అమెరికాలో భారత సంతతి మహిళ పియా దాండియాకు అపూర్వ గౌరవం లభించింది. 2020-21 ఏడాదికి గాను 'వైట్హౌస్ ఫెలో'గా ఎంపికైన 14 మందిలో ఆమెకు చోటు దక్కింది.
విద్యా శాఖలో దాండియాను నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. దాండియా నిర్వహిస్తున్న విద్యాసంస్థ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి విద్యనందించటంలో విశేష కృషి చేసిందని శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది.
ప్రస్తతం న్యూయార్క్లోని హర్లీమ్లో డెమొక్రసీ ప్రెప్ ఎండ్యురెన్స్ హైస్కూల్కు వ్యవస్థాపక ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు దాండియా. 28 ఏళ్లకే బాధ్యతలు స్వీకరించి పిన్న వయస్కురాలైన ప్రిన్సిపల్గా నిలిచారు.
జాన్సన్ ఆలోచనతో..
అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ జాన్సన్.. 1964లో 'వైట్హౌస్ ఫెలోషిప్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా యువత, మహిళలకు ఫెడరల్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారు. జాతీయ వ్యవహారాల్లో ఉన్నత స్థాయి అనుభవం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. వీరి ఫెలోషిప్ ఏడాది కాలం ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని పార్టీలతో సంబంధం లేకుండా.. డెమొక్రాట్, రిపబ్లికన్ ప్రభుత్వాలు సంప్రదాయంగా ఆచరిస్తున్నాయి. పౌరులకు ప్రోత్సాహం, దేశానికి సేవ చేయటం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం.
ఇదీ చూడండి: నీవూ అధ్యక్షురాలివి కావొచ్చు: కమలా హారిస్