పాకిస్థాన్ సింధ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓ చట్టసభ్యుడు(Pakistani lawmaker) వినూత్న బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. 18 ఏళ్లు నిండిన వారికి వివాహాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బిల్లు ముసాయిదాను అసెంబ్లీలో సమర్పించారు. సమాజంలో అనైతిక కార్యకలాపాలను నిరోధించటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నామని సదరు నేత తెలిపారు.
ఈ మేరకు 'ద సింధ్ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్-2021(The Sindh Compulsory Marriage Act, 2021)' బిల్లు ముసాయిదాను.. సింధ్ అసెంబ్లీ సెక్రటేరియట్కు మత్తాహిదా మజ్లిస్-ఏ-అమల్(ఎమ్ఎమ్ఏ) పార్టీకి చెందిన నేత సయ్యద్ అబ్దుల్ రషీద్ అందజేశారు. 18 ఏళ్లు దాటినవారికి వివాహం చేయని తల్లిందండ్రులు అందుకు గల కారణాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎదుట తెలియజేయాలని మసాయిదాలో పేర్కొన్నారు. అలా చేయని వారికి రూ.500ను జరిమానా విధించాలని తెలిపారు. ఈ బిల్లు ముసాయిదాను సమర్పించిన అనంతరం.. అబ్దుల్ రషీద్ ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు.
"సామాజిక రుగ్మతలు, పిల్లలపై అత్యాచారాలు, అనైతిక కార్యకలాపాలు, నేరాలు వంటివి దేశంలో పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించడానికి ముస్లిం(muslim) యువతీ యువకులుకు 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకునే హక్కును కల్పిస్తున్నాం. వారి తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.''
- సయ్యద్ అబ్దుల్ రషీద్ , ఎమ్ఎమ్ఏ నేత
ఈ బిల్లు చట్టరూపంలోకి మారితే.. సింధ్ రాష్ట్ర యువత పురోగతి చెందుతుందని అబ్దుల్ రషీద్ చెప్పారు. ఇందుకోసం అసెంబ్లీలోని సభ్యులంతా మద్దతు తెలపాలని కోరారు.
ఇదీ చూడండి: ప్రాంతీయ సవాళ్లపై మోదీ, మేక్రాన్ చర్చ
ఇదీ చూడండి: Vijay Mallya: విజయ్ మాల్యాకు కోర్టులో మళ్లీ మొండిచెయ్యి