అమెరికా అధ్యక్ష పదవి కోసం రెండోసారి పోటీపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. గురువారం ఆయన నామినేషన్ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో ట్రంప్ ప్రసంగించారు. ఈ వేదికపై ప్రత్యర్థి జో బైడెన్ సహా తన 47 ఏళ్ల రాజకీయ రికార్డుల గురించి ప్రస్తావించారు. డెమొక్రాట్లను 'ఆల్ట్రా రాడికల్ లెఫ్ట్'గా అభివర్ణించిన ట్రంప్.. జాత్యహంకారం, నల్లజాతీయుల సమస్యల పేరిట డెమొక్రాట్ నియంత్రణలో ఉన్న మిన్నియాపొలిస్ లేదా కేనోషాలో ఘర్షణలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు.
"అమెరికా చరిత్రలోనే ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. గతంలో ఎప్పుడూ రెండు పార్టీలు, రెండు విజన్లు, రెండు ఫిలాసఫీలు, రెండు అజెండాల మధ్య స్పష్టమైన ఎంపిక ఓటర్లకు ఉండేది కాదు. అమెరికన్ కలను రక్షించుకోవాలా? లేదంటే సోషలిస్ట్ ఎజెండాకు అనుమతి ఇచ్చి నాశనం చేసుకోవాలా? అనేది మీరే నిర్ణయించుకోండి"
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
"అమెరికన్ల జీవన విధానాన్ని కాపాడే రిపబ్లికన్లకా ఓటు? లేదంటే ఒక రాడికల్ ఉద్యమానికి ఊతమిచ్చి దేశాన్ని నాశనం చేసే వాళ్లకు అనుమతిస్తారా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని'' ట్రంప్ అన్నారు.
"డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్లో మాట్లాడిన జో బైడెన్ అమెరికాలో జాతి, ఆర్థిక, సామాజిక అన్యాయం గురించే ప్రస్తావించారు. ఈ రాత్రి నేను మిమ్మల్ని చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాను. మన దేశాన్ని కూల్చివేసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న డెమొక్రాట్ పార్టీ.. దేశాన్ని నడిపిస్తామని ఎలా అధికారం అడగగలదు?" అని ట్రంప్ తన 71 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ప్రశ్నల వర్షం కురిపించారు.
విమర్శలే విమర్శలు...
బహిరంగ సభ రూపంలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరగ్గా.. గతవారం వర్చువల్గా డెమొక్రాట్ కన్వెన్షన్ నిర్వహించారు. ఎంతో పేరున్న, అధ్యక్షులకు నెలవైన వైట్హౌస్ను ట్రంప్ రాజకీయ కార్యక్రమానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రధాన సమస్యలు ఏంటి? ట్రంప్ ప్రసంగంపై అభిప్రాయం.? వంటి అంశాలపై 'బ్యాటిల్గ్రౌండ్యూఎస్ఏ2020' పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మ. ఇందులో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సహా ట్రంప్ ప్రసంగంపై నిపుణులు అభిప్రాయమిదే.
" దాదాపు 1500 మంది వైట్హౌస్ దగ్గర సమావేశమయ్యారు. వారిలో ఒక్కరూ మాస్కు ధరించలేదు. అది కచ్చితంగా గమనించాల్సిన అంశం. భౌతిక దూరం అనేదే లేదు. ప్రస్తుతం మహమ్మారి లేనట్లు కరోనా ఎప్పుడిదో అనేలా ఓ వక్త మాట్లాడారు. ఇదంగా వాస్తవికతకు దూరంగా, వేరే ప్రపంచంలా అనిపించింది. వైట్హౌస్ ముఖద్వారం వద్ద నిరసనకారులు లోపలికి రాకుండా పోలీసులు గేట్ల వద్ద రక్షణగా ఉన్నారు. అది చూశాక రెండు దేశాల మధ్య ఉన్నట్లు అనిపించింది. కొంత కాలంగా పరిస్థితులు అలానే ఉన్నా.. ఈరోజు అది స్పష్టంగా తెలిసింది"
-- సీమా సిరోహీ, సీనియర్ జర్నలిస్ట్ అండ్ కాలమిస్ట్, వాషింగ్టన్ డీసీ
'ఓపెన్ ఎంబ్రాస్: ఇండో-యూఎస్ టైస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ మోదీ అండ్ ట్రంప్' అనే పుస్తకం రాసిన వర్గీస్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
"అమెరికా అంటే ఏమిటి? ట్రంప్ దృక్పథంలో అది ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ రోజు ఓ కథ విన్నాం. కొన్ని రోజుల క్రితం అమెరికా అంటే ఏమిటో బైడెన్ ప్రచారంలోనూ ఓ కథ విన్నాం. ఒకే స్థాయిలో రెండు ప్రసంగాలు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ వారి కథలకు ఎవరికి మెజారిటీ మద్దతు లభిస్తుందనేది ఎన్నికే నిర్ణయిస్తుంది"
-- వర్గీస్ కే జార్జ్, హిందూ సంస్థలో అసోసియేట్ ఎడిటర్
"ట్రంప్, బైడెన్ కథల మధ్య పోటీ నడిచింది. అయితే డొనాల్డ్ కథ కొన్ని విషయాలను బయటపెట్టింది. 'మేము వైరస్ గురించి పట్టించుకోము, మేము వైరస్కు లొంగిపోని నాగరికత. కానీ తిరిగి పోరాడి వైరస్ను జయిస్తాం' అనేది మాత్రం ప్రజలకు, ప్రపంచానికి తెలియజేశారు ట్రంప్" అని వర్గీస్ అభిప్రాయపడ్డారు.
