కరోనా సోకే విషయంలో పురుషులు, మహిళలకు సమానంగా అవకాశాలు ఉన్నప్పటికీ.. తీవ్రంగా ప్రభావితం అవటం, మరణించడంలో పురుషులే అగ్రస్థానంలో ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. వయస్సు పైబడిన వారిలో మధుమేహం, అధిక రక్త పోటు వంటివి ఉంటే మరణాలు సంభవించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
కరోనా మరణాలపై అధ్యయనం చేశారు చైనాలోని బీజింగ్ టాంగ్రెన్ ఆస్పత్రికి చెందిన జిన్ కువాయ్ యాంగ్ అనే శాస్త్రవేత్త, ఆయన బృందం. సొంతంగా వైద్యం చేసుకుంటున్న 43 మంది వైద్యులు, 1056 మంది కరోనా రోగుల పరిస్థితిని పరిశీలించారు. వారి పరిశోధనకు సంబంధించిన నివేదిక 'ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్' జర్నల్లో ప్రచురితమైంది.
కరోనా కారణంగా మరణిస్తున్న వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు జనవరిలోనే గుర్తించాం. ఇది పురుషులు కొవిడ్-19 బారిన పడడానికి, చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందా? అనే ప్రశ్నను లేవనెత్తింది. కరోనా మరణాల్లో లింగ భేదం ఉన్నట్లు ఎవరూ గుర్తించలేదని మేము కనుగొన్నాము. అందువల్ల దర్యాప్తు ప్రారంభించాం.
-జిన్ కువాయ్ యాంగ్, శాస్త్రవేత్త, టాంగ్రెన్ ఆస్పత్రి
ఇతరులతో పోలిస్తే కొంత మందే వైరస్ వల్ల అధికంగా ప్రభావితమవుతున్నారనే విషయంపై కారణాలు ఇంకా స్పష్టంగా తెలియదని పరిశోధకులు చెప్పారు. కానీ, వయస్సు పైబడిన పురుషులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి అదనపు సంరక్షణ అవసరమని తెలిపారు. కొవిడ్-19కు పురుషులు, మహిళల స్పందనలో తేడాలు ఉన్నట్లు కనుగొన్నారు.
70 శాతం మంది పురుషులే
వైరస్ బారిన పడిన పురుషులు, మహిళల సంఖ్య, వయస్సు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. మగవారిలోనే ఎక్కువ తీవ్రత ఉన్నట్లు తెలిపారు పరిశోధకులు. ఇప్పటి వరకు మరణించిన వారిలో సుమారు 70 శాతం మంది పురుషులేనని వెల్లడించారు. మహిళల మరణాలతో పోలిస్తే పురుషుల్లో మరణాల రేటు 2.5 శాతం అధికంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వయస్సుతో సంబంధం లేకుండా పురుషుల్లోనే అధికంగా ప్రభావం ఉందని తెలిపారు. 2003లో వచ్చిన సార్స్ వైరస్ డేటా ప్రకారం.. అప్పటి లాగే మగవారిలోనే మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ సమయంలో 7 మిలియన్ల మందికి గర్భం!