అఫ్గానిస్థాన్లో హింసకు బాధ్యతాయుతమైన ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారని తెలిపింది అమెరికా. మళ్లీ ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఎప్పటికీ మారకుండా చర్యలు తీసుకోనున్నట్లు శ్వేతసౌధ మీడియా సెక్రెటరీ జెన్ సాకి.. శుక్రవారం వెల్లడించారు.
"అఫ్గాన్లో చెలరేగుతున్న ఘర్షణలకు బాధ్యతాయుతమైన ముగింపు ఇచ్చేందుకు బైడెన్ కట్టుబడి ఉన్నారు. అమెరికా బలగాలను ఆ దేశం నుంచి ఉపసంహరించేలా, ఉగ్రవాదులకు అఫ్గాన్ మళ్లీ స్థిర స్థావరంలా మారకుండా చర్యలు చేపడుతున్నారు. మే 1 లోపు ఆ దేశం నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించడం సవాలుతో కూడుకున్నదే కానీ, అంతకంటే ముందే ఆ ప్రక్రియ పూర్తయిందనే వార్త వింటామని నేను భావిస్తున్నాను."
- జెన్ సాకి, వైట్హౌస్ మీడియా సెక్రెటరీ.
ఇతర భాగస్వామ్య దేశాలతో సంప్రదింపులు, జాతీయ భద్రతా బృంద సూచనల ప్రకారం అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణపై జో బైడెన్ నిర్ణయం తీసుకుంటారని జెన్ సాకి తెలిపారు. దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా, బలగాల భద్రతే ధ్యేయంగా ఆయన చర్యలు చేపడుతారని స్పష్టం చేశారు. అదే సమయంలో.. తాలిబన్లతోనూ దౌత్యచర్చలు జరుపుతారని పేర్కొన్నారు.
చైనాతో ఓపికగా సంప్రదింపులు..
తైవాన్పై చైనా వ్యవహరిస్తున్న తీరును అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని జెన్సాకి తెలిపారు. ఈ విషయమై చైనాతో అమెరికా ఓపికగా సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు.
"తైవాన్పై చైనా అనుసరిస్తున్న విధానాలపై మా ఆందోళనను అన్ని విధాలుగా వ్యక్తపరుస్తున్నాం. తైవాన్లో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి బలవంతపు చర్యలను చైనా చేపట్టింది. తైవాన్లో చైనా ఆర్మీ కార్యకలాపాలు.. అస్థిరతను కలిగిస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ విషయమై మేము హడావుడిగా కాకుండా చైనాతో ఓపికగా సంప్రదింపులు జరుపుతున్నాం. మా దేశంలోని అంతర్గత పరిస్థితులను బలోపతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో బలమైన నాయకత్వంతో భాగస్వామ్య దేశాలతో ముందుకు సాగుతున్నాం. "
-జెన్ సాకి, వైట్హౌస్ మీడియా సెక్రెటరీ
దేశంలో మౌలిక వసతుల నిర్మాణంపై తాము ప్రస్తుతం దృష్టి సారించామని, అదే విధంగా తమ భాగస్వామ్య దేశాలతోనూ కలిసి పని చేస్తున్నామని జెన్సాకి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అమెరికా నౌక సంచారంపై భారత్ తీవ్ర అభ్యంతరం