అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన ఎస్యూవీ కారు ప్రమాద బాధితుల్లో మెక్సికోకు చెందిన వారున్నట్లు అధికారులు గుర్తించారు. వారంతా సరిహద్దులో ఉన్న కంచెను కత్తిరించి వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మరణించినట్లు పేర్కొన్నారు. వీరంతా వలస స్మగ్లింగ్ ఆపరేషన్లో భాగమని తెలిపారు.
ఈ స్మగ్లింగ్తో సంబంధం ఉన్నవాళ్లు మొత్తం 44 మంది కాగా... వారిలో సబర్బన్లో వచ్చిన19 మంది పెట్రోలింగ్ అధికారులకు దొరికిపోయారు. మరో 25 మంది ఉన్న ఎస్యూవీ.. పెట్రోలింగ్ సిబ్బందికి చిక్కకుండా తప్పించుకుంది. అనంతరం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చనిపోయిన 13 మందిలో 10 మందిని మెక్సికన్ పౌరులుగా గుర్తించారు. ఎస్యూవీలో మిగిలిన వారు, ట్రక్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని బార్డర్ పెట్రోలింగ్ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. తరచుగా కంచె దాటుతూ పలువురు విషాదంలో చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు.