భారత్-పాకిస్థాన్ సత్సంబంధాలు కలిగి ఉండాలని, శాంతి, సుస్థిరతలను పెంపొందించడానికి ఇరుదేశాలు చేతులు కలపాలని.. చైనా కోరుకుంటున్నట్లు భారత్లోని ఆ దేశ రాయబారి సన్ వీడాంగ్ పేర్కొన్నారు. చైనా-భారత్ల మధ్య కూడా చర్చలు మరింత పురోగతి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపఖండం అభివృద్ధికి భారత్-చైనా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఇటీవల జరిగిన రెండో అనధికారిక చర్చల తరువాత సన్ వీడాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"చైనా-భారత్, చైనా-పాకిస్థాన్, భారత్-పాక్ల మధ్య మంచి సంబంధాల కోసం హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్నామని చైనా నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి ఇరుదేశాలు కృషిచేయాలని, ప్రాంతీయ అభివృద్ధి, శ్రేయస్సు కోసం దాయాది దేశాలు చేతులు కలపాలని మేము ఆశిస్తున్నాం."- సన్ వీడాంగ్, భారత్లోని చైనా రాయబారి
'పుల్వామా'తో మొదలైంది...
జమ్ముకశ్మీర్ పుల్వామాలో పాక్ ఆధారిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఫలితంగా భారత్-పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానికదళం దాడి చేసి నాశనం చేసింది. దీనిపై పాకిస్థాన్ తనపైన జరిగిన దాడిగా అభివర్ణించింది.
ఆర్టికల్ 370 రద్దుతో
జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేసింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న పాక్.. అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యతిరేక వాదనలు వినిపించింది. అయితే పాక్కు చైనా తప్ప మిగిలిన సూపర్ పవర్ దేశాలైన రష్యా, ఫ్రాన్స్, అమెరికా మద్దతు లభించలేదు. కశ్మీర్ భారత అంతర్గత విషయమని ఆయా దేశాలు తేల్చిచెప్పాయి.
జిన్పింగ్- ఇమ్రాన్ చర్చలు
భారత్ పర్యటనకు వచ్చే ముందు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ భేటీ అయ్యారు. ఇమ్రాన్తో పాక్ ప్రధాన సైన్యాధికారి కూడా ఉన్నారు. వీరు కశ్మీర్, సీపెక్ల గురించి చర్చించారు.
ఈ చర్యను భారత్ ఖండించింది. కశ్మీర్ భారత అంతర్గత విషయమని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించిన తరువాతనే చర్చలు జరిపే అవకాశముందని స్పష్టం చేసింది. చేసేది లేక చైనా.. ఇరుదేశాలు శాంతం వహించాలని చెప్పడం ప్రారంభించింది.
పాక్....సార్క్ ఎత్తుగడ
ఆసక్తికరంగా, సార్క్ శిఖరాగ్ర సమావేశానికి తాము ఆతిథ్యం ఇస్తామని పాక్ ప్రకటించింది. ఈ సమావేశానికి సభ్యదేశమైన భారత్ను కూడా ఆహ్వానించే అవకాశముంది. అయితే ఇంతకు ముందు దక్షిణాసియా ప్రాంతీయ ఫోరంలోనూ.. పాక్ వేసిన ఎత్తుగడలు ఫలితం ఇవ్వలేకపోయాయి.
ఇదీ చూడండి: సీతాకోక చిలుకల పలకరింపు.. ప్రకృతి పరవశింపు!