ఆ క్రెడిట్ అంతా ట్రంప్ ఖాతాలోనే..?
''రిపబ్లికన్లు, భాజపాకు మధ్య రాజకీయ సైద్ధాంతిక ప్రచారాల్లో సమాంతరాలు కనిపిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కుల అడ్డంకులను అధిగమించేందుకు హిందూ-హిందుత్వ ఎజెండాను ప్రోత్సహించారు. అదే విధంగా బ్లాక్ లివ్స్ విషయంపై కఠినంగా ఉంటూ ట్రంప్ మెజార్టీ కాథలిక్ విశ్వాసాన్ని చూరగొంటున్నారని'' విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ట్రంప్ తన ప్రచారంలో బైడెన్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీజింగ్పై సానుకూల నిర్ణయాలు.. బైడెన్ ఎన్నికైతే అమెరికా.. చైనా అధీనంలోకి వెళ్లిపోతుందని ట్రంప్ అన్నారు. జెరూసలేంలో యూఎస్ ఎంబసీ ఏర్పాటు సహా ఇజ్రాయెల్-యూఏఈ మధ్య చారిత్రక ఒప్పందాన్ని తన కీలక నిర్ణయాల్లో ఒకటిగా ఆయన పేర్కొన్నారు.
"నేను అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమాసియా అంతా గొడవలతో ఉంది. ఐసిస్ చెలరేగిపోతోంది. ఇరాన్ పెచ్చరిల్లుతుంటే.. అఫ్గాన్లో యుద్ధం ఆగేలా కనిపించలేదు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగాను. నా కంటే ముందు పనిచేసిన అధ్యక్షుల మాదిరిగా కాకుండా నా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. ఇజ్రాయెల్ నిజమైన రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ.. రాయబార కార్యాలయాన్ని అక్కడకు తరలించాం."
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
"ఏడు దశాబ్దాల విభేదాలకు ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న తొలి దేశంగా గల్ఫ్ నిలిచింది. గత 25 ఏళ్లలో పశ్చిమాసియా దేశాలతో జరిగిన శాంతి ఒప్పందం ఇదే. ఐసిస్ నాయకుడు అబు బకర్ అల్-బాగ్దాదీని చంపడం, మరో ఆపరేషన్లో ఖాసిం సులేమానీని చంపాం. అమెరికా కొత్త యుద్ధాలు చేపట్టకుండా మన దళాలను స్వస్థలాలకు తీసుకొచ్చాం" అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనిపై మైథోస్ ల్యాబ్స్ సీఈఓ ప్రియాంక్ తన అభిప్రాయం వెల్లడించారు.
" విదేశీ విధానం, అమెరికా ఎన్నికలకు సంబంధం లేదు. బిన్ లాడెన్లా సులేమానీ పేరు ప్రాముఖ్యమైనది కాదు. కానీ మళ్లీ అలనాటి మ్యాజిక్ను క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు సులేమానీ అనే పేరే అమెరికన్లకు తెలియదు. కానీ ఒబామా హయాంలో అమెరికన్ సీల్స్ లాడెన్ను చంపాక.. ప్రజలు రోడ్లపై సంబరాలు చేసుకున్నారు."
-- ప్రియాంక్ మాథుర్, మైథోస్ ల్యాబ్స్ సీఈఓ
కరోనా నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వాడకం వల్ల ఎన్నికలు, ఫలితాలకు ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? అన్న కోణంలోనూ విశ్లేషకులు మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ సేకరణకు సమయం పడుతుంది కాబట్టి ఎన్నికల ఫలితాలు నవంబర్ 4న రాకపోచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారం పాటు అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం కావొచ్చని అంచనా వేశారు.