తూర్పు లద్దాఖ్లో భారత్-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయి. మూడు అంచెలలో ఇరు దేశాల బలగాల ఉపసంహరణకు, ఇటీవల నిర్మించిన నిర్మాణాలను ఇరు దేశాలు కూల్చివేసేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాలు ఏప్రిల్ నుంచి భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొన్ని మౌలిక వసతులను నిర్మించాయి. వీటిని కూల్చివేయడంతోపాటు దళాలను తిరిగి ఏప్రిల్-మే నెలలకు ముందు ఉన్న చోట్లకు తీసుకెళ్ళడానికి తాజాగా అంగీకారం కుదిరినట్లు సమాచారం. మూడు అంచెల ఉపసంహరణ ప్రక్రియ నిర్ణీత కాలంలో పూర్తి అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మొదట పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ తమ ట్యాంకులు, సాయుధ సిబ్బంది వాహనాలను ఎల్ఏసీ నుంచి దూరంగా తరలిస్తాయి. ఈ ప్రక్రియ ఒక్క రోజులో పూర్తవుతుంది.
ఇదీ చూడండి: 'మూడంచెల చైనా 'ప్రణాళిక'తో భారత్కే నష్టం'
ఉపసంహరణ ఇలా..
ఆ తర్వాత, పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉన్న దళాల్లో రోజుకు 30 శాతం మంది చొప్పున ఇరు దేశాలు ఉపసంహరించుకుంటాయి. ఈ విధంగా 3 రోజుల్లో మొత్తం బలగాలను వెనక్కిరప్పిస్తాయి. భారత దళాలు ధన్ సింగ్ థాపా పోస్ట్ వద్దకు, చైనా దళాలు ఫింగర్ 8 తూర్పు భాగానికి చేరుకుంటాయి.
ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణకు భారత్-చైనా ఓకే
చివరగా పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరం వెంబడి ఫ్రంట్లైన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటాయి. చుషూల్, రేజాంగ్ లా ఏరియాల చుట్టూ ఉన్న హైట్స్, భూభాగాల నుంచి కూడా బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రణాళిక సక్రమంగా అమలవుతున్నదీ, లేనిదీ పరిశీలించేందుకు ఇరు దేశాలు ఉమ్మడి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాయి. ప్రతినిధుల సమావేశాలు, మానవ రహిత ఏరియల్ వెహికిల్స్ ద్వారా సమీక్షిస్తాయి.