను ఉపయోగించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:14 ఏళ్ల బాలికతో ఎంపీ పెళ్లి- దర్యాప్తు షురూ