కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి సుమారు 1 లక్షా 19 వేల మందికి పైగా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 19 లక్షల 25 వేలు దాటింది. సుమారు 4 లక్షల 48 వేల మంది కోలుకోవడం కొంత ఊరట.
చైనాలో కొత్త కేసులు
చైనాలో కొత్తగా 89 కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన చైనా పౌరుల్లో 86 మందికి కొవిడ్-19 వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. మిగతా 3 కేసులు దేశీయంగా గువాంగ్డాంగ్ రాష్ట్రంలో నమోదయ్యాయి.
అమెరికా, రష్యా, ఇరాన్, ఐరోపా దేశాల నుంచి చైనా పౌరులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ కారణంగానే కొవిడ్-19 కేసులు మళ్లీ పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కట్టడి చేశామనుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తుండడంపై అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఆంక్షలు ఎత్తివేసే దిశగా ..
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన ఆంక్షలను... ఏప్రిల్ 30 కంటే ముందే తొలగించే దిశగా ఆలోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. శ్వేతసౌధంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
"నేను నా బృందంతో, నిపుణులతో చర్చలు జరుపుతున్నాను. షెడ్యూల్ కంటే ముందే దేశంలో అమలుపరుస్తున్న ఆంక్షలను తొలగించేందుకు కృషిచేస్తున్నాం. ఇది ఇప్పుడు చాలా ముఖ్యం." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించారు. దీనితో అమెరికాలోని 330 మిలియన్ల జనాభాలో 95 శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ ఆంక్షల అమలు వల్ల తమ దేశం ఆర్థికంగా దెబ్బతింటుందని ట్రంప్ భావిస్తున్నారు.
అమెరికాలో సోమవారం 1,334 మంది కరోనాతో మరణించగా, 24,896 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కొవిడ్-19 మరణాలు, కేసుల కంటే ఈ సంఖ్య చాలా తక్కువ. దీనిని అనుసరించి అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
![world corona death toll](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6785015_world-corona.jpg)
ఇదీ చూడండి: 'భారత్కు క్షిపణుల విక్రయానికి అమెరికా రెడీ'