హెచ్-1బీ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకూ రద్దుచేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసిన భారతీయులకు అమెరికా న్యాయస్థానంలో నిరాశ ఎదురైంది.
ఉపాధి వీసాపై అగ్రరాజ్యంలో ఉంటూ ఇటీవలే భారత్కు తిరిగి వచ్చిన 169 మంది భారతీయులు, ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వీసా నిషేధం సబబు కాదని, నిలకడలేనిదని ఆరోపించారు. వీసా రద్దును ఎత్తివేయాల్సిందిగా ఆదేశించాలని కోరారు. వీసా ప్రక్రియను తిరిగి పునరుద్ధరించాలని అభ్యర్ధించారు. అయితే, ఈ కేసును పరిశీలించిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి, భారతీయ-అమెరికన్ అయిన అమిత్ మెహతా 169 మంది వేసిన వ్యాజ్యాన్ని తిరస్కరించారు. పిటిషనర్లు తమ వాదనను నిరూపించేందుకు సరైన ఆధారాలను అందించలేకపోయారని స్పష్టంచేశారు.
ట్రంప్ కఠిన నిర్ణయం..
విదేశాలకు చెందిన ఉద్యోగులు అగ్రరాజ్యంలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాల జారీని ఈ ఏడాది డిసెంబరు వరకు నిలిపివేస్తూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 22న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విదేశీయుల వల్ల అమెరికా పౌరుల ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ ప్రకటించారు. కాగా, ఈ నిర్ణయానికి విదేశీ ఉద్యోగుల నుంచే కాకుండా అమెరికా సంస్థల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇదీ చదవండి: అమెరికా ఉద్యోగంపై మళ్లీ చిగురించిన ఆశలు