కరోనా మహమ్మారి కట్టడికి పలు టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అత్యవసర వినియోగంలో భాగంగా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా నాలుగోవంతు ప్రజలు 2022 వరకు టీకా పొందలేరని ఓ నివేదిక తేల్చింది. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల పంపిణీ సవాళ్లతో కూడుకున్న అంశంగా పేర్కొంది. ఈ పరిశోధన వివరాలు బీఎంజే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ముందస్తు బుకింగ్స్ను పరిశీలించి పలు విషయాలు వెల్లడించారు.
" అధిక ఆదాయ దేశాలు భవిష్యత్తులో కొవిడ్-19 వ్యాక్సిన్ సరఫరా కోసం ఏ విధంగా వ్యవహరిస్తున్నాయనేదానిపై మా అధ్యయనం ఒక అవగాహన కల్పిస్తోంది. కానీ, మిగతా ప్రపంచం వ్యాక్సిన్ పొందటంపై అనిశ్చితి నెలకొంది. పారదర్శకతతో కొవిడ్-19 వ్యాక్సిన్ సమానంగా కేటాయించటంపై ప్రభుత్వాలు, తయారీ సంస్థలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది."
- పరిశోధకుడు
అధ్యయనంలోని కీలక అంశాలు..
- ప్రపంచవ్యాప్తంగా 48 కొవిడ్-19 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. అందులో 13 సంస్థల నుంచి పలు దేశాలు నవంబర్ 15 నాటికి 748 కోట్ల డోసులను రిజర్వ్ చేసుకున్నాయి.
- ఇప్పటికే ముందస్తు ఒప్పందాలు చేసుకున్న డోసుల్లో 51 శాతం అధిక ఆదాయ దేశాలకే వెళ్లనున్నాయి. అది 14 శాతం ప్రపంచ జనాభాను సూచిస్తోంది. మిగతా 85 శాతానికిపైగా జనాభా స్వల్ప, మధ్యాదాయ దేశాల్లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
- ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ క్యాండిడేట్లు విజయవంతమైతే.. 2021 చివరి నాటికి మొత్తం 596 కోట్ల కోర్సులు (1192 కోట్ల డోసులు) తయారు చేసే సామర్థ్యం ఉంది. వాటి ధర ఒక్కో కోర్సుకు 6-74 డాలర్ల మేర ఉండనుంది.
- 40 శాతం వ్యాక్సిన్ కోర్సులు స్వల్ప, మధ్య ఆదాయ దేశాలకు కేటాయించే వీలుంటుంది. అయితే.. అది అమెరికా, రష్యా వంటి అధిక ఆదాయ దేశాలు ఏ విధంగా అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాయనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
- టీకా తయారీదారులందరూ తమ గరిష్ఠ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడంలో విజయవంతం అయినప్పటికీ, ప్రపంచ జనాభాలో కనీసం నాలుగోవంతు మందికి 2022 వరకు వ్యాక్సిన్ అందే పరిస్థితి లేదు.
370 కోట్ల మంది సిద్ధం..
బీఎంజే జర్నల్లోనే ప్రచురితమైన మరో అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల మంది టీకా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంచనా వేసింది. అది ప్రపంచ జనాభాలో 68 శాతం ఉంటుందని తేల్చింది. ఈ అధ్యయనంలో చైనా, అమెరికాకు చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. న్యాయమైన, సమానమైన కేటాయింపు వ్యూహాల అభివృద్ధికి తమ అధ్యయనం మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు.
ఇదీ చూడండి:ఆసుపత్రి నుంచి వచ్చాక ఆ 10 రోజులు ముప్పే!