తమ తాత, ప్రముఖ నటుడు దివంగత ఎస్వీ రంగారావు గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో వివాదం కనిపించడం లేదని ఆయన మనవళ్లు తెలిపారు. తమకు, బాలకృష్ణకు మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో ఆ సినిమా హీరో బాలకృష్ణ .. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులను కించపరిచేలా మాట్లాడారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వాటిపై స్పందించిన ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) వీడియో బైట్ రిలీజ్ చేశారు.
"నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సక్సెస్ మీట్లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా మేం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి మంచి అనుబంధం ఉంది. మేం ఒక కుటుంబంగా ఉంటాం. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన సాధారణ పోకడలో చెప్పారు. ఈ విషయంలో మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా సాగిదీయవద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టొద్దు" అని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'జక్కన్న ఈ ఖాళీ కుర్చీ ఎప్పటికీ మీదే'.. రాజమౌళికి సుకుమార్ స్పెషల్ విషెస్